మళ్లీ.. ఎక్కడ చెడింది: పురంధేశ్వరి దిమ్మతిరిగే 'లెక్క', షాక్.. బాబుపై సోము వీర్రాజు ప్రశంస, కానీ
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మిత్రధర్మం పాటిస్తున్నామని, బీజేపీ వద్దనుకుంటే మాత్రం అది వారి ఇష్టమని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఏడాదిలో ఎన్డీయే నుంచి బయటకు రావాలని టీడీపీ భావిస్తోందా అనే చర్చ సాగుతోంది.
చదవండి: నమ్మకం ముఖ్యం, మోడీని విశ్వసిస్తున్నా లేదంటే: బాబు షాకింగ్ కామెంట్స్
గతంలో సోము వీర్రాజు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ వంటి నాయకులు మాట్లాడినప్పుడు కూడా చంద్రబాబు వారి మాటలను పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. అయితే, ఇటీవల బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు ఆయనకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయని అంటున్నారు. టీడీపీకి అనుకూలంగా ఉంటాడని భావించే విష్ణు నుంచి.. టీడీపీపై విమర్శలు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇదే బాబుకు తీవ్ర ఆగ్రహం తెప్పించిందని తెలుస్తోంది.
చదవండి: కొత్తగూడెంలో జనసేనానికి చేదు: ఓ వైపు సీఐ మరోవైపు ఏసీపీ, పవన్ 20 ని.లు ఏం చెప్పారో
Recommended Video
మరోవైపు, తాము విభజన హామీలపై సుప్రీం కోర్టుకు వెళ్తామన్న చంద్రబాబు వ్యాఖ్యలు బీజేపీకి తీవ్ర ఆగ్రహం తెప్పించాయని అంటున్నారు. మోడీపై కాదని, మోడీకి వ్యతిరేకం కాదని చంద్రబాబు చెప్పినప్పటికీ.. సుప్రీంకు వెళ్తామని చెప్పడం ద్వారా ఏం సంకేతాలు ఇచ్చారనే అంశం బీజేపీ ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది.
చదవండి: ఇంత దుర్మార్గపు ఆలోచనా?: పవన్ను ఏకిపారేసిన లక్ష్మీపార్వతి
జగన్ ఆస్తులు తీసుకోవాలని అడుగుతున్నా
కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నానని, జగన్నే కాదు అక్రమంగా ఎవరు ఆస్తులు సంపాదించినా స్వాధీనం చేసుకుని ప్రజల కోసం ఖర్చు పెట్టాలని, బీహార్, ఒడిశాలో అదే చేశారని, ఈ భయం లేకపోతే కొన్ని రోజులు జైలుకు వెళ్లి వచ్చినా ఫర్వాలేదని, అస్తులుంటే బాగుపడతామని అనుకుంటున్నారని, అగ్రిగోల్డ్ ఆస్తుల్ని, ఎర్రచందనం అక్రమ రవాణాతో సంపాదించిన వారి ఆస్తుల్ని, అవినీతితో రూ.కోట్లలో కూడబెట్టినవారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలని, అదే వారికి విధించే నిజమైన శిక్ష అని, సంపాదించిన ఆస్తులన్నీ పోయి జీరోకి వస్తేనే భయముంటుందని చంద్రబాబు అన్నారు.
దండం పెడతాం
బీజేపీ నేతలు సోము వీర్రాజు, విష్ణులు మాట్లాడిన విషయాల గురించి వాళ్ల పార్టీ నాయకత్వం ఆలోచించుకోవాలని, నేను మాత్రం మా పార్టీ నాయకులను బయట మాట్లాడవద్దని గట్టిగా చెబుతున్నానని, తాడేపల్లిగూడెం టీడీపీ నేత ఒకరు బీజేపీపై విమర్శలు చేస్తే గట్టిగా కోప్పడ్డానని చంద్రబాబు అన్నారు. రెండు పార్టీలు కలిసి నడిచే విషయంలో మరీ కుదరకుంటే దండం పెడతామే తప్ప బయట రచ్చ చేయడం తమ పద్ధతి కాదన్నారు.
టీడీపీ ఇలా, బీజేపీ అలా
చంద్రబాబు మాటలు చూస్తుంటే ఎన్నికల ఏడాదిలో బయటకు వెళ్లాలని భావిస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ అండగా ఉండే అవకాశాలు ఉన్నందున.. మరికొద్ది రోజులు వేచి చూసి దండం పెట్టే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. కేంద్రం ఆశించిన సాయం చేయడం లేదని టీడీపీ నేతలు అంటుంటే, కేంద్రం సాయంతోనే ఏపీలో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని బీజేపీ నేతలు అంటున్నారు. ఇటీవల చంద్రబాబు 13 డిమాండ్లతో ప్రధానిని కలిస్తే, నాలుగు ప్రధాన డిమాండ్లతో నోట్ పంపాలని మోడీ ఇటీవల అడిగారు. నాలుగేళ్ల తర్వాత అడగడంపై టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి విష్ణు వ్యాఖ్యలు, చంద్రబాబు కౌంటర్తో విడిపోవడానికి తొలి అడుగుపడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎప్పటి నుంచి గ్యాప్ ఉన్నప్పటికీ ప్రస్తుతం ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.
ఇవీ కేంద్రం ఇచ్చే నిధులు
చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ నేతలు పురంధేశ్వరి, సోము వీర్రాజు ఘాటుగా స్పందించారు. కేంద్ర పథకాల పేర్లు మార్చి చంద్రబాబు ప్రభుత్వం సొంత ప్రచారం చేసుకుంటోందని పురందేశ్వరి ఆరోపించారు. మిత్రధర్మంపై రెండు పార్టీల అధ్యక్షులు కూర్చుని మాట్లాడుకుని నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఆ విషయమై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జీవన్ జ్యోతి, జీవన్ సురక్ష వంటి పథకాలను ప్రధాన మంత్రి చంద్రన్న బీమా యోజన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీపం పథకం కింద డబ్బులు తీసుకుని పేదలకు గ్యాస్ అందజేస్తుంటే కేంద్ర ఉజ్వల పథకం కింద ఉచితంగా పేద వర్గాలకు గ్యాస్ అందజేస్తోందన్నారు. ఇళ్ల నిర్మాణానికి సింహభాగం నిధులు కేంద్రమే కేటాయిస్తోందని తెలిపారు.
పార్టీ ఫిరాయింపులపై చురకలు
పార్టీ ఫిరాయింపులపై కూడా చంద్రబాబు ప్రభుత్వానికి పురంధేశ్వరి చురకలు అంటించారు. రాజీనామాలు చేశాకే పార్టీలోకి రావాలని ఎన్టీఆర్ కోరేవారని చెప్పారు. ఫిరాయింపు నేతలపై చర్యలు తీసుకోవాలని, ఇదే విషయమై బీజేపీ అధ్యక్షులు అమిత్ షాకు లేఖ రాశామని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదింప చేసుకోవాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉందన్నారు. కేంద్రం సాయం వల్లే చంద్రబాబు ఏపీలో బాగా పని చేస్తున్నారని సోము వీర్రాజు అన్నారు.
బాబుకు సోము ప్రశంస, చురకలు
సోము వీర్రాజు.. చంద్రబాబుకు చురకలు అంటిస్తూనే ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు నిత్యకృషీవలుడని, ఆయనకున్న టెక్నాలజీ ప్రపంచంలో ఎవరి వద్దా ఉందని, కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చినా, ఇంకా రావాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ ఏమి చేయలేదని, నాడు వైయస్ రాజశేఖర రెడ్డి ఆ ప్రాజెక్టులో భాగంగా రెండు కాలువలు తవ్వారని, అవి కూడా అంతంతమాత్రమే అన్నారు. చంద్రబాబు నిత్యం పోలవరం పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
పని కేంద్రం సహకారం వల్లే ఖాళీ లేకుండా పని
కేంద్రం అందిస్తున్న సహకారం వల్లే సీఎం చంద్రబాబు ఖాళీ లేకుండా పని చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. కానీ ప్రధాని మోడీ బొమ్మను మాత్రం ఎక్కడా ప్రదర్శించడం లేదన్నారు. అంతేకాదు, కేంద్రంపై సుప్రీం కోర్టుకు వెళ్తానంటారా అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ బీసీల్లోని చిన్నకులానికి చెందిన వ్యక్తి కాబట్టే అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు విమర్శిస్తున్నారంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్పై పరోక్షంగా మండిపడ్డారు. ఉండవల్లి ఖాళీ చక్రవర్తని, విభజన సమయంలో ఆయనతోపాటు తూర్పు గోదావరి జిల్లాలో ముగ్గురు ఎంపీలు ఉన్నారని, ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ను తెగతిట్టి, ఇందిరమ్మను దూషించిన ఉండవల్లి ఆ తర్వాత అదే పార్టీలో చేరి, రెండుసార్లు ఎంపీగా పని చేశారన్నారు. ఆయనకు ఇప్పుడు అవినీతికి, అభివృద్ధికి తేడా తెలియడంలేదన్నారు. అవినీతివల్లే ఒక్కో రాష్ట్రం నుంచి కాంగ్రెస్ వైదొలగిపోతుండగా, బీజేపీ పెరుగుతోందన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని, దానిపేరుతో రాజకీయ పొత్తులు కుదరవని చెప్పారు. కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ కింద రాష్ట్రానికి అన్నీ ఇస్తోందన్నారు.