అమెరికాలో బిజీ.. అఖిలేష్ యాదవ్ సలహాదారుతో పవన్ కళ్యాణ్ భేటీ
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అమెరికాలో బిజీ బిజీగా గడుపుతున్నారు. అయిదు రోజుల పర్యటన కోసం అక్కడికి వెళ్లిన జనసేన అధినేత ప్రొఫెసర్ స్టీవెన్ జార్డింగ్తో దాదాపు రెండు గంటలు ఏకాంతంగా సమావేశమయ్యారు.
హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అమెరికాలో బిజీ బిజీగా గడుపుతున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థుల సదస్సు కోసం పవన్ అమెరికా వెళ్లారు. అయిదు రోజుల పర్యటన కోసం అక్కడికి వెళ్లిన జనసేన అధినేత ప్రొఫెసర్ స్టీవెన్ జార్డింగ్తో దాదాపు రెండు గంటలు ఏకాంతంగా సమావేశమైనట్లు జనసేన పార్టీ సోషల్మీడియా ద్వారా తెలిపింది.

ఉత్తర ప్రదేశ్లో సమాజ్ వాది పార్టీ అధికారంలో ఉంది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటున్న సమాజ్వాదీ పార్టీ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కి ప్రొఫెసర్ స్టీవెన్ సలహాలు ఇస్తున్నారని జనసేన పేర్కొంది.
స్టీవెన్, పవన్ కళ్యాణ్ల భేటీ జరిగినప్పుడు తీసిన ఫొటోలను కూడా పోస్ట్ చేసింది. పవన్ శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి రెండు గంటల వరకు అమెరికా కాంగ్రెస్ సభ్యులు, సెనేటర్లు, అమెరికా న్యూక్లియర్ పాలసీ రూపకర్తలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారని జనసేన చెప్పింది.
@PawanKalyan with prof Steve Jarding @indiaconf2017 #Janasena #IndiaConference2017 pic.twitter.com/zEZ0CnKVGV
— Jana Sena (@thejanasena) February 10, 2017
రెండు గంటల తర్వాత హ్యాంప్షైర్ గవర్నర్తో భేటీ అవుతారని, మూడు గంటలకు నార్త్ హ్యాంప్షైర్లోని నషువా సిటీ చేరుకొని అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు లత మంగపూడితో సమావేశంలో పాల్గొంటారని, సాయంత్రం నాలుగు గంటలకు నషువాలోని రివర్ యూనివర్సిటీ దగ్గర భారతీయ సంతతి వారు నిర్వహిస్తున్న కార్ ర్యాలీలో పాల్గొంటారని పేర్కొన్నారు.

అనంతరం ఎన్నారైలు ఏర్పాటు చేసిన విందు స్థలికి చేరుకుంటారని, ఈ సందర్భంగా డెమోక్రాటిక్, రిపబ్లికన్ పార్టీలకు చెందిన సెనేటర్లు, నషువా మేయర్, ఎన్నారైలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారని తెలిపారు.












Click it and Unblock the Notifications