సతీసమేతంగా విజయవాడ ఇంట్లో అడుగుపెట్టిన పవన్, అకీరా కూడా, అద్దె ఎంతో తెలుసా?
Recommended Video
విజయవాడ: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలోని పడమటలంకలో శుక్రవారం నూతన గృహప్రవేశం చేశారు. అద్దెకు తీసుకున్న ఇంటిలో పవన్ కళ్యాణ్ సతీసమేతంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పవన్-రేణు దేశాయ్ల కుమారుడు అకీరా నందన్ కూడా పాల్గొన్నాడు.
గుంటూరు జిల్లా నంబూరులో లింగమనేని టౌన్షిప్ వద్ద నిర్మించిన దశావతార వెంకటేశ్వరస్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి సంప్రదాయ వస్త్రధారణతో వెళ్లారు పవన్. ఈ కార్యక్రామానికి ముందే అద్దెకు తీసుకున్న ఇంట్లో పూజలు నిర్వహించారు.
కుటుంబ సమేతంగా వచ్చి..
గురువారమే హైదరాబాద్ నుంచి కుటుంబసమేతంగా విజయవాడ చేరుకున్న పవన్ కళ్యాణ్.. శుక్రవారం ఉదయం నిరాడంబరంగా గృహ ప్రవేశం చేశారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఎప్పుడు విజయవాడకు వచ్చినా.. హోటళ్లలోనే ఉంటున్నారు. ఇక నుంచి ఈ ఇంట్లోనే బస చేయనున్నారు. గుంటూరు జిల్లా ఖాజా టోల్ గేట్ సమీపంలో తన సొంత ఇల్లు పూర్తయ్యే వరకు పవన్ ఈ ఇంట్లోనే ఉండనున్నారు.
అందుబాటోలు ఉండేందుకే..
కాగా, రామవరప్పాడు వద్ద ప్రారంభించిన జనసేన పార్టీ కార్యాలయాన్ని జిల్లా కార్యాలయంగా ఉంచాలని, కొత్తగా రాజధాని ప్రాంతంలో భూమిపూజ చేసిన రాష్ట్ర పార్టీ కార్యాలయం పనులు త్వరగా ప్రారంభింపజేయాలని పవన్ అనుకుంటున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. 2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అందరికి అందుబాటులో ఉండేందుకే అద్దె ఇల్లు తీసుకున్నారని, పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ, ముఖ్య నేతలతో సమావేశాల నిర్వహణ పవన్ ఇక్కడ్నుంచే చేస్తారని చెప్పారు.
అద్దె ఎంతంటే..
కాగా, పడమట రామాలయం సమీపంలోని ఈ ఇల్లు కోగంటి సాంబశివరావు అనే వ్యక్తిదని తెలిసింది. నెలకు రూ. 2.5లక్షల అద్దెగా చెల్లిస్తున్నారని సమాచారం.
గంగరాజు ఇంటి సమీపంలోనే..
కాగా, నర్సాపురం నుంచి బీజేపీ తరపున ఎంపీగా గెలుపొందిన గోకరాజు గంగరాజు ఇంటి నుంచి ఇది మూడో ఇల్లు కావడం గమనార్హం. 2014 ఎన్నికల్లో గంగరాజు తరపున కూడా పవన్ ప్రచారం చేశారు. అయితే, ఆ తర్వాత వపన్ ఫ్యాన్స్ పోస్టర్ల వివాదంలో చిక్కుకుంటే.. సదరు ఎంపీ సాయం కోరుతూ పవన్ ఫోన్ చేశారు. కానీ, ఆయన ఫోన్ ఎత్తలేదని పవన్ స్వయంగా చెప్పారు. దీంతో తానే పోలీసులతో ఓ వ్యక్తిని పంపి మాట్లాడించాల్సి వచ్చిందని పవన్ చెప్పారు.