పవన్ లక్ష్యం - ధీమా ఇదే : చంద్రబాబు తగ్గుతారా - నెగ్గేదెవరు : బీజేపీ మైండ్ గేమ్..!!
పవన్ కళ్యాణ్ సూచనను చంద్రబాబు అంగీకరిస్తారా. తగ్గేందుకు చంద్రబాబు సిద్దమా. పార్టీ నేతలు మాత్రం అవసరం లేదని తేల్చి చెబుతున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ స్వరం మారుతోంది. తన పట్టు బిగించే విధంగా అడుగులు వేస్తున్నారు. తన అవసరం ఇతర పార్టీలకు ఉందనే అభిప్రాయంతో ఉన్నారు. అదే సమయంలో జగన్ ను ఓడిండాలనేది ఆయన లక్ష్యం. కానీ, ఇదే సమయంలో టీడీపీ - బీజేపీకి ఏపీలో ఉన్న బలం ఏంటి.. ప్రస్తుత రాజకీయాల్లో తన అవసరం ఏంటనేది పవన్ గ్రహించారు. తమ మద్దతు లేకుండా వైసీపీని టీడీపీని ఓడించలేదనే భావన ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోందది. పవన్ చెప్పుకొచ్చిన మూడు ఆప్షన్లలోనూ అదే భావన కనిపిస్తోంది.

పవన్ గతం కంటే భిన్నంగా..
తాను ఇప్పటి వరకు తగ్గానని చెబుతూనే..ఇక, తగ్గేది లేదని స్పష్టత ఇచ్చారు. కలిసి వచ్చే పార్టీలు తగ్గాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. దీని ద్వారా పవన్ ఏం చెప్పదలచుకున్నారు... టీడీపీ అధినేత ఏం చేయబోతున్నారనేది రాజకీయంగా సంచలనంగా మారింది. ఇక, బీజేపీ తమ పార్టీ భవిష్యత్ - జాతీయ రాజకీయాల్లో తమ ప్రయోజనాలకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. పవన్ చెప్పిన తగ్గాలి అనే సూత్రం వెనుక పెద్ద రాజకీయమే ఉంది. పవన్ ఈ సారి వైసీపీని ఓడించాలని.. ఎవరితో కలిసినా.. అధికారంలో భాగస్వాములు కావాలనే లక్ష్యంతో ఉన్నట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు. అందులో భాగంగానే..చంద్రబాబు సైతం తగ్గాలంటూ కీలక సూచన చేసారు. అధికారంలో భాగస్వామ్యంతో పాటుగా.. సీట్ల కేటాయింపులోనూ తాను కోరుకున్న సంఖ్య దక్కించుకోవాలనేది పవన్ కళ్యాణ్ వ్యూహంగా తెలుస్తోంది. టీడీపీ - జనసేన-బీజేపీ కలిసి పోటీ చేసినా..ఆ రెండు పార్టీలు డిమాండ్ చేసే విధంగా సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్దంగా ఉంటారా అంటే కాదనే ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

తన మద్దతు ఉంటేనే గెలుస్తారనే ధీమానా
అయితే, జనసేన నేతలు మాత్రం తూర్పు గోదావరి లో చంద్రబాబు పర్యటన సందర్భంగా పొత్తుల అంశాన్ని ప్రస్తావిస్తూ..తాము త్యాగాలకు సిద్దమని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తున్నారు. ఈ సారి టీడీపీ అధికారంలోకి రాకపోతే..ఇక, టీడీపీ మనుగడ కష్టమనే వైసీపీ వాదన జనసేన నేతలు విశ్వసిస్తున్నారు. అదే సమయంలో..టీడీపీ ఒంటరిగా పోటీకి దిగి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీ - జనసేన తో సహా ఇతర పార్టీల మధ్య చీలితే అది పరోక్షంగా వైసీపీకి సహకరిస్తుందనేది జనసేన అంచనా. దీంతో..ఇదే సమయంలో తమ బలం గురించి జనసేన ఒక అంచనాకు వచ్చింది. గతంలో టీడీపీ..ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హాయంలో చోటు చేసుకున్న పరిణామాలతో ఈ సారి కాపు సామాజిక వర్గం ఐక్యంగా తమకే మద్దతు ఇస్తుందని పవన్ బలంగా నమ్ముతున్నారు. తనకు ఎవరూ ఈ విషయం చెప్పలేదని చెబుతూనే..పరోక్షంగా ఆ అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. బీసీ వర్గాలు గతంలో వైసీపీకి ఏకపక్షంగా మద్దుత ఇచ్చినా..ఈ సారి బీసీ వర్గాల్లో నూ ఓట్ల చీలక ఉంటుందని విశ్లేషిస్తున్నారు.

జనసేనతో కలిస్తేనే టీడీపీ గెలుస్తుందా
కమ్మ..కాపు..బీసీ వర్గాల్లోని కొన్ని సెక్షన్లు..అగ్రవర్ణాల ఓటు బ్యాంకు వైసీపికి దూరం అయిందని పవన్ ఓపెన్ గానే చెబుతున్నారు. దీంతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాలను వైసీపీ ఒక మర్చిపోవాల్సిందేనని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే, ఆ ఓట్లను టీడీపీ సొంతంగా తమ ఖాతాలో వేసుకొనే పరిస్థితలో లేదనేది పవన్ అంచనాగా కనిపిస్తోంది. కానీ, టీడీపీ మాత్రం పవన్ కళ్యాణ్ తగ్గాలి అంటూ చేసిన సూచన పైన అంతర్గతంగా మండిపడుతున్నాయి. టీడీపీ శ్రేణులు..అభిమానులు మాత్రం పవన్ తగ్గాలి అనే ఫార్ములాకు అంగీకరించాల్సిన అవసరం లేదని సోషల్ మీడియాలో తమ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత కారణంగా..టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా అధికారంలోకి వస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు ఏం చేయబోతున్నారు
తగ్గాల్సింది చంద్రబాబు కాదు.. పవన్ తగ్గాలంటూ పోస్టింగ్స్ కనిపిస్తున్నాయి. టీడీపీ అధినేత..ముఖ్య నేతలు మాత్రం వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. వచ్చే ఎన్నికలు..ప్రజాభిప్రాయం...గెలుపు - ఓటమి అవకాశాల పైన పూర్తి అంచనాలు వచ్చిన తరువాతనే పొత్తుల పైన స్పందించాలని అప్పటి వరకు ఆమోదించటమో..తిరస్కరించటమో చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయంతో ఉన్నారు. ఇక, ఈ పరిస్థితుల్లో బీజేపీ మైండ్ గేమ్ ప్రారంభించింది. చంద్రబాబు సీట్లు అడిగితే పొత్తుల విషయం ఆలోచిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. మొత్తంగా.. ఇప్పుడు పొత్తుల పేరుతో చంద్రబాబు తగ్గాలనే డిమాండ్లతో... టీడీపీ అధినేత తీసుకోబోయే నిర్ణయాలు వచ్చే ఎన్నికల్లో కీలకం కానున్నాయి.












Click it and Unblock the Notifications