పవన్ కళ్యాణ్తో చంద్రబాబు సర్దుబాటు: ముద్రగడను ఆపగలరా?
హైదరాబాద్: కాపు సామాజిక వర్గం నేతలు తనకు వ్యతిరేకంగా దూకుడు పెంచడానికి సిద్ధమవుతున్న తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సర్దుబాటు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ మాటల్లో ఇరువురి మధ్య సయోధ్య కుదిరిన విషయం స్పష్టంగా వ్యక్తమైంది. పవన్ కళ్యాణ్ మద్దతు ద్వారానే కాపు సామాజిక వర్గం మద్దతును సంపాదించి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో విజయం సాధించిందనే అంచనా.
అయితే, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో కాపు సామాజిక వర్గం నేతలు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉద్యమించడానికి సమాయత్తమవుతున్నారు. పవన్ కళ్యాణ్ మద్దతు ముద్రగడ పద్మనాభం గాలిని ఆపగలదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కాపు సామాజిక వర్గం నేతల వైఖరి చూస్తుంటే వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాలు తెర మీదికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల రాజకీయాలే ప్రధానమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో రాష్ట్ర వ్యాప్తంగా గణనీయమైన సంఖ్యలో ఉన్న కాపులను బిసి కులాల్లో చేర్చడం కూడా ఉంది. రెండు ఉప ముఖ్య మంత్రి పదవుల్లో ఒకటి బిసిలకు మరోకటి కాపులకు ఇస్తానని కూడా చెప్పారు. అదే విధంగా కాపుల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయటం, కాపుల సంక్షేమానికి వెయ్యి కోట్లు కేటాయించటం కూడా చంద్రబాబు హామీల్లో ఉన్నాయి.
ఉప ముఖ్యమంత్రి పదవుల్లో కాపు, బిసి నేతలను నియమించిన చంద్రబాబు మొదటి హామీ అయిన కాపులను బిసిల్లో చేర్చడంలో మాత్రం జాప్యం చేస్తూ వస్తున్నారు. ఒకప్పటి కాపు నేత వంగవీటి మోహన రంగా హత్యలో చంద్రబాబు హస్తం ఉందని తన ఆత్మకథలో మాజీ మంత్రి హరిరామ జోగయ్య రాయడంతో ఒక్కసారి కలకలం రేగింది. పుస్తకం విడుదల కాగానే ఇదే అంశంపై సర్వత్రా చర్చ మొదలైంది.
ఆ సమయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. కాపులను బిసిల్లోకి చేర్చే విషయమై ప్రభుత్వం త్వరలో ఒక కమిషన్ వేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. కాపులను బిసిల్లోకి చేర్చాలన్న డిమాండ్ ఈనాటిది కాదు. అయితే, ఈ డిమాండ్ వచ్చినపుడ ల్లా బిసి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. సామాజికంగా, ఆర్దికంగా గట్టి స్ధితిలోనే ఉన్న కాపులను బిసిల జాబితాలోకి ఎలా చేరుస్తారంటూ బిసి నేతలు ప్రశ్శిస్తున్నారు.
దాంతో కాపులను బీసిల్లో చేర్చడం అంత సులంభంగా నెరవేరడం లేదు. ఆ విషయం తెలిసి కూడా గత ఎన్నికల్లో కాపులను బీసీల్లో చేర్చాలనే నినాదాన్ని చంద్రబాబు మళ్ళీ కెలికారు. అది చంద్రబాబుకు ఎన్నికల్లో కలిసి వచ్చినట్లే ఉంది.
అయితే, చంద్రబాబు ఆ హామీని నెరవేర్చడంలో చేస్తున్న జాప్యంతో కాపు సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం 'కాపు ఐక్యత' పేరుతో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. డిసెంబర్ నెలలో ఒక బహిరంగం సభ, జనవరి నెలలో మరో సభ జరపటానికి కాపు నేతలు వ్యూహాలు సిద్ధం చేసుకుం టున్నారు.
ఎన్నికల్లో బిజెపి, టిడిపి కూటమికి పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు. బహిరంగ సభల్లో పాల్గొని ఆ కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దాంతో పవన్ను కాపులు తమ ప్రతినిధిగా చూసుకున్నారు. తనను ఓ సామాజిక వర్గానికి అంటగట్టవద్దని చెప్పినప్పటికీ పవన్ కళ్యాణ్ను అదే దృష్టితో చూసినట్లు కాపు సామాజిక వర్గం నాయకుల ప్రకటనలు చూస్తే అర్థమవుతుంది.
చంద్రబాబు తన హామీని నిలబెట్టుకోవాలని ఒకవర్గం, కాపులను బిసిల్లో చేరిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెడతామంటూ మరో వర్గం వాదిస్తోంది. హామిని నిల బెట్టుకోవాలని ఒత్తిడితెస్తున్న వర్గం, వద్దని వాదిస్తున్న వర్గం - రెండు కూడా టిడిపిలోనే ఉన్నాయి. అయితే ఎన్నో రోజులు ఈ అంశాన్ని దాటవేసే అవకాశాలు చంద్రబాబుకు లేవు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబుకు అది కుంపటిగా మారే ప్రమాదం ఉంది.