మోడీ ఫ్రెండ్: పద్మ రేస్లో పవన్ కళ్యాణ్, చేదాటకుండా బాబు ప్లానా?
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరును పద్మ అవార్డు కోసం సిఫార్సు చేశారా? అంటే అవుననే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చిందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవాల సందర్భంగా పద్మ అవార్డులు ప్రకటిస్తుంది.
ఈ పద్మ అవార్డుల్లో భాగంగా ఈ ఏడాది పద్మ భూషణ్ అవార్డు కోసం పవన్ కళ్యాణ్ పేరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమి తరపున చేసిన పవన్ కళ్యాణ్ విస్తృతంగా ప్రచారం చేశారు.
ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు తన వంతు కృషి చేసిన విషయం తెల్సిందే. పైగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు కోసం పవన్ పేరును ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపిన జాబితాలో సిఫార్సు చేసినట్టు విశ్వసనీయవర్గాల సమాచారమని వార్తలు వచ్చాయి.
దీంతో ఆయనకు పద్మ అవార్డు దక్కడం ఖాయమనే వాదన ఫిల్మ్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. అయితే ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది. అయితే, పవన్ కళ్యాణ్ కంటే సీనియర్లు పరిశ్రమలో చాలామంది ఉంది ఉన్నారు. ఏళ్లుగా పరిశ్రమకు సేవ చేస్తున్నా అవార్డు రాలేదని కొందరు బహిరంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ పేరు వినిపిస్తోందని వార్తలు రావడం గమనార్హం.
కాగా, సార్వత్రిక ఎన్నికలప్పటి నుండి పవన్ కళ్యాణ్ను బీజేపీ అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కేంద్రమంత్రి వెంకయ్యకు చెందిన స్వర్ణభారతి ట్రస్ట్లో జరిగిన సంక్రాంతి వేడుకలకు పవన్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పవన్, బీజేపీ మరింత దగ్గరవుతున్నారని, అధి టీడీపీకి దెబ్బేననే వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ను దూరం చేసుకోకుండా ఉండేందుకే ఏపీ ప్రభుత్వం ఆయన పేరును నామినేట్ చేసి ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.