విభజన వల్లే జనసేన, ఏం మాటలవి, సత్తా లేదా, డ్రామాలు: బాబును దులిపేసిన పవన్
Recommended Video
హైదరాబాద్/అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ (జేఎఫ్సీ) హైదరాబాదులోని హోటల్ ఆవాస్లో శనివారం సుదీర్ఘంగా భేటీ అయింది. భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ, బీజేపీపై ఆయన నిప్పులు చెరిగారు. చంద్రబాబు అయోమయానికి గురి చేశారన్నారు.
ప్రత్యేక హోదా విషయంలో అన్ని రాజకీయ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. ఏపీకి ఇచ్చిన హామీల్లో కేంద్రం నెరవేర్చింది చాలా తక్కువ అని దుయ్యబట్టారు. తాను బీజేపీ భాగస్వామి, టీడీపీ భాగస్వామి అని ప్రచారం చేస్తున్నారని, కానీ ప్రజల కోసం తాను పోరాడాల్సి ఉందని, వారికి నిజాలు చెప్పాల్సి ఉందన్నారు.
విభజనలో నాయకుల పాత్ర ఉంది, ప్రజల పాత్ర లేదు
ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తున్న జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి అభినందనలని పవన్ కళ్యాణ్ అన్నారు. విభజనలో రాజకీయ నాయకుల పాత్ర ఉంది కానీ, ప్రజల పాత్ర లేదన్నారు. ఇరు ప్రాంత ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండేలా ఎవరూ కృషి చేయలేదన్నారు. విభజనతో ఏపీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు.
విభజన వల్లే జనసేన ఆవిర్భావం, స్థిరాస్థిపై ప్రశ్న
విభజన నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ప్రజలను కదిలించారు కాని, స్థిరాస్థి ఇక్కడే ఉండిపోయిందని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర విభజన కారణంగానే జనసేన ఆవిర్భవించిందని చెప్పారు. స్థిరాస్తి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారని చెప్పారు. జేఎఫ్సి ప్రధానంగా 11 అంశాలను గుర్తించిందని చెప్పారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి, పార్ట్నర్ అంటున్నారు
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. 90 శాతం నిధులు కేంద్రమే ఇవ్వాలన్నారు. తాము నైతిక బాధ్యతతో జేఎఫ్సీని ఏర్పాటు చేశామన్నారు. తాను టీడీపీకి పార్ట్నర్ అని, బీజేపీకి పార్ట్నర్ అని కొందరు ప్రచారం చేస్తున్నారని, దానిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.
చంద్రబాబు పరస్పర విరుద్ద ప్రకటనలు
ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, విభజన హామీలపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పరస్పర విరుద్ద ప్రకటనలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఇలాంటి ప్రకటనలు ప్రజలను గందరగోళ పరుస్తాయని చెప్పారు. ప్రజల్లో అయోమయ వాతావరణం సృష్టించడం సరికాదన్నారు.
చంద్రబాబే కన్ఫ్యూజన్లో ఉంటే ఎలా
చంద్రబాబు అనుభవజ్ఞుడు అనే ఉద్దేశ్యంతోనే తాను 2014లో బీజేపీ, టీడీపీకి మద్దతు పలికానని పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ చంద్రబాబే కన్ఫ్యూజన్లో ఉంటే ఎలా అని ప్రశ్నించారు. ఒకర్ని తప్పు పట్టాలనే ఉద్దేశ్యం తనకు లేదన్నారు. సీఎం విరుద్ధ ప్రకటనలు చేయడం సరికాదన్నారు.
బాబూ! మీపై నమ్మకం ఎలా కలుగుతుంది
హోదాపై టీడీపీ ఎంపీలు ఇన్నాళ్లు ఎందుకు బలంగా అడగలేకపోయారని పవన్ ప్రశ్నించారు. చంద్రబాబు, టీడీపీ కన్ఫ్యూజన్, అయోమయానికి గురి చేస్తోందని, కావాలని చేస్తున్నారా లేక సామర్థ్యం లేదా అని అనుమానం కలుగుతోందన్నారు. ప్రజలకు న్యాయం చేసేందుకు చంద్రబాబుకు నాలుగేళ్లు ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు మీపై నమ్మకం ఎలా కలుగుతుందన్నారు. రాష్ట్రం నాలుగేళ్లు ఉదాసీనంగా ఎందుకు ఉందని ప్రశ్నించారు.