సీఎం పదవి, సీట్లపై తేల్చేసిన పవన్ - ఢిల్లీ స్కెచ్, చంద్రబాబు "ఫిక్స్"..!!
ఏపీలో ఎన్నికల వేళ పొత్తుల్లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. పొత్తు ధర్మం పై పవన్ నిలదీసారు. తొలి సారిగా చంద్రబాబు నిర్ణయాలను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవిపై లోకేష్ చేసిన వ్యాఖ్యల పైన తొలి సారి స్పందించారు. అదే సమయంలో సీఎం పదవి గురించి తాను చెప్పదలచుకున్నది చెప్పారు. సీట్ల గురించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఈ సమయంలో బీజేపీ పాత్ర కీలకంగా మారుతోంది. ఇక, ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారనేది ఆసక్తిని పెంచుతోంది.
పవన్ వ్యాఖ్యలతో : పవన్ కల్యాణ్ పొత్తు ధర్మం పై చేసిన వ్యాఖ్యల సంచలనంగా మారాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అరకు, మండపేట అభ్యర్దుల ప్రకటన పైన పవన్ అభ్యంతరం వ్యక్తం చేసారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు సీట్ల నుంచి జనసేన పోటీ చేయాలని భావించింది. ఈ రెండు నియోజకవర్గాల నుంచి నేతలు పవన్ వద్ద టీడీపీ తమ అభ్యర్దులను ఏకపక్షంగా ప్రకటించటం పైన ఆవేదన వ్యక్తం చేసారు. దీంతో, వారికి తాను క్షమాపణలు చెప్పినట్లు పవన్ వెల్లడించారు. టీడీపీకి టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా పవన్ రెండు సీట్లను ప్రకటించారు. రాజోలు, రాజానగరం నుంచి తమ అభ్యర్దులు పోటీ చేస్తారని పవన్ ప్రకటించారు. ఇదే సమయంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలపైనా మౌనం వహించానని చెప్పుకొచ్చారు.

లోకేష్ వ్యాఖ్యల ప్రస్తావన : సీఎం సీటు షేరింగ్ ఆలోచనే లేదని లోకేష్ తేల్చి చెప్పారు. ఈ విషయం పైన తాను మౌనంగా ఉన్నానని, పొత్తు కోసమే మాట్లాడలేదని పవన్ చెప్పుకొచ్చారు. పరోక్షంగా తాను సీఎం రేసులో ఉన్నాననే సంకేతాలు కేడర్ కు ఇచ్చారు. ఇదే సమయంలో స్థానిక ఎన్నికల్లోనూ మూడో వంతు సీట్లు కోరుతామని పవన్ స్పష్టం చేసారు. దీని ద్వారా పవన్ వచ్చే ఎన్నికల్లో మూడో వంతు సీట్లు కోరుతున్నారని..ఇదే విషయం కేడర్ కు సంకేతాలు ఇచ్చారని పార్టీ నేతలు చెబుతున్నారు. 50, 60 సీట్లు తీసుకోమంటూ తనకు సూచనలు వస్తున్న అంశాన్ని పవన్ వివరించారు. దీని ద్వారా పవన్ పెద్ద మొత్తంలోనే సీట్లు ఆశిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ఇప్పటికే పవన్ 35 సీట్ల పైన కసరత్తు పూర్తి చేసారు. టీడీపీ అంచనా వేస్తున్నట్లుగా 15-20 సీట్లు ఇస్తే తాను స్వీకరించేందుకు సిద్దంగా లేననే విధంగా పవన్ రిపబ్లిక్ డే నాడు పవన్ కల్యాణ్ టీడీపీకి స్పష్టమైనం సంకేతాలు ఇచ్చారు.

బీజేపీ నిర్ణయం ఏంటి : ఇక, బీజేపీ తమతో కలిసి రావాలని చంద్రబాబు, పవన్ కోరుకుంటున్నారు. బీజేపీ ఏ విషయం తేల్చటం లేదు. బీజేపీ కలిసి రాకపోతే సీపీఐతో కలిసి వెళ్లాలనేది చంద్రబాబు ఆలోచన. వచ్చే వారం పవన్ ఢిల్లీ వెళ్తారని తెలుస్తోంది. ఆ సమయంలో పొత్తు పైన బీజేపీ తమ వైఖరి స్పష్టం చేసే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న బీజేపీ రాజకీయంగా కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు పవన్ పవర్ షేరింగ్, సీట్ల పైన చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు ఏకపక్షంగా పొత్తులో నిర్ణయాలు ఉండవనే విషయం స్పష్టం అయింది. భవిష్యత్ నిర్ణయాల్లో పవన్ ఎలాంటి ప్రాధాన్యత కోరుకుంటున్నారో క్లారిటీ వచ్చింది. దీంతో, ఇప్పుడు పవన్ డిమాండ్లకు చంద్రబాబు అంగీకరించేందుకు సిద్దంగా ఉన్నారా..ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications