దయనీయస్ధితిలో ఏపీ-జగఏపీలో వైసీపీ వర్సెసన్ సర్కార్ పై ఉండవల్లి సంచలన కామెంట్స్-కోట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ట్వీట్
ఏపీలో వైసీపీ వర్సెస్ విపక్షాలుగా సాగుతున్న రాజకీయాల్లో అప్పుడప్పుడు వచ్చి మెరిసిపోతుంటారు కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. గతంలో వైఎస్ జగన్ కు అనుకూలంగా పలు వ్యాఖ్యలు చేసిన ఉండవల్లి ప్రస్తుతం కొంతకాలంగా జగన్ సర్కార్ పై విరుచుకుపడుతున్నారు. అసలే లాజిక్కుల కింగ్. ఇక పట్టుకున్న ప్రతీ అంశంపైనా తనదైన మార్క్ కామెంట్స్ చేస్తూ ఉండవల్లి సంచలనం రేపుతున్నారు. అలా తాజాగా ఏపీ ప్రభుత్వంపై ఉండవల్లి చేసిన కామెంట్స్ జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్ కు కూడా నచ్చేశాయి. దీంతో ఆయన ఉండవల్లి కామెంట్స్ ను కోట్ చేస్తూ ట్వీట్ చేశారు.
ఉండవల్లి కామెంట్స్
ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై ఈ మధ్య తరచుగా విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వైసీపీ సర్కార్ అప్పుల్ని ఆయన టార్గెట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వరుసగా చేస్తున్న అప్పుల్ని లక్ష్యంగా చేసుకుని ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇందులో ఉండవల్లి లేవనెత్తిన అంశాలు ఇతర రాజకీయ పార్టీల్ని సైతం ఆలోచనలో పడేశాయి. దీంతో విపక్ష పార్టీలు ఇప్పుడు ఆ వ్యాఖ్యల్ని రాజకీయంగా వాడుకునే పనిలో పడ్డాయి.
ఉండవల్లి చెప్పిందేంటి ?
కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి ఏపీ సర్కార్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్లో ప్రధానంగా అప్పులపైనే ఫోకస్ చేశారు. ఇందులోనూ ఏపీ ఆర్ధిక పరిస్ధితి అస్తవ్యస్తంగా ఉందని, అయినా వైసీపీ సర్కార్ ఇష్టానుసారంగా అప్పులు చేస్తోందని అన్నారు. సర్కార్ ఇప్పటివరకూ 6 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. ఇంత మంది సలహాదారుల్ని పెట్టుకుని మరీ ఇలాంటి దయనీయ పరిస్ధితులు రావడం బాధాకరమని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ సలహాదారులు ఏం చేస్తున్నారని ఉండవల్లి ప్రశ్నించారు. ఇవే పరిస్ధితులు కొనసాగితే రాష్ట్రానికి గడ్డు పరిస్ధితులు తప్పవన్నారు.
అమరావతి కూడా తాకట్టు
ఇదే క్రమంలో ఉండవల్లి అమరావతి అంశాన్ని కూడా ప్రస్తావించారు. అమరావతిని తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చే పరిస్ధితికి వైసీపీ ప్రభుత్వం దిగజారిందని ఉండవల్లి ఆక్షేపించారు. ఎక్కడ పడితే అక్కడ అప్పులు తెచ్చే రాష్ట్రంగా ఆంద్రప్రదేశ్ మారిపోయిందని ఆయన ఆరోపించారు. వైసీపీ సర్కార్ ఏపీ ఎస్డీపీతో పాటు ఇతరత్రా సంస్ధల ద్వారా అప్పుల కోసం చేస్తున్నప్రయత్నాలను ఉద్దేశించి ఉండవల్లి ఈ ఆరోపణలు చేశారు. అయితే ఉండవల్లి ప్రస్తావించిన అమరావతి తాకట్టు అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఉండవల్లి కామెంట్స్ పై పవన్ ట్వీట్
ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ ప్రభుత్వ అప్పులు, అమరావతి తాకట్టు, సలహాదారులు వంటి అంశాలపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతన్న నేపథ్యంలో దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఉండవల్లి కామెంట్స్ వీడియోను కోట్ చేస్తూ ఓ ట్వీట్ కూడా చేశారు. తద్వారా వైసీపీ ప్రభుత్వంపై ఉండవల్లి కామెంట్స్ ను పవన్ కళ్యాణ్ సమర్ధించినట్లయింది. అదే సమయంలో ఈ ట్వీట్ ద్వారా వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ మరోసారి విమర్శల దాడి మొదలుపెట్టినట్లయింది. దీంతో ఇప్పుడు పవన్ ట్వీట్ కూడా వైరల్ గా మారుతోంది.
ఉండవల్లి లాంటి ఉద్దండులే చెప్తున్నారంటే...
ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ ప్రభుత్వ అప్పులపై చేసిన వ్యాఖ్యల వీడియోను తన ట్వీట్ కు జత చేసిన పవన్ కళ్యాణ్..
A snippet of Sri 'Undavalli Arun Kumar ji's press meet on the disastrous financial situation of AP & how the AP Govt lacks transparency in Governance. 'ఉండవల్లి'గారి లాంటి రాజకీయ ఉద్ధండులు ఈ మాట మాట్లాడుతున్నారంటే పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు." అంటూ ముగించారు. తద్వారా ఏపీ ఆర్ధిక పరిస్ధితి ఎలా ఉందనే దానిపై పవన్ కళ్యాణ్ నేరుగానే స్పందించినట్లయింది. ఇప్పటివరకూ జగన్ సర్కార్ అప్పులపై ఎక్కువగా మాట్లాడని పవన్ కళ్యాణ్.. తాజాగా ఉండవల్లిని కోట్ చేస్తూ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.