తుది శ్వాస వరకూ ప్రజాపక్షమే, మోడీ, బాబు, కేసీఆర్నూ కలుస్తా: తేల్చేసిన పవన్
Recommended Video
అనంతపురం: తాను ఎవరి పక్షం కాదని, తాను ప్రజాపక్షమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉదయం అనంతపురంకు చేరుకున్నారు.
అనంతపురం చేరుకున్న పవన్ కళ్యాణ్: సర్వం సిద్ధం, 3రోజుల పర్యాటన సాగుతుందిలా
భారీ ఎత్తున వచ్చిన అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గుత్తిరోడ్లో జనసేన ఆఫీసుకు శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు.
కష్టాలు తెలుసు
తాను ఓట్లు, సీట్ల కోసం రాలేదని, తాను మంచి చేస్తానని అనుకుంటేనే తన వెంట రావాలని, ఓట్లు వేయాలని అన్నారు. తనకు సినిమాల కంటే ప్రజాసేవలోనే సంతృప్తి ఉందని పవన్ తెలిపారు. తాను కుల, మత, కుటుంబ రాజకీయాలు చేయనని అన్నారు. తనకు రైతులు, యువత కష్టాలు తెలుసునని చెప్పారు. తాను కూడా రైతు కుటుంబం నుంచే వచ్చానని పవన్ కళ్యాణ్ తెలిపారు.
తుది శ్వాస వరకు
తాను తుదిశ్వాస వరకు రాయలసీమకు అండగా ఉంటానని పవన్ స్పష్టం చేశారు. తాను ఢిల్లీ వెళ్లి ప్రధానితో మాట్లాడేందుకు కూడా సిద్ధమని చెప్పారు. సీమ కష్టాల గురించి వివరిస్తానని చెప్పారు. సీమ సమస్యలను పరిష్కారించాలని కోరుతానని అన్నారు.
వెనక్కి తగ్గను
తనపై దాడులు జరిగినా తాను వెనక్కి తగ్గనని అన్నారు. తాను ఎలాంటి వ్యక్తినో మీ అందరికి తెలుసని అన్నారు. తనకు అండగా ఉండాలని కోరారు. పరిశ్రమలు, విద్య, ఉద్యోగాలు, వ్యవసాయం, నీటి పారుదలలలో అవతవకలు ఉన్నా సరైన విధానంలో పరిష్కారం చేద్దామని అన్నారు. వీటిపై ప్రభుత్వాలతో చర్చిద్దామని పవన్ అన్నారు.
పారిపోయే వ్యక్తిని కాను
తాను 2008 నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజకీయాల్లో ఉన్నానని పవన్ తెలిపారు. రాజకీయాల్లో ఉంటావా? పారిపోతావా? అని తనను కొందరు అడుగుతున్నారని.. అయితే, తాను పారిపోయే వ్యక్తిని కాదని పవన్ తేల్చి చెప్పారు.
ప్రతి దెబ్బకూ రాటు దేలుతా..
తనపై పడే ప్రతి దెబ్బకు మరింత రాటు దేలుతానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తనకు ఓటు హక్కు కూడా లేని అభిమానులున్నారని, వారేం చేస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారని.. అయితే తనకు భవిష్యత్ తరాలపై నమ్మకం ఉందని చెప్పారు. యువత, అక్కాచెల్లెళ్లను తాను నమ్ముతున్నానని పవన్ తెలిపారు. తనకు ఎవరితోనూ వ్యక్తిగతంగా, రాజకీయంగానూ శత్రుత్వం లేదని పవన్ స్పష్టం చేశారు. తనపై వ్యక్తిగతంగా దాడులు చేసినా.. వారిపై ఎదురు దాడి చేయనని అన్నారు.
బీజేపీని కోరేదొక్కటే.. ప్రధానితో మాట్లాడతా..
తాను ప్రజా ప్రయోజనాల కోసమే ముందుకు సాగుతానని పవన్ స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం అందాలని అన్నారు. ఈ సందర్భంగా తనను ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని పవన్ రాష్ట్ర బీజేపీ నేతలను కోరారు. మోడీ వచ్చినప్పుడు తాను ఫొటో కూడా అడగలేదని, తాను ఏపీ, సీమ బాగు కోసం ప్రధానితో మాట్లాడతానని పవన్ అన్నారు. తాను ఇప్పటి వరకు బీజేపీ నేతలను ఏం కోరలేదని అన్నారు.
అప్పుడే రోడ్లపైకి..
తాను ఓ పార్టీకి కొమ్ముకాస్తున్నానని, ఏజెంట్ అని కొందరు విమర్శిస్తున్నారని.. అయితే తాను ప్రజల సమస్యల పరిష్కారం కోసం తగ్గాల్సి వస్తే తగ్గుతానని స్పష్టం చేశారు. అన్ని విధానాలు పనిచేయనప్పుడు అప్పుడు తాను రోడ్లపైకి వస్తానని పవన్ తెలిపారు.
తెలంగాణ సీఎంనూ కలుస్తా..
తెలంగాణ నుంచి ఏదైనా సహకారం కావాలంటే.. అక్కడి సీఎంతో మాట్లాడతానని పవన్ అన్నారు. ఏపీ సీఎంతో కూడా కలిసి సమస్యలపై మాట్లాడతానని అన్నారు. సమాజంలో ప్రజలందర్నీ కలుపుకు పోవాలని అన్నారు.
ఈరోజు నుంచి ప్రజా జీవితంలోనే
తాను ఈ రోజు నుంచి ప్రజా జీవితంలోనే ఉంటానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కదిరి నర్సింహస్వామికి నమస్కరించి సెలవు తీసుకుంటున్నానంటూ పవన్ తన ప్రసంగాన్ని ముగించారు. ఆ తర్వాత పార్టీ స్థానిక అధ్యక్షుడ్ని పవన్ శాలువాతో సన్మానించారు.
ఒక్కసారిగా అభిమానులు
కాగా, ఒక్కసారిగా పవన్పైకి అభిమానులు దూసుకొచ్చారు. ఓ అభిమాని.. పవన్ను గట్టిగా కౌగిలించుకుని వదల్లేదు. దీంతో పోలీసులు వచ్చి విడిపించారు. ఆ తర్వాత పవన్తో సెల్ఫీ దిగి అతను అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. పలువురు అభిమానులు బహూకరించిన నాగలితో పవన్ ఫొటోలు దిగారు. భారీ గజమాలతో తమ అభిమాన నేతను సన్మానించారు. ఈ సందర్భంగా సీఎం సీఎం అంటూ అభిమానుల నినాదాలు వినిపించాయి.