అమరావతి చేరుకున్న పవన్-రేపు జనసేన పీఏసీ భేటీ - పొత్తుల వేళ ప్రాధాన్యం
ఏపీలో విశాఖ ఘటనల తర్వాత మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో టీడీపీ-జనసేన పొత్తుపై చర్చ పెరుగుతోంది. అదే సమయంలో జనసేనతో పొత్తు వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. అలాగని టీడీపీని కూడా తమ కూటమిలో చేర్చుకునేందుకు ఏపీ బీజేపీ నేతు ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో రేపు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ కానుంది. ఇందులో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ అమరావతి చేరుకున్నారు.
ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న పవన్ కళ్యాణ్.. అక్కడి నుంచి మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. అక్కడ పార్టీకి చెందిన కీలక నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. రేపు పార్టీ పీఏసీ భేటీ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో పవన్ కళ్యాణ్ ముందస్తు చర్చలు జరపనున్నారు. విశాఖ ఘటన నేపథ్యంలో తలెత్తిన పరిస్ధితులు,వైసీపీ ప్రభుత్వ రాజకీయ దాడులు, టీడీపీతో పొత్తు కుదుర్చుకోవడం, బీజేపీతో పొత్తు వదులుకోవడం.. ఇలా పలు అంశాలపై రేపటి పీఏసీ భేటీలో చర్చించబోతున్నారు.
దీంతో రేపు పీఏసీ భేటీకి ముందే నేతలతో దీనిపై అభిప్రాయాలు తెలుసుకోవాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబుతో తన భేటీ తర్వాత వైసీపీ నేతల విమర్శలు పెరిగాయి. అదే సమయంలో బీజేపీ కూడా తన పొత్తు జనసేనతోనేనని పదే పదే చెబుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీని పవన్ రోడ్ మ్యాప్ అడుగుతారా లేక బీజేపీని వదిలి పూర్తిగా టీడీపీతోనే జనసేన పొత్తులోకి దిగుతారా అన్నది ఉత్కంఠ రేపుతోంది.మరోవైపు అధికార వైసీపీ కూడా పవన్ అడుగుల్ని నిశితంగా గమనిస్తోంది. వీటి అధారంగానే తదుపరి నిర్ణయాలు తీసుకునందుకు అధికార పార్టీ సన్నద్దమవుతోంది. ఈ నేపథ్యంలో పవన్ అమరావతి టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది.