అభిమాని హత్య: అన్నా అంటూ.. పవన్ కళ్యాణ్పై పడి తల్లి కన్నీరుమున్నీరు
చిత్తూరు: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం ఉదయం చిత్తూరు జిల్లా తిరుపతిలో వినోద్ తల్లిదండ్రులను పరామర్శించారు. మూడు రోజుల క్రితం కోలార్లో జూ.ఎన్టీఆర్ - పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య జరిగిన గొడవలో వినోద్ మృతి చెందిన విషయం తెలిసిందే.
చంపుకోవడమా.. వదలొద్దు, ప్రభుత్వం విఫలమైతే చూద్దాం: పవన్ కళ్యాణ్
ఈ నేపథ్యంలో పవన్ ఈ రోజు వినోద్ తల్లిదండ్రులను పరామర్శించారు. పవన్ కళ్యాణ్ ఇంటికి రాగానే వినోద్ తల్లి అతని పైన పడి కన్నీరుమున్నీరు అయ్యారు. పవన్.. ఏం జరిగిందో తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పింది సావదానంగా విన్నారు.
అన్నా అంటూ రాఖీ కట్టిన వినోద్ తల్లి
తన తనయుడు జనసేన పార్టీలో ఎలా క్రియాశీలకంగా పని చేసేవారో వినోద్ తల్లి.. పవన్కు చెప్పారు. అందుకు సంబంధించిన ఫోటోలను చూపించారు. తన కొడుకు మరికొద్ది రోజుల్లో అమెరికా వెళ్లవలసి ఉండాల్సిందని చెప్పారు. ఇలాంటి సమయంలో ఈ ఘాతుకం జరిగిందన్నారు.
వినోద్ తల్లి.. పవన్ను అన్నా అన్నా అని సంభోదిస్తూ వివరాలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్కు రాఖీ కట్టారు. అన్నా.. తమకు ఎలాగైనా న్యాయం చేయాలని, తన కొడుకును చంపిన వాడికి కఠిన శిక్ష పడాలని ఆమె దీనంగా అర్థించారు.
జనసేన పార్టీ పెట్టినప్పుడు వినోద్ ఆనందం
మీరు జనసేన పార్టీని పెట్టినప్పుడు తన కొడుకు వినోద్ ఎంతో సంతోషించాడని ఆ తల్లి చెప్పారు. ఇక రాజకీయాల పరంగా కూడా ప్రజలకు మంచి రోజులు వచ్చాయని ఆనందించారని చెప్పారు.
హోటల్లో తెలుగు హీరోల ఫ్యాన్స్ ఫైట్: పవన్ కళ్యాణ్ అభిమాని హత్య
పవన్తో వినోద్ తల్లిదండ్రులతో పాటు అతని సోదరుడు, సోదరి కూడా మాట్లాడారు. అతను మృతి చెందే ముందు కూడా జై పవన్, జై పవన్ అన్నారని చెప్పారు. రాత్రికి ఇంటికి వస్తానని, అన్నం వండమని చెప్పి, అంతలోనే చనిపోయాడన్నారు.
ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, కర్నాటకతో మాట్లాడాలి
తన తనయుడి హత్య కేసులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, కర్నాటక ప్రభుత్వంతో మాట్లాడాలని వినోద్ తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్కు మొరపెట్టుకున్నారు. కేసులో నిందితులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఒకరి పైనే కేసు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
భారీ బందోబస్తు
అంతకుముందు, పవన్ కళ్యాణ్ తిరుపతి విమానాశ్రయం నుంచి భారీ బందోబస్తు మధ్య వినోద్ ఇంటికి బయలుదేరారు. వినోద్ ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంతో సున్నితమైన అంశం కావడంతో అక్కడ ఎటువంటి ఉద్రిక్తత చెలరేగకుండా అభిమానులను కట్టడి చేసేందుకు పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
పవన్ కళ్యాణ్ నుంచి సహకారం వద్దు, శిక్షిస్తే చాలు
పవన్ రాకకు ముందు వినోద్ తల్లి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ నుంచి తమకు ఎలాంటి సహకారం అవసరం లేదని, నిందితుడిని కఠినంగా శిక్షిస్తే చాలని చెప్పారు. మంచి పని కోసం వెళ్తే చంపేయడం దారుణమన్నారు. అవయవ దానం వంటి సేవా మార్గాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలా అని వినోద్ నిత్యం ఆలోచించేవాడన్నారు.
అసలేం జరిగింది?
మూడు రోజుల క్రితం అవయవదానం జరిగిన కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమాని, జనసేన పార్టీ కార్యకర్త అయిన వినోద్ అవయవదానంపై మాట్లాడారు. ప్రసంగం పూర్తయ్యాక వినోద్.. జై పవన్ అన్నారు.
దీని పైన అక్కడే ఉన్న మరో హీరో అభిమాని అక్షయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువురి మధ్య వాదన జరిగింది. అనంతరం కాసేపటికి గొడవ సద్దుమణిగింది. అనంతరం హోటల్లో ఇరువురి మధ్య మరోసారి వాదన జరిగింది. ఈ సమయంలో పవన్ అభిమాని అయిన వినోద్ను అక్షయ్ కత్తితో పొడిచాడు. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.