మళ్ళీ జనంలోకి పవన్ కళ్యాణ్: జనసేన భవిష్యత్ కార్యాచరణ ఇదే!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకపక్క తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలం అవుతున్నాయి. ఇక ఇదే సమయంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి సారించి, భవిష్యత్తు కార్యాచరణ పై పార్టీ శ్రేణులతో చర్చిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, వారాహి యాత్ర ఐదవ దశ నిర్వహణ, జనసేన తెలుగుదేశం సమన్వయ కమిటీల ఉమ్మడి సమావేశ నిర్వహణ అంశాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించిన జనసేన అధినేత త్వరలో మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని, అందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.

మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో నేడు రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై, జనసేన, తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీలో ఉమ్మడి సమావేశ నిర్వహణపై ఆయన చర్చించారు. అంతేకాదు రాష్ట్రరైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులు, సాగునీటి నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం వల్ల కృష్ణ పశ్చిమ డెల్టాలో నాలుగు లక్షల ఎకరాలు ఎండిపోయిన అంశం ప్రధానంగా చర్చించారు.
రైతుల పక్షాన నిలవాలని అందుకు చేపట్టే పోరాటంపై ప్రణాళిక సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు సూచించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేని పరిస్థితి ఉందని పేర్కొన్న పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
జనసైనికులు, వీర మహిళలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని చర్చించిన పవన్ కళ్యాణ్ ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్న వైసీపీ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. మళ్ళీ ప్రజా క్షేత్రంలోకి వెళ్లి వైసీపీ పాలనను ఎండగట్టాలని నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications