పవన్ పై రెక్కీ వివాదం- జగన్, కేసీఆర్ వల్ల కాకపోతే రంగంలోకి-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రెక్కీ నిర్వహించారన్న వార్తలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన నేతలు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దీనిపై విచారణ జరపాలని, అలాగే పవన్ కు భద్రత పెంచాలని కూడా కోరుతున్నారు. కేంద్రంలో మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దీనిపై స్పందించారు.
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పవన్ కళ్యాణ్ రెక్కీ వివాదంపై దర్యాప్తు చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. తెలుగు రాష్ట్రాల వల్ల కాకపోతే అప్పుడు కేంద్రం రంగంలోకి దిగి విచారణ చేయిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. కాబట్టి ముందుగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని, ఇరు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తాయని కిషన్ రెడ్డి తెలిపారు. జనసేన పార్టీ ఆందోళన నేపథ్యంలో కిషన్ రెడ్డి స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోవైపు పవన్ కళ్యాణ్ రెక్కీ వివాదంపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కూడా స్పందించారు. పవన్ కు తగినంత భద్రతను కల్పించాలని అన్నారు. ఆయన ఇంటి వద్ద కొందరు వ్యక్తులు రెక్కీ నిర్వహించారనే వార్తలు వస్తున్నాయని... అయినప్పటికీ, ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సీఎం రమేష్ మండిపడ్డారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినందుకు ఆయన భద్రతను పట్టించుకోరా అని ప్రశ్నించారు. వైసీపీ పార్టీ కార్యకర్తల మాదిరి పోలీసులు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.హోంమంత్రి అమిత్ షా, కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కలిసి ఏపీ పోలీసుల తీరుపై ఫిర్యాదు చేస్తామన్నారు.