'నేను సీఎం కావాలంటే అలా చేయాలి, అశోక్గారూ! నేనే పవన్ కళ్యాణ్, మీ కోటకొచ్చాను'
విజయనగరం: విజయనగరంలో పోరాట యాత్ర సందర్భంగా విజయనగరం కోట వద్ద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుకు మరోసారి చురకలు అంటించారు. 'అశోక్ గజపతిరాజుకి పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తెలియదంట. అయ్యా అశోక్ గారు నేను మీ కోట దగ్గరకు వచ్చాను. నేనే పవన్ కళ్యాణ్. 2014లో మీ తరపున ప్రచారం చేశాను. మీరు అనుభవిస్తున్న పదవిలో నా పాత్ర ఉంది' అన్నారు.
వ్యక్తిగతంగా తనకు అశోక్ గజపతిరాజు అంటే గౌరవమని, మంచి నాయకుడని చెబుతూనే చురకలు అంటించారు. టీడీపీ పాలనలో అవినీతి జరుగుతోందని మండిపడ్డారు. పూసపాటిరేగ, భోగాపురం మత్స్యకార ప్రాంతాల్లో నేటికి ఒక్క జెట్టీ కూడా ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు. నవనిర్మాణ దీక్ష పేరుతో రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారని అదే ఖర్చుతో స్థానికంగా ఒక్క జెట్టీ కడితే మత్స్యకారులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు.

దానికే చంద్రబాబుకు మూడేళ్లు పట్టింది
విపత్తుల సమయంలో బ్రిటిష్ వారు కట్టిన తుఫాను షెల్టర్లలోనే కాలం వెలిబుచ్చే పరిస్థితి మత్స్యకార ప్రాంతాల్లో చోటు చేసుకుందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరంలో ఓ పక్క భారీ వర్షం పడుతుండగానే సభ జరిగింది. గరివిడిలో పశుసంవర్ధకశాఖ డిగ్రీ కళాశాల పెడతామని సీఎం చంద్రబాబు హామీలు గుప్పించారని, కాని దానికి పునాదులు తీయడానికే మూడేళ్లు పట్టిందని, ఇక ఏం పూర్తి చేస్తారన్నారు. జూట్, ఫెర్రో పరిశ్రమలు మూతపడుతుంటే కార్మికుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, వారిని ఒక్కరు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. జనసేన పార్టీ కార్మికులకు అండగా నిలబడుతుందని, ఉద్యోగభద్రత కల్పిస్తామన్నారు.

బొత్స, అశోక్ గజపతి రాజులు చెప్పడమే తప్ప
ప్రభుత్వం భోగాపురం విమానాశ్రయం, తారకరామతీర్థ సాగర్ ప్రాజెక్టుల భూసేకరణ పేరుతో రైతుల నోట్లో మట్టి కొట్టిందని, వారికి తగిన బుద్ధి చెప్పాలని పవన్ అన్నారు. పేర్కొన్నారు. అవసరానికి మించి భూసేకరణ చేసి స్థిరాస్తి వ్యాపారానికి అనుకూలంగా ఆ ప్రాంతాలను తన చేతుల్లో పెట్టుకోవడంలో చంద్రబాబు ఆరితేరారన్నారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేశామంటూ గతంలో బొత్స సత్యనారాయణ, నేడు అశోక్ గజపతి రాజు చెప్పుకోవడమే తప్ప నేటికీ ఈ ప్రాంతంలో కనీసం రహదారులు లేవన్నారు.

ఆకర్షణీయ నగరమా?
హుధుద్ తుపాను సమయంలో బాధితుల కోసం తనవంతుగా రూ.50 లక్షల ఆర్థికసాయం అందించానని పవన్ గుర్తుచేశారు. అసలు ప్రజల నుంచి సేకరించిన విరాళాలు ఎక్కడికి పోయాయో సమాధానం చెప్పాలన్నారు. ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమంటే తన తనయుడు లోకేష్ని మంత్రిని చేయడం కాదన్నారు. విజయనగరం పట్టణంలో పందులు, కుక్కలు విపరీతంగా ఉన్నా ఆకర్షణీయ నగరం అవార్డులు ఇస్తున్నారని, దయచేసి ఇవ్వొద్దని ప్రధానికి ప్రజలే చెప్పాలన్నారు.

ప్రతి కార్యకర్త 500 ఓట్లు వేయించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న నలభై ఏళ్ల రాజకీయ అనుభవంతో ఉచితమనే పేరు చెప్పి ఇసుక మాఫియాకు సైతం చట్టబద్ధత కల్పించారంటూ పవన్ మండిపడ్డారు. విజయనగరం జిల్లాలోని చంపావతి నదిలో ఇసుక మాఫియా నిత్యం వందల లారీల ఇసుక తరలించేస్తోందన్నారు. తాను ముఖ్యమంత్రి కావడానికి ప్రతి జనసేన కార్యకర్త 500 ఓట్లు వేయించాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications