అద్భుతం జరుగుతుందేమో.: టీడీపీతో పొత్తుపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
కర్నూలు: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో తమ పార్టీ అనుబంధం చాలా అద్భుతంగా ఉందన్న పవన్.. వచ్చే ఎన్నికల నాటికి తమతో ఎవరెవరు కలిసి వస్తారో ఇప్పటికీ తెలియదన్నారు. ఇప్పటికైతే బీజేపీతోనే పొత్తు ఉందని స్పష్టం చేశారు.

ఓట్లు చీలితే ఏపీకి మరోసారి తీవ్ర నష్టం: పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించాలంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలన్నారు పవన్ కళ్యాణ్. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే రాష్ట్రానికి మరోసారి తీవ్ర నష్టం వాటిల్లుతందన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి అందరూ కలిసి చర్చించాలని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలని జనసేన అధినేత ఆకాంక్షించారు. ప్రత్యామ్నాయ ప్రభుత్వ ప్రయత్నాన్ని బలంగా తీసుకెళ్తామన్నారు. తాము ఒంటరిగా పోటీ చేయాలని అడగడానికి వైసీపీ వాళ్లెవరని ప్రశ్నించారు.

ఏదో అద్భుతం జరుగుతుంది: పవన్ కళ్యాణ్
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందని.., పొత్తుల గురించే ఇప్పుడే మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు పవన్ కళ్యాణ్. రాష్ట్ర పునర్నిర్మాణానికి అందరూ కలిసి చర్చించాలని అన్నారు. ఇవాళ్టికీ తమకు బీజేపీతోనే పొత్తు ఉందని.., ఏపీ పరిస్థితిని తమ మిత్రపక్షం బీజేపీ నాయకత్వ దృష్టికి తీసుకెళ్తమని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అంటున్నారు కదా.. అలా జరగకుండా ఎలా ముందుకెళ్తారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఏదో అద్భుతం జరుగుతుందని భావిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.

టీడీపీతో పొత్తుపై పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..?
పొత్తుపై టీడీపీ ఆహ్వానిస్తే ఏం బదులిస్తారని మీడియా ప్రతినిధులు అడగ్గా.. బలమైన ఆలోచన విధానంతో ముందుకు వెళ్తామని పవన్ వ్యాఖ్యానించారు. బీజేపీతో సంబంధాలు అద్భుతంగానే ఉన్నాయన్నారు పవన్ కళ్యాణ్. రోడ్ మ్యాప్ ఇచ్చారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ఏడుకోట్ల మంది ప్రజల సమస్య. చాలా ఆలోచించి ఖచ్చితంగా తీసుకుంటాం. రోడ్మ్యాప్కు సంబంధించిన విషయాలు, వ్యూహాలు వెంటనే ఎందకు ఎందుకు చెప్తామని, సరైన సమయంలో పరిస్థితులను బట్టి చెప్తామని అన్నారు. సోము వీర్రాజు రోడ్ మ్యాప్ ఇచ్చినట్లు చెప్పారు కాదా అని ప్రశ్నించగా.. పరిశీలిస్తామని తెలిపారు.

రైతు కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం
నంద్యాల జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. పాణ్యం మండలం కొనిదేడు గ్రామానికి చెందిన సుబ్బారా డు కుటుంబానికి పవన్ భరోసా ఇచ్చారు. కౌలు రైతు భార్య భూలక్ష్మికి లక్ష రూపాయల చెక్కు అందజేశారు. అనంతరం ఆళ్లగడ్డ నియోజకవర్గం శిరివెళ్ల గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రౌతుల కుటుంబాలకు రూ. లక్ష ఆర్థిక సాయం అందించారు పవన్ కళ్యాణ్.

ప్రత్యేక ఆకర్షణగా.. పవన్ కళ్యాణ్ చేతికి రెండు ఉంగరాలు
కాగా, కర్నూలు జిల్లా పర్యటనలో పవన్ కళ్యాణ్ చేతికి రెండు ఉంగరాలతో కొత్తగా కనిపించారు. రెండేళ్లలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని.. అందుకే ఈసారి ఆయన జ్యోతిష్యాన్ని నమ్ముకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఏపీలో పొత్తులపై కీలక చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో పవన్ చేతి వేళ్లకి కొత్తగా రెండు ఉంగరాలు కనిపించడం.. అవి జెమ్ స్టోన్స్ పొదిగిన ఉంగరాలు కావడంతో జ్యోతిష్యానివే అనే చర్చ జరుగుతోంది. అయితే, వీటిపై జరుగుతున్న ప్రచారం మాత్రమే.












Click it and Unblock the Notifications