వైజాగ్ లో ముగిసిన టెన్షన్-విజయవాడకు పవన్-తమ పోరాటం పోలీసుల మీద కాదని క్లారిటీ
ఏపీలో అమరావతి వర్సెస్ మూడు రాజధానుల పోరు నేపథ్యంలో వైసీపీ నిర్వహించిన విశాఖ గర్జన రోజే నగరానికి వచ్చిన పవన్ కళ్యాణ్ తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి నుంచి విజయవాడకు తిరుగుపయనమయ్యారు. దీంతో వైజాగ్ లో 24 గంటలుగా కొనసాగుతున్న టెన్షన్ కు తెరపడినట్లయింది.
మొన్న విశాఖ ఎయిర్ పోర్టులో పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు వచ్చిన జనసేన కార్యకర్తలు విశాఖ గర్జన ముగించుకుని తిరుగుపయనమవుతున్న మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేష్ తో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారాడ్డి కార్లపై దాడులకు దిగారు. ఈ నేపథ్యంలో దాదాపు 100 మంది జనసేన నేతల్ని, కార్యకర్తల్ని పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాకుండా పవన్ జనవాణి కార్యక్రమం కూడా రద్దు చేయించారు. దీంతో విశాఖలో నోవాటెల్ హోటల్ కు వెళ్లిపోయిన పవన్ కోసం భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో బీచ్ రోడ్డులో ఉద్రిక్తతలు తలెత్తాయి. చివరికి వాటిని సద్దుమణిగించే క్రమంలో పవన్ తిరుగుపయనమయ్యారు.
ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ విజయవాడకు పయనమయ్యారు. సాయంత్రానికి వారు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. ఇప్పటికే గవర్నర్ అపాయింట్ మెంట్ కోరిన వీరు.. దొరికితే సాయంత్రం ఆయన్ను కలిసే అవకాశముంది. లేకపోతే రేపు కలుస్తారు. మరోవైపు వైజాగ్ లో పోలీసులు అరెస్టు చేసిన జనసేన కార్యకర్తల్లో 61 మందికి స్టేషన్ బెయిల్ ఇప్పించిన జనసేన లీగల్ సెల్ .. మిగిలిన వారిని కూడా విడిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇదే క్రమంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని పవన్ ప్రకటించారు.
వైజాగ్ లో తమ కార్యకర్తలు 115 మందికి పైగా అరెస్టు చేసి తరలించారని పవన్ కళ్యాణ్ ఇవాళ విడుదల చేసిన వీడియోలో తెలిపారు. వీరిలో 61 మందిని ఇప్పటికే స్టేషన్ బెయిల్ తో విడిపించామని, రిమాండ్ కు పంపిన మిగతా 12 మందికి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. ఇది ప్రభుత్వం మీద పోరాటం తప్ప పోలీసు వ్యవస్ధపై పోరాటం కాదని పవన్ తెలిపారు. హోటల్ బయట నాకోసం ఎదురుచూస్తున్న వారికి అభివాదం కూడా చెప్పలేకపోతున్నానంటూ పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఆంక్షల వల్ల అభిమానులకు అభివాదం చేయలేకపోతున్నానన్నారు.