మౌనంగా ఉన్నారని ఆ దొంగల భావన: శ్రీవారి ఆభరణాలపై కీలక విషయం వెల్లడించిన పవన్!
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై మరో బాంబు పేల్చారు. గురువారం ఆయన వరుసగా ట్వీట్లు చేశారు. ఇందులో ప్రభుత్వ అవినీతి మొదలు అమరావతి భూసేకరణ, రమణదీక్షితులు ఆరోపణలకు సమాధానం తదితర అంశాలపై స్పందించారు.
Recommended Video
రంగంలోకి దిగుతా, మీ థియరీ ప్రకారం: అమరావతి టు పింక్ డైమండ్.. బాబును దులిపేసిన పవన్, హెచ్చరిక
తిరుమల తిరుపతి దేవస్థానం పింక్ డైమాండ్, ఆభరణాల గురించి పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్ చేశారు. కొన్నేళ్ల క్రితం నేను హైదరాబాదులోని ఎయిర్ పోర్ట్ లాంజ్లో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిని కలిశానని, ఆయన తిరుమల అదృశ్యమైన టీటీడీ ఆభరణాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారని తెలిపారు.
టీటీడీ నగల గురించి కీలక విషయం చెప్పాడు
నాకు తెలిసిన విషయం తెలుగుదేశం పార్టీ నేతలకు, ప్రతిపక్ష నేతలకు కూడా తెలుసునని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎయిర్ పోర్ట్ లాంజ్లో కలిసిన వ్యక్తి చెప్పిన వివరాల మేరకు... స్వామి వారి నగలు మధ్య ప్రాచ్య దేశాలకు ఓ ప్రయివేటు విమానంలో తరలి వెళ్లాయి. అందువల్లే తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలు నాకు ఏమాత్రం ఆశ్చర్యంగా అనిపించలేదన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి మౌనంగా ఉన్నారని ఆ దొంగలు భావిస్తున్నారని, అందుకే ఆ నగలను దొంగిలించవచ్చునని ఆ దొంగలు అనుకుంటున్నారని పేర్కొన్నారు.
డైమండ్ ఎలా పగులుతుందో ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో చూపించాలి
అంతకుముందు పింక్ డైమండ్, ఇతర నగలకు సంబంధించిన అంశంపై పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్న సమాధానాలు సంతృప్తికరంగా లేవన్నారు. స్వామివారి ఊరేగింపు సందర్భంగా భక్తులు నాణేలు విసరడంతో పింక్ డైమండ్ పగిలిపోయిందని చెబుతున్నారని, ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో నాణేలు విసిరితే వజ్రం ఎలా పగులుతుందో చేసి చూపించాలన్నారు.
న్యూక్లియర్ ప్లాంట్పై వైసీపీ, టీడీపీలు తమ స్టాండ్ చెప్పాలి
ఉత్తరాంధ్ర, ఇతర ప్రాంతాల్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పైన కూడా పవన్ ట్వీట్ చేశారు. టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు న్యూక్లియర్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో తమ స్టాంట్ ఏమిడో చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, న్యూక్లియర్ ప్లాంట్ విషయంలో ఈఏఎస్ శర్మ పీఎంవో, గవర్నరమెంట్ ఆఫ్ ఇండియా ఎదుట లేవనెత్తిన అభ్యంతరాలు అంటూ వరుసగా పలు ట్వీట్లు పెట్టారు.
జూన్ 26వ తేదీ నుంచి తిరిగి పోరాట యాత్ర
కాగా, పవన్ జూన్ 26 నుంచి తిరిగి తన పోరాట యాత్ర ప్రారంభించనున్నారు. విశాఖ జిల్లాలో మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోను దాదాపు మూడు లేదా నాలుగు రోజుల పాటు ఈ యాత్ర ఉంటుందని, ఆ తర్వాత తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుందని జనసేన ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పవన్ భద్రతా సిబ్బందిలో ఎక్కువ మంది ముస్లింలు ఉండడంతో వారికి రంజాన్ సెలవుల కారణంగా పవన్ పోరాటయాత్ర వాయిదా పడింది.
పవన్ కంటి శస్త్ర చికిత్స వాయిదా
ఇంతలో పవన్కు కంటి సమస్య వచ్చింది. ఆయనకు వైద్యం చేసిన ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యులు శస్త్రచికిత్స అవసరమని చెప్పడంతో పోరాట యాత్ర మరికొద్ది రోజులు ఆలస్యమైంది. ఈ నెల 24న పవన్ కంటికి శస్త్రచికిత్స చేయాలని తొలుత నిర్ణయించినా ఇప్పుడు మరింత సమయం పడుతుందని వైద్యులు పేర్కొన్నారని మహేందర్ రెడ్డి తెలిపారు. దీంతో రెండో విడత పోరాట యాత్రను పవన్ ప్రారంభించబోతున్నారన్నారు. విశాఖ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పర్యటన తర్వాత ఉత్తరాంధ్ర మేధావులతోను సమావేశమవుతారని చెప్పారు.