బిజెపికి పవన్ సీఎం అభ్యర్థి, బాబుకు దెబ్బే, పూర్తికాలం రాజకీయాలకే?
2019 ఎన్నికలకు జనసేన పార్టీ చీఫ్, సినీనటుడు పవన్ కళ్యాణ్ సన్నద్దమౌతున్నారు.ఈ మేరకు ఆయన తన చివరి సినిమాను త్వరగా పూర్తిచేయనున్నారు.
అమరావతి:2019 ఎన్నికలకు జనసేన పార్టీ చీఫ్, సినీనటుడు పవన్ కళ్యాణ్ సన్నద్దమౌతున్నారు.ఈ మేరకు ఆయన తన చివరి సినిమాను త్వరగా పూర్తిచేయనున్నారు. మరో నాలుగైదు మాసాల్లో త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమాను పూర్తిచేసేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీచేయనుంది పవన్ కళ్యాణ్ ఇదివరకే ప్రకటించారు. అయితే తాను పార్ట్ టైమ్ పొలిటిషీయన్ కాదని,పూర్తి కాలం పొలిటీషీయన్ గా మారే ప్రయత్నాలను పవన్ చేస్తున్నారు.
2014 ఎన్నికలకు కొన్నిరోజుల ముందు సినీనటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటుచేశాడు.అయితే ఆ ఎన్నికల్లో జనసేన పోటీచేయలేదు. కానీ, బిజెపి, టిడిపి కూటమికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రచారం చేశాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ టిడిపి, బిజెపి పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు.
అయితే ఎన్నికల తర్వాత అనేకమార్పులు చోటుచేసుకొన్నాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ వైఖరిలో కూడ మార్పులు చోటుచేసుకొన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణను ఆయన తప్పుబట్టారు. మరో వైపు ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యపై చర్చను లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుబడుతూ సభలు నిర్వహించారు.

పూర్తి సమయం రాజకీయాలకే
సినిమాలకోసం సమయాన్ని తగ్గించనున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా చివరి సినిమాగా మారనుంది.మరో నాలుగైదునెలల్లోనే ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేయనున్నారు పవన్ కళ్యాణ్. బహుశా పవన్ కళ్యాణ్ కు చివరి సినిమా కానుంది.అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే పవన్ కళ్యాణ్ పూర్తి సమయాన్ని రాజకీయాలకోసం కేటాయించనున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన అనంతపురం నుండి పోటీచేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు జనసేన పార్టీ యంత్రాంగం కూడ సర్వసన్నాహాలు చేస్తోంది.రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన సినిమాల్లో నటించే అవకాశాలు ఇక ఉండకపోవచ్చని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్ బిజెపి నుండి ముఖ్యమంత్రి అవుతారా
పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంనుండి బిజెపి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలను కొందరు ఆయన సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపితో పొత్తును తెంచుకొని బిజెపి ప్రత్యేకంగా ఫ్రంట్ ఏర్పాటుచేసుకొని ఎన్నికల బరిలోకి దిగితే పవన్ కళ్యాణ్ ను సిఎం అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం లేకపోలేదనే చర్చకూడ ఉంది.

పవన్ కు కలిసిరానున్న కాపు ఓటు బ్యాంక్
సినీనటుడు , జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు ఆయన సామాజికవర్గం కూడ కలిసిరానుందని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో టిడిపి బిజెపి కూటమికి మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం వల్ల కాపు ఓటు బ్యాంక్ ఈ కూటమికి కలిసివచ్చిందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.అయితే పవన్ కళ్యాణ్ బరిలో ఉంటే 27 శాతం ఓటు బ్యాంక్ కలిగిన కాపులు పవన్ కళ్యాణ్ వైపుకు ఎక్కువగా మొగ్గుచూపే అవకాశాలు లేకపోలేదు.

2009లో మాదిరిగానే టిడిపికి దెబ్బేనా?
2009 ఎన్నికలకు ముందుగా పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశాడు..2008 ఆగష్టులో ఆయన తిరుపతిలో పార్టీని ఏర్పాటుచేశాడు.అయితే ప్రజారాజ్యం పార్టీ పోటీచేయడం వల్ల టిడిపికి రావాల్సిన ఓట్లు పిఆర్ పి చీల్చింది. ఈ కారణంగానే తాము ఓటమిపాలైనట్టు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు గతంలో చెప్పాడు. 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చిరంజీవి పరోక్షంగ కారణమయ్యాడు.అయితే పిఆర్ పిని చిరంజీవి ఎక్కువ కాలం నడపలేకపోయాడు. పార్టీని ఆయన కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. కేంద్రమంత్రిగా పనిచేశారు. అయితే 2019 ఎన్నికల్లో జనసేన పోటీచేసేందుకు సన్నాహాలు చేసుకొంటుంది.అయితే ఈ దఫా కూడ చిరంజీవి నేతృత్వంలోని పిఆర్ పి తరహాలోనే జనసేన పోటీచేస్తే టిడిపికి దెబ్బపడే అవకాశం ఉంటుందా అనే చర్చ కూడ లేకపోలేదు.అయితే ఎన్నికలనాటికి ఉన్న రాజకీయపరిస్థితులు కూడ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.












Click it and Unblock the Notifications