Pawan Kalyan: ఇంకా అనారోగ్యంతోనే పవన్..! హైదరాబాద్ కు షిఫ్ట్..!
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇంకా అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నారు. ఇప్పటికే ఆయనకు వైరల్ ఫీవర్ సోకడం, దగ్గు తగ్గకపోవడంతో పూర్తిగా విశ్రాంతిలోనే ఉన్నారు. ఈ వారం ప్రారంభంలోనే ఆయనకు వైరల్ ఫీవర్ సోకినా విధులకు అలాగే హాజరయ్యారు. దీంతో జనసేన పార్టీ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఆ తర్వాత మాత్రం విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఇవాళ్టికీ ఆయనకు జ్వరం, దగ్గు తగ్గడం లేదని తెలుస్తోంది.
దీంతో పవన్ కళ్యాణ్ ను అమరావతి నుంచి హైదరాబాద్ కు తరలించేందుకు సిద్దమవుతున్నారు. అయితే ఆయన సొంత వాహనంలోనే పవన్ హైదరాబాద్ వెళ్లే అవకాశం ఉంది. కుదరకపోతే మాత్రం గన్నవరం వెళ్లి విమానంలో హైదరాబాద్ కు పయనం కానున్నారు. ఈ మేరకు పవన్ హైదరాబాద్ వెళ్తారని మాత్రం జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. పవన్ కల్యాణ్ వైరల్ జ్వరంతో బాధపడుతున్నారని, గత నాలుగు రోజులుగా వైద్యం చేయించుకొంటున్నారని వెల్లడించింది.

పవన్ కు జ్వరం తీవ్రత తగ్గలేదని, దగ్గు ఎక్కువగా ఉండటంతో ఇబ్బందిపడుతున్నారని జనసేన పార్టీ ప్రకటించింది. వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్ లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారని జనసేన పార్టీ వర్గాలు ప్రకటనలో తెలిపాయి. కాబట్టి ఇవాళ పవన్ కల్యాణ్ మంగళగిరి నుంచి హైదరాబాద్ వెళ్తారని వెల్లడించాయి. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా పవన్ హాజరు కావడం లేదు.

పవన్ తాజా చిత్రం ఓజీ విడుదలై ఘన విజయం సాధించినప్పటికీ ఆయన మాత్రం ఎక్కడా సందడి చేసే పరిస్ధితి లేదు. వాస్తవానికి గత వారం ఓజీ ప్రీరిలీజ్ ఫంక్షన్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. అప్పుడు వర్షంలోనే హాజరైన పవన్ ఉత్సాహంగానే కనిపించారు. ఆ తర్వాత జ్వరం వచ్చినట్లు తెలుస్తోంది. అయినా తొలి రెండు, మూడు రోజులు ఆయన అసెంబ్లీకి, అధికారులతో సమీక్షలకు కూడా హాజరయ్యారు. జ్వరం తగ్గకపోవడంతో వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications