తెగదెంపులు, ఇక పవన్ కల్యాణ్ ఫైట్: చంద్రబాబుకు పరీక్ష
విశాఖపట్నం: మిత్రపక్షాలైన తెలుగుదేశం, బిజెపిలపై పోరుకు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. విశాఖపట్నంతో జనసేన తన పోరును ప్రారంభించనున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. వచ్చే నగర పాలిక ఎన్నికల నాటికి ఆ రెండు పార్టీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు జనసేన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు అర్థమవుతోంది.
కాలుష్య నివారణలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని, హుదుద్ తుఫాను సహాయక నిధుల్లో గోల్మాల్ జరిగిందంటూ జనసేన కార్యకర్తలు ఆందోళనకు శ్రీకారం చుట్టడానికి విశాఖపట్నంలో రంగం సిద్ధం చేసుకుంటున్నారు. విశాఖపట్నం నగర పాలక సంస్థ (జివిఎంసి)లోని 72 వార్గుల్లో కూడా జనసేన సమావేశాలు నిర్వహించింది.
జనసేన కార్యకర్తలు వార్డులవారీగా ప్రజా సమస్యలను అధ్యయనం చేస్తూ దశలవారీగా ఆందోళనలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం సమస్యలపై పవన్ కల్యాణ్కు వారు సవివరమైన నివేదికను సమర్పించి, భవిష్యత్తు కార్యాచరణకు తమకు సూచనలు చేయాల్సిందిగా కోరాలని నిర్ణయించుకున్నారు.
తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకోవాలని మెజారిటీ జనసేన కార్యకర్తలు అభిప్రాయపడినట్లు సమాచారం. ప్రభుత్వ అసమర్థతను వారు ఎత్తిచూపుతూ ఆ వాదన చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో టిడిపి, బిజెపిలకు మద్దతు తెలిపినందున సమస్యల విషయంలో తమపై ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తోందని, తాము వారికి ఏమీ చెప్పలేకపోతున్నామని, ఇది తమ ప్రతిష్టకు సంబంధించిన విషయమని జనసేన కార్యకర్తలు, స్థానిక నాయకులు అంటున్నారు.
ఈ పరిస్థితిలో తెలుగుదేశం పార్టీకి దూరమై సొంతంగా వచ్చే జివిఎంసి ఎన్నికల్లో పోటీ చేయాలనే ప్రతిపాదనలు కూడా ముందుకు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ చీఫ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఇది పరీక్ష పెట్టే అవకాశమే ఉంది.