ఎదవ జీవితమనుకుంటే: అబ్బా అంటూ పవన్ ఉత్సాహం
చిత్తూరు: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా ప్రచారంలో ఆకట్టుకునేలా మాట్లాడారు. అలాగే కొన్ని చెణుకులు విసిరారు. అన్యాయం గురించి మాట్లాడుతూ... ఒక్కసారి ఎదవ జీవితం అనుకుంటే దేనికైనా తెగించలేమా, నాయకుడు ఐదు తరాల గురించి మాట్లాడాలి కానీ ఐదేళ్ల గురించి మాట్లాడవద్దని హితవు పలికారు.
తెలంగాణపై పార్లమెంటులో జరిగిన విధానం తనకు నచ్చలేదన్నారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులను సహచర ఎంపీలతో కొట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అంతకుముందు బాగా తిట్టి... ఇప్పుడు రాష్ట్రం రాగానే జరిగిందేదో జరిగిందంటున్నారని ఎద్దేవా చేశారు. తాను కెసిఆర్కు భయపడి నోరు మూయలేదని, తెలంగాణ ప్రజల పైన ఉన్న ప్రేమ తనను మాట్లాడకుండా చేసిందన్నారు. తన ఫాం హౌస్ పైన దాడి చేశారన్నారు. పోతన పుట్టిన ఊరు ఓరుగల్లు అన్నారు. తెలంగాణ భాష గొప్పదని, ప్రతి ఒక్కరికి భాష, యాస ఉంటుందని అన్నారు.
టిడిపి చిత్తూరు ఎంపి శివప్రసాద్ నాడు పిఆర్పిని తిట్టినా తనకు కోపం లేదని నవ్వుతూ అన్నారు. పార్టీలు కొట్టుకునేది ప్రజల కోసమేనని చెబుతూ... శివప్రసాద్ను ఎంపీగా గెలిపించాలని కోరారు.
కాంగ్రెసు పార్టీ గురించి మాట్లాడి మాట్లాడి గొంతు పోతోందని, కానీ వారికి మాత్రం బుద్ధి రావడం లేదన్నారు. కాగా సభలో పవన్ ఆద్యంతం ఫ్రెండ్లీగా మాట్లాడారు. సీమాంధ్రులకు ధైర్యం, తెగింపు తక్కువ అబ్బా అంటూ ఫ్రెండ్లీగా మాట్లాడారు. చాలాసేపు మాట్లాడిన పవన్.. అబ్బా అబ్బా అంటూ సంభోదించారు.