పవన్ కళ్యాణ్ సడన్ ట్విస్ట్ - వైసీపీకి కలిసొచ్చేనా : బూమ్ రాంగ్ - టీడీపీ..బీజేపీ క్యాంపుల్లో..!!
ఏపీ రాజకీయాల్లో సడన్ టర్న్..కొత్త సమీకరణాలకు కారణమవుతోంది. ఏపీలో పొత్తుల పైన జనసేన అధినేత తాను చెప్పదలచుకున్నది చెప్పేసారు. మూడు ఆప్షన్లు అంటూనే..తాము ఒంటరి పోరాటానికి సైతం సిద్దమేనని తేల్చి చెప్పారు. టీడీపీ సైతం తగ్గాలని సూచించారు. అప్పుడే పొత్తు సాధ్యమనే విధంగా సంకేతాలు ఇచ్చారు. బీజేపీతో కలిసే ఉన్నామని చెబుతూనే..అటు టీడీపీ ప్రస్తావన..ఇటు ఒంటరి పోరాటం పైన పవన్ చేసిన వ్యాఖ్యలు కమలం పార్టీ నేతలకు రుచించటం లేదు. ఇప్పటి వరకు చంద్రబాబు - పవన్ కలిసే ఉన్నారంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు ఇప్పుడు పవన్ కామెంట్స్ తో మరింత బలం పెరిగింది. వైసీపీ తిరిగి అధికారంలోకి రాదు..ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ పవన్ పదే పదే చెబుతున్నారు.

జనసేనాని వ్యాఖ్యల బూమ్ రాంగ్
కానీ, తాజాగా జనసేనాని పొత్తులపైన చేసిన వ్యాఖ్యలు బూమ్ రాంగ్ అయిటనట్లు అటు బీజేపీ ..ఇటు టీడీపీ క్యాంపు వస్తున్న సంకేతాలు స్పష్టం చేస్తున్నాయి. 40 ఇయర్స్ ఇండస్ట్రీకి పవన్ తగ్గాలని చెప్పటం ఏంటని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ అధినాయకత్వం మౌనంగా ఉన్నా.. కింది స్థాయితో మాత్రం పవన్ తమ పార్టీ అధినేత తగ్గాలని చెప్పటం..పరోక్షంగా తన డిమాండ్లు ఒప్పుకోవాలనే విధంగా వ్యాఖ్యలు చేయటం రుచించటం లేదు. అసలు జనసేనతో పొత్తు అవసరం లేదని.. తాము ఒంటరిగా వెళ్లినా గెలుస్తామనే ధీమా టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అటు బీజేపీ నేతలకు పవన్ ప్రతిపాదనలు రుచించటం లేదు. దీనికి తోడు పవన్ ను బీజేపీ- జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్దిగా ప్రకటించాలనే జనసేన నేతల డిమాండ్ ను బీజేపీ తప్పు బడుతోంది. బీజేపీలోనూ సీఎం పదవికి సమర్ధులు చాలా మంది ఉన్నారంటూ పార్టీ నేతలు ఓపెన్ గానే వ్యాఖ్యానిస్తున్నారు.

టీడీపీ వ్యూహాత్మక మౌనం
అదే సమయంలో వైసీపీ సైతం ఆచితూచి స్పందిస్తోంది. పవన్ - చంద్రబాబు ఇప్పటికే కలిసి ఉన్నారని..ఎప్పటికీ కలిసే ఉంటారంటూ వ్యూహాత్మకంగా ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తోంది. జనసేన - టీడీపీతో కలిస్తే..బీజేపీ మిత్రపక్షంగా కొనసాగేందుకు సిద్దంగా లేదు. ఇక, టీడీపీ తగ్గాలని చెప్పటం ద్వారా అటు సీట్ల ఖరారులో..ఇటు అధికారంలో తమకు ప్రాధాన్యత ఇవ్వాలనే విధంగా పవన్ చేసిన వ్యాఖ్యలు సైతం వైసీపీకి కలిసొచ్చే అంశంగా ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అయిదేళ్ల పాలన తరువాత పాజిటివ్ ఓట్ తోనే అధికారంలోకి వస్తామని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నా...ప్రభుత్వ వ్యతిరేక ఓటు సహజంగానే ఉంటుందనేది విశ్లేషకుల అంచనా. దీంతో..ఆ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటూ ఇప్పటి వరకు చెబుతూ వచ్చిన పవన్..ఇప్పుడు పొత్తుల విషయంలో చేసిన వ్యాఖ్యలతో అటు బీజేపీ..ఇటు టీడీపీ గుర్రుగా ఉన్నాయి. జనసేన డిమాండ్ చేసిన విధంగా సీట్ల కేటాయింపుకు టీడీపీ అంగీకరించే అవకాశమే లేదనేది బలంగా వినిపిస్తున్న అభిప్రాయం.

సడన్ ట్విస్ట్ - వైసీపీకి అనుకూలమా
అదే సమయంలో టీడీపీని కాదని..బీజేపీ - జనసేన కలిసి పోటీ చేసినా..అది వైసీపీకి అనుకూలించే అంశమే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలక ఆ పార్టీకి కలిసి రానుంది. దీంతో పాటుగా జనసేనకు మద్దతుగా నిలుస్తున్న వారిని..జనసైనికుల విషయంలో వైసీపీ కీలక వ్యాఖ్యలు చేస్తోంది. పవన్ కళ్యాణ్ ఎవరికి అధికారం ఇవ్వటం కోసం కాపులను..జనసైనికులను వాడుకుంటున్నారో గుర్తించాలంటూ వ్యాఖ్యానిస్తోంది. పవన్ కళ్యాణ్ బీజేపీ చీఫ్ నడ్డా ఏపీ పర్యటనకు ముందు పొత్తు వ్యాఖ్యలు చేసారు. కానీ, నడ్డా పర్యటనలో వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా.. పొత్తుల అంశం పైన నడ్డా ఎటువంటి వ్యాఖ్యలు చేయరని బీజేపీ నేతలు తేల్చి చెబుతున్నారు. దీని ద్వారా.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు మాత్రం వైసీపీకి ఒక విధంగా రాజకీయంగా కలిసి వచ్చేవిగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కానీ, ఎన్నికల సమయంలో తిరిగి ఈ పార్టీలు కలిసినా..తాము ఒంటరిగా పోటీ చేస్తామని ముందు నుంచి చెబుతున్నట్లుగానే బరిలో దిగుతామని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు రోజు రోజుకీ కొత్త ట్విస్టులతో ఆసక్తి కరంగా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications