సీటు ఇస్తానని లీక్ చేశారు, తలుచుకుంటేనే భయమేస్తోంది: బాబుపై పవన్ సంచలనం
Recommended Video
విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటే తనకు రాజ్యసభ సీటు ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని, కానీ నవ్యాంధ్ర అభివృద్ధి కోసం ఓట్లు చీలవద్దని పోటీ చేయలేదని పవన్ అన్నారు. తనకు రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి, మరుసటి రోజే రెండు పేపర్లకు లీకులు ఇచ్చారన్నారు.
తన ప్రమేయం లేకుండానే బయట అందరికీ తెలిసేలా చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన అమరావతిలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడారు. తనకు టీడీపీపై, చంద్రబాబుపై ఆ రోజే నమ్మకం పోయిందన్నారు. ఆ తర్వాతే తాను బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కలిశానని చెప్పారు.
రివర్స్: బాబు ప్రభుత్వంపై బీజేపీ అవిశ్వాసం ప్లాన్, 'జగన్ ఇక్కడ అడిగిన ప్రశ్నలే టీడీపీ అడిగింది'
2012లో పార్టీ పెడతానని చంద్రబాబును కలిశా
తాను 2012లోనే చంద్రబాబును కలిశానని, పార్టీ పెట్టే విషయమై చెప్పానని పవన్ తెలిపారు. తాను పార్టీ పెడితే ఓట్లు చీలిపోతాయని, పోటీ చేయవద్దని చెప్పారని తెలిపారు. తాను పోటీ చేస్తే ఓట్లు చీలుతాయని ఆందోళన చెందారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ ఒక్కరికే ఉద్యోగం వచ్చిందన్నారు. ఉపాధి చూపాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు.
అందుకే టీడీపీ, బీజేపీకి మద్దతు
2014లో తాను నవ్యాంధ్ర కోసం బీజేపీ, టీడీపీకి మద్దతిచ్చానని చెప్పారు. 2014లోనే అరవై, డెబ్బై సీట్లలో పోటీ చేసి ఉంటే ఇప్పుడు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడే అవకాశముండేదన్నారు. జగన్లా తాను అసెంబ్లీని బహిష్కరించకపోయేవాడినని చెప్పారు. కాగా, అమిత్ షా కూడా పవన్కు.. రాజ్యసభ ఆఫర్ ఇచ్చారు. దానిని కూడా పవన్ తిరస్కరించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
తలుచుకుంటేనే భయమేస్తోంది
లోకేష్ ముఖ్యమంత్రి అయితే తనకేమీ అభ్యంతరం లేదుకానీ, రాష్ట్రం ఏమవుతుందోనన్న భయం మాత్రం ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. పుట్టుకతోనే ఎవరికీ రాజకీయ అనుభవం ఉండదని చెప్పారు. తనకు రాజకీయ అనుభవం లేదన్న వ్యాఖ్యలకు పైవిధంగా కౌంటర్ ఇచ్చారు. కిందపడ్డా, పైకి ఎక్కినా చివరకు అధికారం జనసేన పార్టీదే అన్నారు.
నాకు కులపిచ్చి ఉంటే
తనకు కులపిచ్చి ఉంటే టీడీపీకి ఎందుకు మద్దతు ఇచ్చేవాడినని పవన్ ప్రశ్నించారు. చంద్రబాబు తనపై కులముద్ర వేయాలని చూస్తున్నారని, ఉద్యోగం మీ అబ్బాయికి ఇస్తే చాలదని, రాష్ట్రంలోని నిరుద్యోగులకు కావాలన్నారు. లోకేష్ సీఎం అయితే ఏం జరుగుతుందో తలుచుకుంటేనే భయమేస్తోందన్నారు. జగన్ను ఏం అడిగినా సీఎం అయితే చేస్తానని చెబుతారని ఎద్దేవా చేశారు. సమస్య పరిష్కరించాలంటే మీరు ముందు అసెంబ్లీకి రావాలన్నారు. రాజధానికి ఇన్నివేల ఎకరాలు అవసరం లేదన్నారు. పంటలు పండించే భూములు మీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఇవ్వాలా, మూడు పంటలు పండే భూములు తీసుకోవడం ఏమిటన్నారు.
టీడీపీని ఏమనకున్నా తిట్టారు
జనసేన పార్టీది యునైటెడ్ రూల్ అని, మిగిలిన పార్టీలది డివైడ్ రూల్ అని పవన్ అన్నారు. అందుకే జనసేన నినాదంలో కులాల ఐక్యత అని పెట్టామన్నారు. రెండు వర్గాల వారు కొట్టుకుంటే వారు విడివిడిగా ఉంటే మీకు ఆనందంగా ఉంటుందా అని ముఖ్యమంత్రిని నిలదీశారు. పవన్ బీజేపీని ఏమీ అనడం లేదని సీఎం అంటున్నారని గతంలో టీడీపీని ఏమీ అనకపోయినా బూతులు తిట్టారని ఆరోపించారు. తానెప్పుడూ యూటర్న్ తీసుకోలేదన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబును కలిశానని, కొన్ని సీట్లు ఇశ్తామని చెప్పారన్నారు.
జనసేనలో చేరిన పలువురు నేతలు
ఇదిలా ఉండగా, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు నేతలు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. వైసీపీలో ఉన్నప్పుడు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొందరిని టీడీపీలో చేర్పించుకుని మంత్రి పదవులిచ్చిన ముఖ్యమంత్రి, తమ భూములను తీసుకోవద్దని అడుగుతున్న రైతులపై మాత్రం పీడీ చట్టం కింద కేసులు పెడుతున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో పోటీచేసి నేను ఒక్క సీటు గెలిచున్నా సరే జగన్లా అసెంబ్లీ నుంచి పారిపోయేవాణ్ని కాదన్నారు. అక్కడే పోరాడేవాణ్ని అన్నారు. పది మంది ఎమ్మెల్యేలుంటే అసెంబ్లీనే స్తంభింపజేసేవాణ్ని అన్నారు. బంగారం లాంటి అవకాశాన్ని జగన్ వృథా చేశారన్నారు.