వైసీపీ ప్రశ్న: అనూహ్య నిర్ణయం తీసుకున్న పవన్, నేను ముఖ్యమంత్రిని అయితే...
Recommended Video

గుంటూరు: తాను సినిమాలను వదిలేస్తున్నానని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. మధ్యలో కుదిరితే సినిమాలు చేస్తానని గతంలో చెప్పారు. కానీ ఆయన తాజాగా సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నారు.
మంగళగిరిలో పార్టీ కార్యాలయం కోసం స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తాను ఇలా వచ్చి అలా వెళ్తున్నానని కొందరు విమర్శలు చేస్తున్నారని చెప్పారు. తనకు పార్టీ కార్యాలయం దేవాలయం వంటిది అని చెప్పారు. వైసీపీ నాయకులు రోజా తదితరులు ఆయనను ఇదే విషయమై పదేపదే ప్రశ్నిస్తోన్న విషయం తెలిసిందే.

నేను సీఎంను అయితే ఒకలా, ప్రతిపక్షంలో మరొకలా ఉండను
ముఖ్యమంత్రిని అయితే ఓరకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను మరో రకంగా ఉండనని పవన్ కళ్యాణ్ చెప్పారు. తాను ఎప్పుడూ ఓకేలా ఉంటానని చెప్పారు. తాను సీఎంను అయితే సమస్యలను పరిష్కరిస్తానని వైసీపీ అధినేత జగన్ చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ పైవిధంగా మాట్లాడారు.

ఓట్ల రూపంలో ఈ ఉత్సాహం చూపించండి
పవన్ కళ్యాణ్ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు తరలి వచ్చారు. వారు పవన్.. పవన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పవన్ స్పందిస్తూ.. మీ ఉత్సాహం ఓట్ల రూపంలో చూపించాలని వారికి సూచించారు.

అభిమానులను గట్టిగా హెచ్చరించిన పవన్
తాను మాట్లాడుతున్న సమయంలో గందరగోళం సృష్టిస్తోన్న ఫ్యాన్స్ను, కార్యకర్తలను పవన్ కళ్యాణ్ గట్టిగా హెచ్చరించారు.
అభిమానులు పవన్ చెప్పేది వినకుండా అందరూ లీడర్.. లీడర్.. సీఎం.. సీఎం అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు.

భారత్ మాతాకీ జై అనండి, మీరు అరిస్తే సీఎం అవుతానా
మీరు పుట్టిన ఈ గడ్డ మీద గౌరవం ఉంటే, నాపై కాకుండా జనసేన పార్టీకి కాకుండా భారత్ మాతకి జై చెప్పండి అని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతిసారి సీఎం సీఎం అని మీరు అరిస్తే నేను సీఎం అయిపోతానా? అరుపులు కేకలతో మార్పులు రావు ఆలోచనలతో కూడిన సంస్కరణల వల్ల మార్పులు వస్తాయని చెప్పారు.

అరుపులు, కేకలతో మార్పు రాదు
దేశం బాగుపడాలన్న ఆలోచన ఉండి, సరైన విధివిధానాలతో ముందుకు వెళితేనే మార్పు సాధ్యమని పవన్ కళ్యాణ్ చెప్పారు. మీ ఉత్సాహాన్ని మార్పుకు, జనసేనను క్రమశిక్షణతో ముందుకు తీసుకువెళ్లడానికి ఉపయోగించాలని చెప్పారు. అరుపులు, కేకలతో మార్పులు రావని చెప్పారు.

రాజధానిపై పవన్ కళ్యాణ్
ప్రజలు ఆనందంగా లేనప్పుడు ఎంత పెద్ద రాజధాని కట్టినా ఫలితం ఉండదని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను మంగళగిరిలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నానని, ప్రజల సమస్యపై మరింత విస్తృతంగా పోరాడుతానని చెప్పారు. డబ్బులు లేనప్పుడు ఆడంబరాలు ఎలా అన్నారు. ఆయన మంగళవారం మంగళగిరిలో జనసేన కార్యాలయం కోసం స్థలాన్ని పరిశీలించారు.

వందమంది విద్యార్థులను కాపాడలేరా
ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రాగానే వచ్చే అయిదేళ్ల కోసం ఆలోచిస్తుందని, అలాంటిది కష్టపడి చదువుకున్న విద్యార్థులు ఒక ఏడాది నష్టపోవాలంటే ఎంత బాధగా ఉంటుందో ఓసారి ఆలోచించాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఫాతిమా విద్యార్థులు తనను కలిసినప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక క్రిమినల్ను బెయిలవుట్ చేసేందుకు ఎంతో చేస్తున్నారని, ఒక తుపాకీతో కాల్చితే అప్పుడు రక్షించేందుకు ప్రభుత్వం ఎంతో వాడిందని, అలాంటిది వందమంది విద్యార్థులను కాపాడలేరా అని ప్రశ్నించారు. ఫాతిమా విద్యార్థుల సమస్యకు పరిష్కారం చూపించకుంటే అది ప్రభుత్వానికి మాయని మచ్చలా మిగిలిపోతుందన్నారు.












Click it and Unblock the Notifications