జగన్కి మద్దతిచ్చేవాడ్నే,మళ్లీ నక్సలిజం: పవన్ వార్నింగ్
విశాఖ/ఒంగోలు: సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే నక్సల్స్ ఉద్యమాలు వస్తాయని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదివారం హెచ్చరించారు. ఆయన సీమాంధ్రలో పలు ప్రాంతాల్లో టిడిపి, బిజెపి కూటమి తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అవినీతిపరులను ఈ ఎన్నికల్లో తరిమికొట్టాలంటూ పిలుపునిచ్చారు.
అడ్డగోలుగా సమాజ సంపదను దోపిడీ చేసే జగన్ లాంటి వారు సీమాంధ్రకు సిఎం అయితే భవిష్యత్లో ఈప్రాంతంలో తీవ్రవాద, ప్రాంతీయ ఉద్యమాలు తప్పవని ఆయన హెచ్చరించారు. జగన్ పాపపు సొమ్ము జనాల్లోకి రావాల్సిందేనన్నారు. అలాంటి వారి దోపిడీకి వ్యతిరేకంగా పోరాడేందుకే తాను జనసేన పార్టీని స్థాపించానని, యువకులంతా తనతో కలిసి దోపిడీదారులపై పోరాడాలని పిలుపునిచ్చారు. అవినీతిపై జగన్ పోరాడి ఉంటే ఆయనకే మద్దతు ఇచ్చి ఉండేవాడినన్నారు.
సిఎం కావాలన్న జగన్ కోరిక రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చీల్చిందన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడలేని జగన్ సీమాంధ్రాకు సిఎం కాలేరని తెలిపారు. 2004 నుంచి రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన సాగిందన్నారు. వైయస్ సిఎం అయ్యాక తనకు వ్యక్తిగతంగా వచ్చిన నష్టమేమీ లేకున్నా, ఆయన అనుసరించిన విధానాలు, కొంతమంది వ్యక్తులకు అడ్డగోలుగా సమాజ సంపదను అప్పజెప్పడం తనను కలిచివేశాయన్నారు.
సిఎం పదవి కోసం తండ్రి మృతదేహం పక్కన ఉండగానే శవరాజకీయాన్ని చేసిన ఘనుడిగా జగన్ను ఆక్షేపించారు. రాష్ట్ర విభజన జరిగిన తీరు మరింత బాధ కలిగించిందన్న పవన్ అందుకు కారకులైన జగన్ను, కెసిఆర్లను క్షమించరాదన్నారు. తెలంగాణ సాధించామని హద్దు మీరి ప్రవర్తించి, సీమాంధ్ర ప్రజల భద్రతకు భంగం కలిగిస్తే తాట తీస్తామన్నారు. తెలంగాణలో ఉంటున్న సీమాంధ్రులను దూషించి, బెదిరించి, దోచుకునేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు.
తానూ హైదరాబాద్ వాసినేనని, ఎవరికీ, ఎలాంటి బెదిరింపులకు తలొగ్గే ప్రసక్తిలేదన్నారు. ఎవరు ఎన్నికేసులు పెట్టుకున్నా, జైల్లో పెట్టినా భయపడే ప్రసక్తిలేదని స్పష్టం చేశారు. ప్రజలకు అన్యాయం చేసిన వారు, ప్రజల సొమ్ము దోచిన వారు అంతం అయిపోవాల్సిందేనని పవన్ చెప్పారు. వంద గొడ్లు తిన్న రాబందు సైతం గాలి వానకు చచ్చిపోతుందని.. అవినీతిపరుల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు. అవినీతికి పాల్పడి వేల కోట్ల ప్రజాధనాన్ని దోచి జగన్ జైలుకు వెళ్లారని ఆరోపించారు.