చిరు హోల్సేల్ ఐతే, చిల్లర నేత, ఇంత రాజకీయమా?: పవన్పై టీడీపీ తీవ్రవ్యాఖ్యలు
అమరావతి: రాజధాని ప్రాంతంలోని రైతులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఆయన ఆదివారం ఉండవల్లిలో అక్కడి రైతుల సమస్యలు తెలుసుకున్న విషయం తెలిసిందే. తమ భూములు బలవంతంగా లాక్కుంటున్నారని పలువురు ఆయనతో గోడు వెళ్లబోసుకున్నారు. తాను అండగా నిలబడతానని జనసేనాని హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు వరుసగా ఆయనపై మాటల దాడి చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లుగా వింటున్నారని ఆరోపిస్తున్నారు. టీడీపీ నేత, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ తదితరులు జనసేనానిపై నిప్పులు చెరిగారు. చిల్లర నాయకుడు, పార్టీని అమ్మేసుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

జగన్కు అర్హత లేదని వర్ల రామయ్య
బంద్కు పిలుపునివ్వడానికి వైసీపీ అధినేత వైయస్ జగన్కు అర్హత లేదని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. ఉనికిని కాపాడుకునేందుకే వైసీపీ రేపు బంద్కు పిలుపునిచ్చిందని చెప్పారు. జగన్ ఏపీ పక్షం కాదని, ప్రధాని నరేంద్ర మోడీ పక్షమని ఆరోపించారు. కేసుల నుంచి బయటపడేందుకు బీజేపీకి దగ్గర అవుతున్నారన్నారు. వైసీపీ బంద్లో ఏపీ ప్రజలు పాల్గొనవద్దన్నారు.

జగన్, పవన్లపై వర్ల తీవ్ర వ్యాఖ్యలు
జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ల మాటలను ప్రజలు నమ్మవద్దని వర్ల రామయ్య పిలుపునిచ్చారు. దొంగల నాయకుడు జగన్ అయితే, చిల్లర నాయకుడు పవన్ కళ్యాణ్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. క్షణక్షణానికి రంగులు మార్చే పవన్ను ఏమాత్రం నమ్మవద్దన్నారు.

ఇంత నీచ రాజకీయమా? ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్
తులను అడ్డుపెట్టుకొని పవన్ కళ్యాణ్ నీచ రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రాజధాని రైతులను కావాలని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. 98 శాతం రైతులు భూములను స్వచ్చంధంగా ఇచ్చారని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని పవన్ చెప్పారని, ఆ ప్రతిజ్ఞ ఏమయిందని నిలదీశారు. టీడీపీని గెలిపించానన్న పవన్ వ్యాఖ్యలు హాస్యాస్పదం అన్నారు. గతంలో తన సోదరుడు చిరంజీవి స్థాపించిన పీఆర్పీని గెలిపించలేదని, ఇప్పుడు తమను గెలిపించారా అన్నారు.

చిరంజీవి హోల్సేల్, పవన్ రిటైల్
చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్కు హోల్సేల్గా అమ్మేశారని, పవన్ కళ్యాణ్ బీజేపీకి తన జనసేనను రిటైల్గా అమ్మేస్తున్నారని రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. రేపటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బందుకు ప్రజల మద్దతు ఉండదని చెప్పారు. వైసీపీ అధినేత జగన్, పవన్లు మోడీకి వాళ్ల పార్టీలను తాకట్టు పెట్టారని విమర్శించారు.

అవిశ్వాసం టీడీపీకి పరాభవమని జీవీఎల్
అవిశ్వాస తీర్మానం విషయంలో తెలుగుదేశం పార్టీకి పరాభవం తప్ప ఏమీ మిగలలేదని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు సోమవారం ఎద్దేవా చేశారు. టీడీపీకి ఒక్క పార్టీ కూడా సరైన మద్దతు పలకలేదన్నారు. టీడీపీకి ఇక ఎన్నికల్లో ఓడిపోవడం ఒక్కటే మిగిలి ఉందన్నారు. విపక్షాలు అవిశ్వాస తీర్మానంతో సాధించిందేమీ లేదన్నారు.












Click it and Unblock the Notifications