మోడీ-బాబులను డిఫెన్స్లో పడేసిన పవన్ కళ్యాణ్: చెప్పింది వింటే సరే లేదంటే అంతే!
అమరావతి/విశాఖ: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తన పర్యటనను మూడు విడతలుగా చేయాలని నిర్ణయించారు. ఆయన పర్యటన బుధవారం ఉదయం విశాఖపట్నంతో ప్రారంభమైంది. విశాఖ, రాజమహేంద్రవరం, పోలవరం, విజయవాడ, ఒంగోలులో పర్యటిస్తున్నారు. పర్యటనకు సంబంధించిన ప్రణాళికను జనసేన విడుదల చేసింది.
బుధవారం డీసీఐ (డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా నుంచి తన పర్యటన ప్రారంభిస్తున్నారు. ఈ సంస్థ ప్రయివేటీకరణను ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. దీనికి పవన్ మద్దతు పలుకుతున్నారు. మొత్తం నాలుగు రోజుల పాటు ఏపీలో పర్యటిస్తున్నారు. 7వ తేదీన రాజమహేంద్రవరంలో పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి పోలవరం వెళ్లి పనులను పరిశీలిస్తారు.
8వ తేదీన విజయవాడలో ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థులతో సమావేశమవుతారు. 9వ తేదీన మంగళగిరిలో పార్టీ కార్యాలయం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలిస్తారు. అక్డి అక్కడి నుంచి ఒంగోలు చేరుకొని పడవ ప్రమాద కుటుంబాలను పరామర్శిస్తారు.

చెప్పినప్పుడు వింటే సరే లేదంటే
పవన్ కళ్యాణ్ మూడు విడతలుగా తన పర్యటనను చేపడుతున్నారు. తొలి దశలో సమస్యలను పరిశీలిస్తారు. వాటిని అధ్యయనం చేస్తారు. గుర్తించిన సమస్యలను ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకుంటే మూడో విడతగా ఆ సమస్యలపై ఉద్యమిస్తారు.

తన తప్పు ఉందని చెబుతూ
2014లో బీజేపీకి, తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారు. తాను మద్దతిచ్చిన ప్రభుత్వాలు పాలనలో విఫలమయ్యాయని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాడు బీజేపీ, టీడీపీలకు మద్దతు ఇచ్చిన కారణంగా ఆ ప్రభుత్వాల వైఫల్యాలలో తన బాధ్యత కూడా ఉందని అంగీకరించడం గమనార్హం.

విద్యార్థి ప్రశ్నతో పవన్ అంతర్మథనం
ఆయన మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ మేరకు స్పందించారు. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో విద్యార్థులతో జరిగిన సమావేశంలో ఓ ప్రశ్న తనను అంతర్మథనంలో పడేసిందని పవన్ పేర్కొంటూ.. ఏపీలో కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదాన్ని ఓ విద్యార్థి ప్రస్తావించాడని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పడవ ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారని, టీడీపీకి మద్దతుగా ఎన్నికల సమయంలో మీరు ప్రచారం చేసినందున మీరు కూడా బాధ్యులు కాదా అని విద్యార్థి తనను ప్రశ్నించాడని పవన్ గుర్తు చేసుకున్నారు.

విద్యార్థి ప్రశ్న, బాధ్యత
అంతేకాదు, ఆలోచిస్తే ఆ విద్యార్థి ప్రశ్నలోను అర్థం ఉందని, ఆయన ప్రశ్న సహేతుకం అని తనకు అనిపించిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. అందువల్ల ఆ పడవ ప్రమాదం, కేంద్రం తీసుకున్న డీసీఐ ప్రయివేటీకరణ కారణంగా ఆ సంస్థ ఉద్యోగి వెంకటేశ్ ఆత్మహత్య ఉదంతంలో నా వంతు బాధ్యత కూడా ఉందని అంగీకరిస్తున్నానని పవన్ పేర్కొన్నారు.

డిఫెన్స్లో పడేసిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ తన ప్రకటన ద్వారా ప్రభుత్వాలకు గట్టి షాకిచ్చారని చెప్పవచ్చు. తాను మద్దతిచ్చిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ఆయన మొదటి నుంచి నిలదీస్తున్నారు. ఆ వైఫల్యాల బాధ్యతను ప్రభుత్వాలదేనని వారికి సూటిగా చెప్పారు. బోటు ప్రమాదమైనా మరేదైనా ఇలాంటి సంఘటనల నుంచి ప్రభుత్వాలు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పుడు వారిదీ తప్పు, మద్దతు ఇచ్చిన తనదీ తప్పు అని పవన్ సూటిగా చెప్పారు. బీజేపీ, టీడీపీలను ఆయన డిఫెన్సులో పడేశారని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications