'గుర్తులేదా, బాబుతో పవన్ కళ్యాణ్ భేటీ మర్మమేమిటి?', మధ్యాహ్నం కమల్హాసన్ భేటీ
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలవడం వెనుక ఉద్దేశ్యం ఏమిటిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గురువారం నాడు ప్రశ్నించింది. ఆ పార్టీ సీనియర్ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి దీనిపై నిలదీశారు.
రైతుల తరపున పోరాటం చేయడానికి వెళ్లారా లేక చంద్రబాబుతో రాజీపడేందుకు వెళ్లారో పవన్ కళ్యాణ్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో రైతుల భూములను బలవంతంగా తీసుకుంటే నిరాహార దీక్ష చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్కు, ఆ విషయం గుర్తుకు లేదా అని ప్రశ్నించారు.
చంద్రబాబుతో కమల్ హాసన్ భేటీ
సినీ నటుడు కమలహాసన్ గురువారం నాడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలవనున్నారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం ఆయన చంద్రబాబును కలుస్తారు. దాదాపు రెండు గంటలపాటు చంద్రబాబుతో కమల్ భేటీ అవుతారని సమాచారం.
ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన ఎందుకు కలుస్తున్నారనే విషయం తెలియరాలేదు. మరోవైపు, ఉదయం కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ టిసుబ్బరామి రెడ్డి కూడా సీఎం చంద్రబాబును కలిశారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా భేటీ అయ్యారు.
వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అవినాష్ రెడ్డి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి గురువారం పులివెందులలో పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. చక్రాయపేట మండలంలో అకాల వర్షాలకు భారీగా పంట నష్టం సంభవించింది. ఈ ప్రాంతంలో ఆయన పరిశీలించారు.