పవన్ పవర్ అంటే ఇదే! 38 గ్రామాలకు తాగు నీరు, డిప్యూటీ సీఎం వస్తున్నారు
క్రానిక్ కిడ్నీ డిసీజ్ వ్యాధితో దశాబ్దాలుగా నరకం చూస్తున్న ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండల ప్రజలకు ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం లభించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించడంతో జల్ జీవన్ మిషన్ - అమరజీవి జలధారల భాగస్వామ్యంతో ఈ మెగా ప్రాజెక్టు కల నిజమైంది. ఉద్ధానం తరహాలోనే కిడ్నీ సమస్యతో నలిగిపోతున్న ఈ ప్రాంతంలో గ్రామీణ నీటి సరఫరా శాఖ చేపట్టిన సమగ్ర రక్షిత తాగునీటి ప్రాజెక్టు 100 శాతం పనులు పూర్తి చేసుకుంది.
గతంలో తాగునీటి సౌకర్యం లేక, కలుషిత జలాలను తాగి అనారోగ్యం పాలవుతున్న గిరిజన తండాలు, మారుమూల గ్రామాల ప్రజలకు ఇప్పుడు స్వచ్ఛమైన కృష్ణా జలాలు ఇంటింటికీ చేరుతున్నాయి. ఎ.కొండూరు పరిధిలోని 21 గ్రామ పంచాయతీలు, 15 గిరిజన తండాలతో కలిపి మొత్తం 38 ఆవాసాల నీటి అవసరాలను తీర్చేందుకు రూ. 49.94 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని రూపొందించారు. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును కేవలం ప్రకటనలకే పరిమితం చేసి, కనీసం టెండర్ల ప్రక్రియను కూడా ప్రారంభించకుండా నిర్వీర్యం చేసింది.

2024 మార్చితో జల్ జీవన్ మిషన్ గడువు ముగియడంతో ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని జల్ జీవన్ మిషన్ గడువును పొడిగించడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను వెంటనే విడుదల చేయించింది. కేవలం 26 నెలల స్వల్ప వ్యవధిలోనే రికార్డు స్థాయిలో పనులను పూర్తి చేసి ప్రజలకు నీటిని అందుబాటులోకి తెచ్చింది.
130 కిలోమీటర్ల నెట్వర్క్తో 75 వేల మందికి లబ్ధి!
ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఇబ్రహింపట్నం ఎన్టీపీసీ కాలువ నుంచి కృష్ణా జలాలను సేకరించి, అక్కడే నీటిని శుద్ధి చేసేలా అత్యాధునిక ప్లాంట్ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఎ.కొండూరు వరకు 130 కిలోమీటర్ల పొడవైన భారీ పైప్లైన్ నెట్వర్క్తో పాటు 12 భారీ ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించారు.
ఈ పైప్లైన్ల నిర్మాణానికి రైల్వే, జాతీయ రహదారులు, అటవీ, పర్యావరణ శాఖల నుంచి అవసరమైన అనుమతులను పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అత్యంత వేగంగా సాధించారు. దీని ద్వారా రోజుకు ప్రతి ఒక్కరికీ 55 లీటర్ల చొప్పున మొత్తం 75,000 మంది జనాభాకు ఉదయం, సాయంత్రం స్వచ్ఛమైన కుళాయి నీరు అందుతోంది.
రూ. 2.5 కోట్ల వృధా ఖర్చులకు స్వస్తి..
గతంలో వేసవి వచ్చిందంటే ఎ.కొండూరు ప్రాంతానికి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఏటా రూ. 2.5 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేయాల్సి వచ్చేది. అయినా సరే ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందేది కాదు. నేడు అమరజీవి జలధారల ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో ట్యాంకర్ల ఖర్చు పూర్తిగా తగ్గిపోవడమే కాక, కిడ్నీ వ్యాధులకు మూలకారణమైన ఫ్లోరైడ్, కలుషిత నీటి వినియోగానికి చెక్ పడింది.
ప్రాజెక్టు పనులు విజయవంతంగా పూర్తికావడంతో, నీటి సరఫరా నాణ్యతను, క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరలోనే ఎ.కొండూరు మండలంలో విస్తృతంగా పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ను సిద్ధం చేయాల్సిందిగా అధికార యంత్రాంగానికి ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.














Click it and Unblock the Notifications