లోకేష్ అన్నయ్యగా చెబుతున్నా, చంద్రబాబును ఏదీ అడగలేదు కానీ, అందుకే మద్దతిచ్చానా: పవన్
ధవళేశ్వరం: తూర్పు గోదావరి జిల్లాలో ఇంతటి ప్రేమ ఉంటుందని తాను కలలో కూడా ఊహించలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ధవళేశ్వరం బ్యారేజీ పైన కవాతు ముగిసిన అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. నా తెలుగుజాతి ఆడపడుచులు, అక్కచెల్లెళ్లు.. మదమెక్కిన మహిషాసుల్లాంటి మానవులను తెగనరికే గొడ్డళ్లు అన్నారు. నా తెలుగు జాతి ఆడపడుచులు, అక్కాచెల్లెళ్లకు మనస్ఫూర్తిగా రెండు చేతులతో నమస్కారం అన్నారు. తల్లి గోదావరిలో తెల్లటి ముత్యాలు నా తెలుగింటి ఆడపడుచులు అన్నారు.
దౌర్జన్యాల్ని చీల్చి చెండాడే కొదమ సింహాలు నా జన సైనికులు అన్నారు, తల్లి భరతమాతకు ముద్దుబిడ్డలు అన్నారు. కవాతులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అన్నారు. కవాతును దేశాన్ని రక్షించే మిలటరీ సైనికులు చేస్తారని, సాధారణ ప్రజలు చేయరని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏ మూలకు వెళ్లినా పవన్ కళ్యాణ్ వస్తున్నాడని జనం బయటకు వస్తున్నారా, జనసేన పెట్టాడని జనం బయటకు వస్తున్నారా.. రాజకీయ ప్రక్షాళన కోసం వచ్చామన్నారు. సైన్యం కవాతు చేస్తుందని, మరి మనం ఎందుకు చేశామంటే, దోపిడీని, అక్రమాలను నిలువరింప చేసేందుకు, వాటిపై ఎదురు తిరిగేందుకు కవాతు చేశామన్నారు.
కవాతులో కారులోనే పవన్ డ్యాన్స్ చేస్తూ ఉత్సాహం: తొక్కిసలాట డౌట్, భారీగా పోలీసులు
అనుభవం కోసం పోటీ చేయలేదు
కాల్చి వేయండి అని అధికార పార్టీ నేతలను ప్రతిపక్ష నేతలు, సంతలో కొన్నట్లు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అధికార పార్టీ కొనే రాజకీయం నడుస్తోందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఈ రాజకీయం మారాలని అన్నారు. 2014లో తాను పోటీ చేయకపోవడానికి కారణాలు ఉన్నాయని చెప్పారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం, అలాగే ఇన్ని కోట్ల మంది ప్రజలను నడపాలంటే తనకు అనుభవం ఉండాలని కోరుకున్నానను కాబట్టి 2009, 2014లో పోటీ చేయలేదన్నారు.
తనకు హెరిటేజ్లా వేలకోట్ల విలువ చేస్తే ఆస్తి లేదు
రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రం కోసం, దేశభక్తితో, ప్రజల కోసం తాను పోటీ చేయకుండా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అని భావించి చంద్రబాబుకు మద్దతు పలికానని పవన్ కళ్యాణ్ చెప్పారు. తనకు హెరిటేజ్లా వేల కోట్ల విలువ చేసే ఫ్యాక్టరీలు లేవని చెప్పారు. కానీ ఆడపడుచుల పైన అభిమానం, ప్రజల పైన ప్రేమ ఉందని చెప్పారు. ప్రజల కోసం పోరాడాలంటే ఎమ్మెల్యే, ఎంపీ కావాల్సిన అవసరం లేదని తాను భావించి మద్దతిచ్చానని చెప్పారు.
నేను చంద్రబాబును ఏదీ ఏడగలేదు
చంద్రబాబుకు మద్దతిచ్చినందుకు తాను ఏమీ కోరలేదని పవన్ చెప్పారు. తాను ఇన్నాళ్లకు అమరావతిలో పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు ఇంటికి వెళ్తే టీ ఇస్తారు, మర్యాద ఇస్తారు కానీ, జనసేన మాత్రం ఎదగవద్దని, మన పార్టీ ఎప్పుడూ ఆయనకు మద్దతుగా ఉండాలని కోరుకుంటారని విమర్శించారు. జనసేన ఎప్పుడూ టీడీపీ పల్లకిని మోయాలా అన్నారు. పవన్, ఆయన అభిమానులు దేశభక్తులు అని 2014లో చంద్రబాబు చెప్పారని, కానీ ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడితే మాత్రం ఇప్పుడు విమర్శలు చేస్తున్నారన్నారు. ఎక్కడకు వెళ్లినా కాలేజీలు ఉండవు, రోడ్లు సరిగా ఉండవని, కానీ చంద్రబాబు విజన్ 2020 అంటారని ఎద్దేవా చేశారు.
నన్ను చంద్రబాబు సంప్రదించలేదు, గతంలోను హెచ్చరించా
ఒకప్పుడు గోదావరి అందాలు, ఇసుక తెన్నెలు కనిపించేవని, ఇప్పుడు ఇసుక దోపిడీ కనిపిస్తోందని పవన్ అన్నారు. అవి జన్మభూమి కమిటీలా లేక గూండా కమిటీలా, దోపిడీ కమిటీలా, వ్యవస్థను నిర్వీర్యం చేసే కమిటీలా అని మండిపడ్డారు. రాజకీయ నేతల దోపిడీని నిలదీయాలన్నారు. తనను ఏ విషయంలోను చంద్రబాబు సంప్రదించలేదని ఆరోపించారు. అవినీతిపై మాట్లాడితే హఠాత్తుగా నేనే మారిపోయానని చెబుతున్నారన్నారు. అవినీతిపై గతంలోను హెచ్చరించానని చెప్పారు.
పంచాయతీలో పోటీ చేయని వ్యక్తి మంత్రియా?
మాట్లాడితే పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ అని విమర్శలు చేస్తారని, కానీ కనీసం పంచాయతీల్లో పోటీ చేయని లోకేష్ను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎలా అయ్యారని ప్రశ్నించారు. నేను యాక్టర్ సరే మరి లోకేష్కు ఏం తెలుసో చెప్పాలన్నారు. పంచాయతీ వ్యవస్థ గురించి తెలియని వ్యక్తి మంత్రియా అన్నారు. వారసత్వం అంటే తండ్రి రూపురేఖలు, ఆస్తులు అన్నారు. కానీ తండ్రి అనుభవం మాత్రం రాదు కదా అన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పారని, కానీ నేతి బీరకాయలో నెయ్యి ఎంతో ఇదీ అంతే అన్నారు.
నీ కొడుకును సీఎం చేసేందుకు నేను జనసేన స్థాపించానా?
చంద్రబాబు ఎప్పటికీ విదేశాలకు వెళ్తారని, కానీ ఎన్ని కంపెనీలు, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మీ కొడుకును ముఖ్యమంత్రిని చేసేందుకు నేను జనసేనను స్థాపించానా అని చంద్రబాబుపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా జన్మభూమి కమిటీలు దోచుకుంటున్నాయన్నారు.మంత్రి నారా లోకేష్ వయస్సులో తనకంటే చిన్న అని, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలపై ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్నారు. ఓ అన్నయ్యగా నేను చెబుతున్నానని అన్నారు. వారసత్వంగా సీఎం పదవి రావాలంటే ఎలా అన్నారు.