ఆ బలహీనత వదల్లేను: పవన్ కళ్యాణ్, జగన్-చంద్రబాబులపై విమర్శలు
హైదరాబాద్: తన బలహీనత క్షమించడమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం అన్నారు. జనసేన వీరమహిళలతో ఆయన హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. తాను ఎక్కువగా క్షమిస్తుంటానని, అవసరానికి మించే క్షమిస్తానని చెప్పారు.
తాను ఎక్కువగా క్షమిస్తుంటానని, అందువల్లే తాను అందరికీ అలుసుగా కనిపిస్తానని వ్యాఖ్యానించారు. అది తనకు తప్పని బలహీనత అన్నారు. తాను వదులుకోలేని బలహీనత క్షమ అన్నారు. ఈ బలహీనతను తాను అధిగమించాలనుకోవడం లేదని, భరిస్తానని చెప్పారు. శిల్పి రాయిలో అనవసర భాగాలను తీసేసి ఒక శిల్పాన్ని చెక్కినట్లే మనలోని చెడును తీసేసి మంచి విధానంతో ముందుకెళ్లాలన్నారు.
ఎందరో అక్కాచెల్లెళ్లు ఆసక్తి
జనసేన మహిళా విభాగంలో భాగం అయ్యేందుకు ఎందరో అక్కాచెల్లెళ్లు ఆసక్తి చూపిస్తున్నారని పవన్ అన్నారు. అరుపులు కేకలు, నినాదాలతో మనం రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇతర పార్టీల వలే రాజకీయాలు మనకు వద్దని, వివేకం, విజ్ఞత, సహనంతో మహిళా సేనను సిద్ధం చేసుకుందామన్నారు. మన సంస్కృతి స్త్రీని శక్తి స్వరూపిణిగా కొలిచేది అన్నారు. అలాంటి మన దేశంలోనే ఆడపడుచులకు కనీస భద్రత లేకుండా పోతోందని వాపోయారు. అర్థరాత్రి ఆడది ఒంటరిగా తిరగగలిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని మహాత్మా గాంధీ అన్నారని, ఇప్పుడు పట్టపగలు కూడా స్త్రీలు ధైర్యంగా వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. మహిళా భద్రత కనీస అవసరమన్నారు. వారి పనిని వారిని స్వేచ్ఛగా చేసుకోనిస్తే చాలన్నారు. మహిళలకు అడ్డు రావొద్దని, సాధికారత కావాలంటే సామాజిక మద్దతు అవసరమని చెప్పారు.
మహిళల వలే మగవారు మల్టి టాస్కింగ్ చేయలేరు
మహిళలు రాజకీయాలు, ప్రజాజీవితం, సేవా రంగంలోకి వచ్చేటప్పుడు సామాజికంగా వారికి వెన్నుదన్ను ఇవ్వాలని పవన్ అన్నారు. మహిళలు ఇలా బయటకు వస్తే నవ్వే వాళ్లు ఉంటారని, నిరుత్సాహపరుస్తారని, కానీ బలమైన సంకల్పం, లక్ష్యసాధనపై ఆత్మవిశ్వాసం ఉండాలన్నారు. మన ఆడపడుచులందరిలోను నిగూఢమైన శక్తి ఉందన్నారు. మన ఇంట్లోని అమ్మను చూసుకుంటే వంటిల్లు చక్కబెట్టడం, పిల్లల బాధ్యత, భర్తకు అండగా, ఆర్థిక విషయాలు.. ఇలా ఎన్నింటినో నిర్వహిస్తోందన్నారు. ఇది ప్రతి మహిళకు తెలిసిన మల్టి టాస్కింగ్ నైపుణ్యమని, మగవారు ఇలా మల్టీ టాస్కింగ్ చేయలేరన్నారు.
జగన్ను నేను అలాగే అంటే ఇంట్లో వాళ్లు బాధపడతారని తెలుసు
తనను ఎవరైనా తిట్టినా, విమర్శించినా పట్టించుకోనని చెప్పారు. జగన్ ఈ మధ్యన తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారని, తాను కూడా అంతే స్థాయిలో అనవచ్చునని, కానీ నాకు వారి ఇంట్లోని ఆడపడుచులు, తల్లి, బిడ్డలు గుర్తుకు వస్తారన్నారు. నేను జగన్ను వ్యక్తిగతంగా అంటే వారి ఇంట్లోవారు ఎంత బాధపడతారో తెలుసునని చెప్పారు.
అమ్మాయి అలా తిట్టినా
ఓ అమ్మాయి తనను తిట్టినా నేను అలాగే ఆలోచించానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆయన శ్రీరెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. మా అమ్మ, అక్కాచెల్లెళ్లు, వదిన... వీరందరి మధ్య పెరిగినవాడినని, తనకు చదువు ఇబ్బందిగా మారి, మనసుకు ఎక్కని పరిస్థితుల్లో వదిన ఇచ్చిన ధైర్యం మరిచిపోలేనిదని పవన్ అన్నారు. జనసేనలోకి అందరం విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్లమేనని, అందరూ సుహృద్భావ వాతావరణంలో కలిసి పని చేద్దామన్నారు. దీర్ఘకాలిక ఫలితాలు, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్లాలని, మన భవిష్యత్ తరాలకు మంచి సమాజం, పటిష్టమైన విధానాలను అందిద్దామన్నారు.
చంద్రబాబుకు పవన్ గట్టి చురకలు
చంద్రబాబుపై కూడా పవన్ విమర్శలు గుప్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడూ సింగపూర్ రాజధానిని నిర్మిస్తానని చెబుతారని, సింగపూర్ తరహా నిర్మాణాలు అంటారని, కానీ సింగపూర్ తరహా పాలన అని మాత్రం చెప్పరని ఎద్దేవా చేశారు. ఎందుకంటే అక్కడి చట్టం ఎవరికైనా ఒకే విధంగా ఉంటుందని, అలాగే అమలు అవుతుందన్నారు. మహిళలకి భద్రత ఇస్తుందని, విధి నిర్వహణలో ఉన్న మహిళా అధికారిపై ఓ ఎమ్మెల్యే దాడి చేస్తే కనీసం పట్టించుకోలేదన్నారు. అదే సింగపూర్ తరహా పాలన అయితే ఆ ఎమ్మెల్యే జైల్లో ఉంటాడని, మహిళలపై దాడులు చేస్తే చూసీచూడనట్లు వదిలేస్తే అలాంటి ఘటనలు పెరుగుతన్నాయన్నారు.