రూటుమార్చిన జనసేనాని: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం, పోరాట యాత్రలకు బ్రేక్!
అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. జిల్లాల్లో ఇటీవలి వరకు ఆయన జనసేన పోరాట యాత్ర పేరిట పర్యటించారు. దానిని ఆపాలని నిర్ణయించారని తెలుస్తోంది. ఇక నుంచి సమస్యలను ఆధారంగా జిల్లాల్లో పర్యటించాలని భావిస్తున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత జిల్లాల్లోని సమస్యలపై పర్యటించనున్నారు.
రూటు మార్చిన పవన్ కళ్యాణ్
సార్వత్రిక ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో పవన్ రూటు మార్చారు. పార్టీ కార్యాలయంలోనే ఉంటూ జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. కాగా, పవన్ కళ్యాణ్ 13వ తేదీన తెనాలికి రానున్నారు. పెదరావురులో జరిగే బోగి పండుగ వేడుకలో పాల్గొంటారు. అలాగే రైతాంగ సమస్యలపై కీలక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. రైతులు, మహిళలు, యువతతో భేటీ కానున్నారు.
ఎన్నికల ఖర్చుకు రూ.2000 కోట్లు కావాలట, జనసేన తొలి విజయం: పవన్, చిరంజీవి సీఎం అవుతారనే
జిల్లాల సమీక్ష
పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా ఆయా జిల్లాల నేతలతో సమీక్ష నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. సమీక్ష సందర్భంగా ఆయా జిల్లాల టీడీపీ, వైసీపీ నేతలపై, ఆయా పార్టీలపై నిప్పులు చెరుగుతున్నారు. టీడీపీ, బీజేపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు తాను ఎవరో తెలియదని చెబుతున్నారని, త్వరలో నేను ఏమిటో వారికి తెలిసేలా చేస్తానని చెబుతున్నారు. రాజకీయాలకు తన మైండ్ సెట్ సరిపోతుందని అన్నారు. ఆదివారం వరకు పవన్ ఎనిమిది జిల్లాల సమీక్ష నిర్వహించారు. ఆదివారం విజయనగరం, అనంతపురం జిల్లాలపై సమీక్షించారు.
జనసేన ప్రభుత్వం ఖాయం
పవన్ కళ్యాణ్ను కలిసేందుకు జనసైనికులు అందరు కూడా సొంత ఖర్చులతో వస్తున్నారని, ఇది చూస్తే ఆశ్చర్యం వేస్తోందని జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ నిన్న చెప్పారు. ఆదివారం అనంతపురం, విజయనగరం జిల్లా కార్యకర్తలతో పవన్ భేటీ జరుగుతుందని, దీంతో ఎనిమిది జిల్లాల సమీక్ష ముగిస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.