వైసీపీకి ఇన్ని సీట్లంటున్నారు కానీ, జగన్ సీఎం కావొద్దు, తొక్కేస్తాం: బీజేపీకి పవన్ కళ్యాణ్ హెచ్చరిక
చిత్తూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం తన చిత్తూరు సభలో టీడీపీ, వైసీపీ, బీజేపీలపై నిప్పులు చెరిగారు. తమది ఇతర పార్టీల్లా మోసం చేసే మేనిఫెస్టో కాదని, అమలుచేసే మేనిఫెస్టో అన్నారు. మతం, కులం పేరుతో రాజకీయాలు చేయడం తనకు నచ్చదని చెప్పారు. దేశభక్తి ఒక్క బీజేపీ సొత్తు కాదన్నారు. తన దేశభక్తి తెలియాలంటే ప్రధాని నరేంద్ర మోడీని అడగాలని సూచించారు. చట్టసభల్లో ఇచ్చిన హామీని నిలుపుకోలేదు కాబట్టే బీజేపీతో విబేధించానని చెప్పారు.
కొత్తవారికి అవకాశమిస్తా
మతగ్రంథాలు పట్టుకొని, మతం పేరుతో వేరు చేసి రాజకీయం చేయడం తనకు నచ్చదని పలు పార్టీలను, ఆ పార్టీల నేతలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబు సీఎం అయితే అమరావతిని, జగన్ సీఎం అయితే కడపను అభివృద్ధి చేస్తామని చెబుతున్నారని, తాను మానవత్వాన్ని నిలబెడతానని చెప్పారు. రాజకీయాల్లోకి కొత్త వారిని తీసుకొచ్చి పాత కోటలు బద్దలు కొడతామన్నారు. అతి సామాన్య యువతీ, యువకులను పరిచయం చేయడం ద్వారా రాజకీయాలకు సరికొత్త భాష్యం చెప్తామన్నారు. పుంగనూరు నుంచి తిరుపతి వరకు కొత్త వారికి అవకాశాలు ఇస్తామన్నారు.
సీట్లు లెక్కబెట్టుకొని రాలేదు, ఏడుకొండలవాడి సాక్షిగా చెబుతున్నా
తాను ఎన్ని సీట్లు వస్తాయని లెక్కపెట్టుకుని రాజకీయాల్లోకి రాలేదని, ఎంత మార్పు తీసుకొస్తామనేది లెక్క పెట్టుకుని వచ్చానని పవన్ కళ్యాణ్ చెప్పారు. వారసత్వ రాజకీయాలు చేయడానికి రాలేదన్నారు. కొత్త రక్తం తీసుకొచ్చేందుకు వచ్చానన్నారు. 2019 ఎన్నికల్లో తాను ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మీ చేతుల్లోనే ఉందని, మీ సేవకుడిగానే ఉంటానని, ఎప్పుడూ మోసం చేయనని చెప్పారు. తనకు ముఖ్యమంత్రి అయ్యేంత బలం ఉందా అనేది ప్రజలే నిర్ణయిస్తారని, ఏడుకొండలవాడి సాక్షిగా ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా రాయలసీమను అభివృద్ధి చేస్తానని చెప్పారు. జనసేన అధికారంలోకి వస్తే ఎర్రచందనం స్మగ్లర్ల కాళ్లు విరగ్గొట్టి సంపదను కాపాడుతామన్నారు.
జగన్ సీఎం కావొద్దు.. పడేసి తొక్కుతాం
జగన్ ముఖ్యమంత్రి కావొద్దని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే ఆయనపై తనకు వ్యక్తిగత ద్వేషం లేదని, కానీ ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడలేని వ్యక్తి సీఎం కాలేడన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలతో పొత్తు లేదని, లెఫ్ట్ పార్టీలతో మాత్రమే కలిసి పోటీ చేస్తామన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి ఒకరు తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, వారు నోరు నియంత్రించుకోవాలని జీవీఎల్ను ఉద్దేశించి పవన్ హెచ్చరించారు. మీరు యుద్ధానికి సిద్ధమైతే నేనూ సై అంటానని, మీకు బానిసను కానని, తమ మీద ఎక్కుతాం అంటే కింద పడేసి తొక్కుతామని హెచ్చరించారు.
ఏపీ మొత్తం నా బలం
ఏ ఒక్క జిల్లా నా బలం కాదని, ఆంధ్రప్రదేశ్ మొత్తం తన బలం అని పవన్ చెప్పారు. అందరూ వైసీపీకి అన్ని సీట్లు వస్తాయని, ఇన్ని వస్తాయని అంటారని, అసలు నేను సీట్లు లెక్క వేసుకొని రాజకీయం చేయడం లేదని, ఎంత మార్పు తీసుకురాగలను అనే ఆలోచనతో రాజకీయం చేస్తున్నానని చెప్పారు. ఒకసారి దారుణంగా దెబ్బతిన్నామని, గొప్ప ఆశయాలతో పార్టీ పెట్టామని, ఇప్పుడు సరికొత్త రాజకీయ వ్యవస్థ నిర్మిద్దామని చెప్పారు. హెరిటేజ్ ఫ్యాక్టరీ బ్రతకడం కోసం చిత్తూరు సహకార సంఘ పాల ఫ్యాక్టరీని చంపేయటం చాలా దారుణమని, ప్రయివేటు సంస్థలు ప్రభుత్వ సంస్థలతో పోటీ పడాలి తప్పించి వాటిని చంపే వ్యాపారం చేయకూడదన్నారు.