చొక్కాపట్టి రోడ్డుపైకి లాగుతా, అదే ఉంటే నీకు మద్దతిచ్చేవాడినా?: బాబుపై పవన్
Recommended Video
విశాఖపట్నం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాకు కులం అంటగడుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం వాపోయారు. నాకు కులపిచ్చి ఉంటే మీకు మద్దతు ఇచ్చేవాడినా అని ముఖ్యమంత్రిని నిలదీశారు. 2014లో తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చినప్పుడు, ఆ పార్టీకి ప్రచారం చేసినప్పుడు నా కులం గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు.
'పవన్ కళ్యాణ్ను అసహ్యించుకుంటున్నారు, మీవల్లే అశాంతి, ఫిర్యాదు చేస్తారా'
విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ నేతలు డాల్ఫిన్ కొండలను మింగేసేలా ఉన్నారని విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేలు పిచ్చివేషాలు వేస్తే చొక్కా పట్టుకొని రోడ్డు పైకి లాగుతానని జనసేనాని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే తాను జనసేనను స్థాపించానని తెలిపారు.
జనసేనకు 10 శాతం ఓట్ల వాటా ఉందని అధికార టీడీపీ పోల్ సర్వేలో వెల్లడి కావడం మంచి ప్రారంభమని పవన్ కళ్యాణ్ అంతకుముందు రోజు ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూడా పది శాతం ఓట్లతోనే మొదలయ్యారన్న విషయం జనసైనికులు గుర్తుంచుకోవాలన్నారు.
ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై ప్రభుత్వం దృష్టి సారించకుంటే తమ పార్టీ చూస్తూ ఊరుకోదని పవన్ బుధవారం హెచ్చరించిన విషయం తెలిసిందే. పెందుర్తి మండలం ముదపాక గ్రామంలో పర్యటించారు. భూ దోపిడీలు, అన్యాయాలు జరగకూడదనే 2014 ఎన్నికల సమయంలో టీడీపీకి ప్రచారం చేశానని, అధికారంలోకి వచ్చాక టీడీపీ మాట తప్పిందన్నారు.
ముదపాకలో రాత్రికి రాత్రి జీడిచెట్లు కూల్చి భూములు లాక్కోవడం సరికాదన్నారు. ఇక్కడి భూముల వ్యవహారంపై సిట్ నివేదిక ఏమైందన్నారు. భూముల దోపిడీలో ఎంతటి వ్యక్తులున్నా వెనుకడుగు వేసేది లేదన్నారు. ఉత్తరాంధ్రపై నిర్లక్ష్యం వహిస్తే ప్రత్యేక ఉద్యమం పుట్టుకొస్తుందని ఇప్పటికే చంద్రబాబుకు చెప్పానని గుర్తు చేశారు.
డబ్బులు కోసం అవినీతికి పాల్పడే అవసరం లేదన్నారు. డబ్బులు కావాలంటే సినిమాలు చేసుకుంటానని తేల్చి చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని వైసీపీ నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాను వారిలా కాదని, అధికారంతో పనిలేకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నానన్నారు.