మీరే ఆధారం: మాట తీసుకున్న పవన్ కళ్యాణ్, 'గోపాలుడి' సందడి
నెల్లూరు: కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడుకు చెందిన స్వర్ణ భారతి ట్రస్ట్లో జరుగుతున్న సంక్రాంతి వేడుకల్లో జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న అక్షర స్కూల్ విద్యార్థులను పలకరించారు.
ఈ సందర్భంగా పవన్ చిన్నారుల నుండి మాట తీసుకున్నారు. పవన్ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు విద్యార్థుల పైననే ఆధారపడి ఉందన్నారు. క్రమశిక్షణతో ఉండి బాగా చదువుకోవాలన్నారు.
భవిష్యత్తులో మెరుగైన, చక్కని భారత దేశాన్ని నిర్మించుకోవాలంటే బాలలు చక్కగా చదువుకోవాలన్నారు. అందరు బాగా చదువుకుంటానని హామీ ఇవ్వాలని చిన్నారులను కోరారు. వారు కూడా పవన్ మాటలకు తలూపారు. పవన్ రాకతో చిన్నారుల్లో ఆనందం వెల్లివిరిసింది.
కాగా, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తన స్వర్ణభారత్ ట్రస్టులో నిర్వహిస్తున్న సంక్రాంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా పవన్ కళ్యాణ్, దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి కామినేని శ్రీనివాస్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు హరిబాబు పాల్గొన్నారు.
వీరితో పాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, పెద్ద ఎత్తున పవన్ అభిమానులు తరలి వచ్చారు. తన ఆహ్వానం మన్నించి వచ్చిన పవన్ కళ్యాణ్, దేవేంద్ర ఫడ్నవీస్లకు వెంకయ్య నాయుడు ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.