బాబుతో పాటు జగన్, వైయస్లను ఏకేసిన పవన్
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తన రాజధాని పర్యటనలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పైన మండిపడ్డారు. అలాగే పరోక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు గుప్పించారు.
రాజధాని పర్యటనలో భాగంగా ఓ ప్రాంతంలో మాట్లాడుతూ.. ప్రజా సంపదను దోచిన వాళ్లు చాలామంది ఉన్నారన్నారు. దాని గురించి తాను తర్వాత మాట్లాడుతానని చెప్పారు. ఈ వ్యాఖ్యలు జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లుగా భావిస్తున్నారు.
రాజకీయ నాయకులకు తమ మనవలు కూడా కూర్చొని తినేంత ఆస్తులు సంపాదించుకుంటారని, పేదల భూములను మాత్రం లాక్కుంటారా అని మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో టీడీపీకి మద్దతిచ్చిన గ్రామమున్నా, వైసీపీకి మద్దతిచ్చిన గ్రామం ఉన్నా తాను రైతుల తరఫున పోరాడుతానని చెప్పారు.
పవన్ దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పైన కూడా మండిపడ్డారు. బేతపూడి గ్రామంలో పవన్ మాట్లాడుతూ.. వైయస్ హయాంలో ఇష్టారాజ్యంగా భూములు అమ్మేశారని విమర్శించారు. రాజధానికి స్వచ్ఛంధంగా భూములు ఇస్తే మంచిదే అన్నారు. భూసేకరణ చట్టం కిందకు తెస్తే మాత్రం జనసేన పోరాడుతుందన్నారు. రైతుల కన్నీటితో రాజధానికి భూమి సేకరిస్తే ఆ శోకం రాజధానికి తగులుతుందన్నారు.
జగన్ పైన సెటైర్
తాను రాజకీయ లబ్ధి కోసం రాలేదన్నారు. ఐదేళ్ల తర్వాత అధికారంలోకి వస్తే భూములు ఇస్తానని తాను చెప్పడం లేదని, కేవలం రైతులకు న్యాయం చేయడానికే వచ్చానని జగన్ వ్యాఖ్యల పైన సెటైర్ వేశారు. వైయస్ హయాంలో వాన్ పిక్ కోసం వేలాది ఎకరాలు లాక్కున్నారన్నారు. అందులో ఒక ఎకరం భూమినిని కూడా వినియోగించలేదన్నారు. ఇలాంటి ఘోరాలు వైయస్ హయాంలో ఎన్నో జరిగాయన్నారు.