ఎర్రచందనం స్మగ్లింగ్ పెద్ద తలకాయలపై పవన్ పంజా!!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఎర్ర చందనం అక్రమ రవాణాపైన ఫోకస్ చేశారు. అత్యంత విలువైన ఎర్ర చందనాన్ని అడ్డగోలుగా నరికి విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న క్రమంలో నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని, అక్రమ రవాణా చేస్తున్నవారిని అరెస్టు చేయడంతోపాటు వాళ్ళ వెనక ఉన్న పెద్ద తలకాయలను అదుపులోకి తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
జగనన్న కాలనీలో ఎర్ర చందనం డంప్.. వివరాలు తెలుసుకున్న పవన్
ఇటీవల వై.ఎస్.ఆర్. కడప జిల్లా పోట్లదుర్తి జగనన్న కాలనీలో ఎర్ర చందనం డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను కడప జిల్లా అటవీ శాఖ అధికారులు నేడు ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదించారు. ఈ క్రమంలో దూదేకుల బాషా, మహ్మద్ రఫీ, అరవోల్ల రఫీ, చెల్లుబోయిన శివ సాయిలను పోలీసులు అరెస్టు చేశారనీ, ఈ కేసుతో మరికొంత మందికి సంబంధం ఉన్నట్లు గుర్తించారని తెలిపారు.

ఎర్ర చందనం స్మగ్లర్ల నెట్వర్క్ కింగ్ పిన్స్ ను పట్టుకోవాలి
జగనన్న కాలనీలో దాచి ఉంచిన డంప్ లో 158 ఎర్ర చందనం దుంగలు దొరికాయనీ, వీటి విలువ రూ.1.6 కోట్లు అని నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈ కేసు వివరాలు తెలుసుకున్న పవన్ శేషాచలం అడవుల్లో భారీగా ఎర్ర చందనం వృక్షాలను నరికేశారు. ఆ దుంగలను ఎక్కడెక్కడ దాచారో తక్షణమే గుర్తించాలన్నారు. ఎర్ర చందనం స్మగ్లర్ల నెట్వర్క్ ను నడిపిస్తున్న కింగ్ పిన్స్ ను పట్టుకోవాలని సూచించారు.
వాళ్ళపై నిఘా పెట్టండి .. కేసులు పకడ్బందీగా పెట్టండి
రవాణా దశలోనో, దాచి ఉంచినచోటనో పట్టుకోవడంతోపాటు, ఎర్ర చందనం చెట్ల నరికివేత కూలీలు, రవాణాదారులను తెర వెనక ఉండి నడిపిస్తున్నవాళ్లను గుర్తించి అరెస్టు చేయాలని ఆదేశించారు . కింగ్ పిన్స్ ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోకుండా కేసులు పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. గతంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టయి బెయిల్ మీద బయట తిరుగుతున్నవారిపై నిఘా ఉంచాలన్నారు. ఈ దిశగా అటవీ, పోలీసు శాఖలు సమన్వయంతో పని చేయాలి అన్నారు.
ఎర్రచందనం కేసుల డేటా తెలుసుకున్న పవన్ కళ్యాణ్
ఎర్ర చందనం అక్రమ రవాణాకు సంబంధించి ఇప్పటి వరకూ నమోదైన కేసుల వివరాలపై చర్చించిన పవన్ కళ్యాణ్ నమోదైన వాటిలో ఎన్ని కేసుల్లో శిక్షలుపడ్డాయో, ఎన్ని కేసులు వీగిపోయాయో వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. కేసులు వీగిపోతే అందుకుగల కారణాలను పేర్కొనాలని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలు, నేపాల్ దేశంలో పట్టుబడ్డ కేసుల్లో అక్కడ ఉండిపోయిన ఎర్ర చందనం దుంగలను తిరిగి తెచ్చుకోవడంపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.
టార్గెట్ వాళ్ళేనా
ఇటీవల పెద్దిరెడ్డి, ఆయన కొడుకు మిథున్రెడ్డి ఎర్ర చందనం అక్రమంగా తరలిస్తూ నేపాల్ పోలీసులకు చిక్కారని పేర్కొన్న పవన్ కళ్యాణ్ తాజా ఆదేశాలు వారిని టార్గెట్ చేసేలా ఉన్నాయి. కోట్లాది రూపాయల సంపదను అప్పటి వైసీపీ ప్రభుత్వంలోని కొందరు నేతలు అక్రమంగా తరలించుకుపోయారని పవన్ వ్యాఖ్యలకు తాజా ఆదేశాలకు అర్ధం టార్గెట్ పెద్ది రెడ్డి, మిధున్ రెడ్డి అని చెప్పుకుంటున్నారు చిత్తూరు జిల్లా వాసులు.












Click it and Unblock the Notifications