మనమే ఎందుకు చేయకూడదు?: బయటపడ్డ పవన్, వామపక్షాలు గప్చుప్?
Recommended Video
హైదరాబాద్: 2019లో ఎన్నికల నాటికి దేశంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీయేతర ప్రత్యామ్నాయ కూటమి కోసం జరుగుతున్న ప్రయత్నాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
సాధ్యా సాధ్యాలను పక్కనపెడితే.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేశారు. కేసీఆర్ ప్రతిపాదనకు,ఆయన ప్రయత్నాలకు మద్దతు పలికిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఇప్పుడు 'థర్డ్ ఫ్రంట్'పై సొంత ఆలోచన మొదలుపెట్టారట.
వామపక్షాలతో కలిసి..:
తనలో కమ్యూనిస్ట్ భావాలు చాలానే ఉన్నాయని చెప్పుకునే పవన్ కల్యాణ్.. ఇటీవలి కాలంలో వామపక్షాలకు బాగానే దగ్గరయ్యారు. టీడీపీతో శత్రుత్వం, బీజేపీతో పోరు, వైసీపీ పట్ల వ్యతిరేకత రీత్యా.. వచ్చే ఎన్నికల్లో ఆయన వామపక్షాలతోనే కలిసి నడవాలని దాదాపుగా నిర్ణయించేసుకున్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ తో అడపాదడపా సీపీఎం, సీపీఐ నేతలు భేటీ అవుతున్నారు.
మనమే ఎందుకు చేయకూడదు..:
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, హోదాపై పోరు గురించి చర్చించేందుకు సోమవారం పవన్ కల్యాణ్తో భేటీ అయ్యారు సీపీఎం మధు, సీపీఐ రామకృష్ణ. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ తన మనసులోని మాటను బయటపెట్టారని తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా 'థర్డ్ ఫ్రంట్' ఏర్పాటును మనమే ఎందుకు ప్రారంభించకూడదని పవన్ అభిప్రాయపడినట్టు సమాచారం.
ఆ బాధ్యత మీకే ఇస్తా..:
దేశంలో కాంగ్రెస్, బీజేపీలు ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకున్నాయని, ప్రజలంతా ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ఎదురుచూస్తున్నారని పవన్ వామపక్షాల నేతలతో చెప్పారు. మూడో కూటమి ఏర్పాటు గురించి ప్రస్తావిస్తూ.. ఆ దిశగా అడుగులు పడితే.. భావ సారూప్యమున్న పార్టీలను ఏకం చేసే బాధ్యతలను కూడా మీకే ఇస్తానని సీపీఎం, సీపీఐ నేతలతో ఆయన పేర్కొన్నట్టు తెలుస్తోంది.
వామపక్షాలు గప్చుప్?..:
ప్రస్తుతం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలిసి నడుస్తున్న వామపక్షాల నేతలు.. పవన్ ప్రతిపాదనకు ఎటువంటి బదులు ఇవ్వలేదని తెలుస్తోంది.
బహుశా.. కాంగ్రెస్ లేకుండా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యమేనా? అన్న ప్రశ్న వారికి కలగవచ్చు. 2019లొ పొత్తుల రాజకీయమా?, స్వతంత్రంగా వెళ్లడమా? అన్నదానిపై ఇంకా క్లారిటీ లేనందునా.. దీనిపై రాష్ట్రానికి చెందిన వామపక్షాల నేతలు పెద్దగా స్పందించే అవకాశం కూడా కనిపించడం లేదు.