వర్మకు షాకివ్వబోతున్న పవన్ ? జనసేనలోకి ఆ మాజీ ఎమ్మెల్యే..!
ఏపీలో నిన్న మొన్నటివరకూ అంతగా చర్చల్లో ఉండని పిఠాపురం పేరు చెబితే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా గుర్తుపట్టే పరిస్ధితి. దీనికి ఓ కారణం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడం కాగా.. మరో కారణం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్ ఆశించిన వర్మను కాదని చంద్రబాబు ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించారు. దీంతో పాటు వర్మకు కూటమి ప్రభుత్వంలో తొలి ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. కానీ కూటమి గెలిచాక సీన్ రివర్స్ అయింది.
వర్మకు దక్కుతుందని భావించిన ఎమ్మెల్సీ సీటు దక్కకపోగా.. టీడీపీతో జనసేన గ్యాప్ పెరుగుతూ పోయింది. ఇప్పుడు పిఠాపురంలో వర్మను పట్టించుకునే జనసేన నేతలే కరువయ్యారు. దీంతో వర్మలో కూడా అసంతృప్తి పెరిగిపోతోంది. పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేయడంతో పాటు దగ్గరుండి గెలిపించిన తనను అటు జనసేన కానీ, ఇటు టీడీపీ కానీ పట్టించుకోకపోవడంతో వర్మ అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీంతో ఈసారి ఎమ్మెల్సీ కోటాలో ఆయనకు కచ్చితంగా సీటు దక్కుతుందని అంతా భావించారు. కానీ అక్కడే పవన్ ఓ ఎత్తు వేశారు.

ఇప్పటికే పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యేగా కాస్తో కూస్తో పట్టున్న వర్మకు ఎమ్మెల్సీ ఇస్తే నియోజకవర్గంలో మరో పవర్ సెంటర్ ఏర్పాటు అవుతుందని భావించి దూరంగా ఉంచుతున్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు మరోసారి ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చేలోపే అదే నియోజకవర్గానికి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబును రంగంలోకి దింపారు. ఆయనతో తాజాగా భేటీ అయిన పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీలోకి ఆహ్వనం పలికారు. దీంతో దొరబాబు త్వరలో జనసేన తీర్దం పుచ్చుకోవడం ఖాయమైంది.
ఇలా దొరబాబు ఎంట్రీతో పాటు ఆయనకు వీలైతే ఎమ్మెల్సీ పదవి కూడా ఇప్పించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని అంటున్నారు. అదే జరిగితే ఇక పిఠాపురంలో వర్మకు తలుపులు మూసుకుపోయినట్లే భావించాల్సి ఉంటుంది. దీంతో ఇప్పుడు వర్మ పరిస్ధితి ఏంటన్న దానిపై పిఠాపురంలో చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో పవన్ కళ్యాణ్ చాకచక్యం, ముందుచూపుపైనా జనం చర్చించుకుంటున్నారట.












Click it and Unblock the Notifications