ఢిల్లీలో పవన్ కల్యాణ్- షా, నడ్డాతో భేటీ : టీడీపీతో పొత్తుపై ఎఫెక్ట్..!?
ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ - జనసేన మధ్య పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ కొత్త పరిణామం చోటు చేసుకుంది. జనసేన అధినేత ఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా..బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. బీజేపీ తో ఇక జనసేన సంబంధాలు దాదాపుగా కటీఫ్ చెప్పే పరిస్థితి వచ్చిందని భావిస్తున్న వేళ ఈ పర్యటన..భేటీ కొత్త టర్న్ కు కారణమవుతున్నాయి. జనసేనతోనే తమ పొత్తు ఉంటుందని బీజేపీ చెబుతున్న వేళ..ఈ భేటీ టీడీపీ - జనసేన పొత్తు పై ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తోంది.
ఢిల్లీలో జనసేనాని పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు. పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తో పాటుగా ఆయన ఈ రోజు బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఏపీలో రాజకీయ అంశాలతో పాటుగా వైసీపీ ప్రభుత్వం పైన ఫిర్యాదు చేసేందుకు పవన్ ఢిల్లీ చేరుకున్నారని పార్టీ నేతల సమాచారం. అయితే, ప్రస్తుతం బీజేపీ - జనసేన మధ్య పొత్తు కొనసాగుతోంది.
ఈ పొత్తు ద్వారా తాను ఎదుర్కొంటున్న సమస్యలను జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. అటు టీడీపీతో పవన్ పొత్తు ఖాయమని రాజకీయంగా ప్రచారం సాగుతోంది. రెండు పార్టీల నేతలు అదే అంచనాతో ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీలో మరోసారి బీజేపీ ముఖ్య నేతలతో పవన్ భేటీ కానుండటంతో..ఈ సమావేశం రాజకీయంగా కొత్త చర్చలకు కారణమవుతోంది.

అమిత్ షా - నడ్డాతో భేటీకి ఛాన్స్
పవన్ కల్యాణ్ ఈ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పాటుగా జేపీ నడ్డాతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. తమతో పొత్తులో ఉంటూ ..టీడీపీకి పవన్ దగ్గర అవటం పైన ఇప్పటి వరకు బీజేపీ సీనియర్లు స్పందించ లేదు. పవన్ తమ నుంచి దూరం కాకుండా ఈ ఇద్దరు అగ్ర నేతలు ఈ భేటీ సమయంలో ప్రయత్నాలు చేస్తారా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.
ఇదే సమయంలో 2014 ఎన్నికల తరహాలోనే వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలనేది చంద్రబాబుతో పాటుగా పవన్ కల్యాణ్ లెక్కలు వేస్తున్నారు. బీజేపీ నేతలు మాత్రం తమకు జనసేనతో మినహా ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని తేల్చి చెప్పారు. ఇప్పుడు పవన్ బీజేపీ అగ్ర నేతల వద్ద మూడు పార్టీల కలయిక పైన ప్రతిపాదన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ చెప్పినా.. బీజేపీ ముఖ్య నేతలు అందుకు అంగీకరిస్తారా అనేది సందేహంగానే కనిపిస్తోంది.
పవన్ ను టీడీపీతో వెళ్లకుండా నిలువరిస్తారా
టీడీపీతో కలిసేందుకు బీజేపీ సిద్దంగా లేదు. బీజేపీ ఏపీ నేతలు జనసేనతోనే తమ పొత్తు కొనసాగుతుందని చెబుతున్నారు. తెలంగాణలోనూ బీజేపీ నేతలు తమకు ఎవరితోనూ పొత్తు ఉండదని చెబుతున్నారు. అటు కర్ణాటక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమయంలో పవన్ ను బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం ఆసక్తిని పెంచుతోంది. గతంలో విశాఖలో ప్రధాని మోదీతో పవన్ భేటీ అయిన సమయంలో ఇక టీడీపీతో జనసేన పొత్తు ఉండదనే ప్రచారం సాగింది.
కానీ, ఆ తరువాత పరిణామాలు మారిపోయాయి. పవన్ - చంద్రబాబు మధ్య రెండు సార్లు భేటీ జరిగింది. దీంతో..ఈ ఇద్దరి పార్టీల మధ్య పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు బీజేపీ ముఖ్య నేతలు పవన్ టీడీపీ వైపు వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేస్తారనే అభిప్రాయం వనిపిస్తోంది. దీంతో.. ఢిల్లీ పర్యటనలో పవన్ బీజేపీ అగ్ర నేతలతో భేటీ ఎలాంటి నిర్ణయాలకు కారణం అవుతుందనేది ఆసక్తిగా మారుతోంది.












Click it and Unblock the Notifications