నేడు విజయవాడకు పవన్ కళ్యాణ్ .. వరుస మీటింగ్స్ తో బిజీ బిజీ.. మళ్ళీ సర్కార్ పై సమరభేరి !!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ పార్టీ కార్యకలాపాలలో బిజీ కానున్నారు. కోవిడ్ బారిన పడిన తర్వాత పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న జనసేనాని పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపడానికి, ప్రజల సమస్యల కోసం పోరాటం చేయడానికి రంగంలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు సాయంత్రం విజయవాడకు రానున్నారు. దీంతో జనసేన పార్టీ శ్రేణుల్లో పవన్ కళ్యాణ్ రాక కొత్త ఉత్సాహాన్నిస్తుంది.
రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ అవ్వనున్న జనసేనాని పవన్ కళ్యాణ్ .. ప్రజా క్షేత్రంలో పర్యటనలకు ప్లాన్
నేడు సాయంత్రం విజయవాడకు పవన్ కళ్యాణ్
రేపటి నుండి వరుస సమావేశాలలో పాల్గొననున్న జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై దృష్టి సారించనున్నారు. అదేవిధంగా పార్టీకి దిశానిర్దేశం చేయడానికి రేపు మంగళగిరి పార్టీ కార్యాలయంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ తో ఆయన సమావేశం కానున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో నిరుద్యోగ యువత తో కూడా ఆయన భేటీ కానున్నారు. వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకోనున్నారు. ఆ తర్వాత భవన నిర్మాణ కార్మికులతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
నిరుద్యోగ యువత సమస్యపై ప్రధానంగా ఫోకస్ చెయ్యనున్న పవన్ కళ్యాణ్
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభణ తరువాత, కరోనా బారిన పడి చికిత్స తీసుకున్న పవన్ ఇంత కాలానికి రాష్ట్రానికి వస్తున్న నేపధ్యంలో ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి పనిచేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో జాబ్ లెస్ క్యాలెండర్ ప్రకటించిందని ఇప్పటికే జనసేన పార్టీ ప్రకటించింది. ప్రభుత్వం యువతను మోసం చేస్తుందని, ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని తాము ప్రశ్నించి తీరుతామని ప్రకటించింది. అంతేకాదు గడచిన ఏడాది కాలంలో ప్రభుత్వ వైఫల్యాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు ఒక రోడ్ మ్యాప్ మ్యాప్ ఇస్తారని తెలుస్తుంది.
కరోనా సెకండ్ వేవ్ తో పార్టీ కార్యక్రమాలకు దూరం
కరోనా తీవ్రత ఉన్న సమయంలో కార్యక్రమాలు నిర్వహిస్తే కరోనా వ్యాప్తి ఎక్కువ జరుగుతుందనే ఉద్దేశంతో పార్టీ కార్యక్రమాలను ఎక్కువగా నిర్వహించలేదని తెలిపిన జనసేన పార్టీ కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ సరఫరా, బాధితులకు సేవలు చేయడం వంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టి కార్యకర్తలు ముందుకు సాగారని వెల్లడించింది. ప్రజలకు కష్ట కాలంలో జనసేన కార్యకర్తలు అండగా నిలిచారని పేర్కొంది. ఇక రాష్ట్రంలో నేడు ముఖ్య నాయకులతో భేటీ అవనున్న పవన్ కళ్యాణ్ బుధవారం పీఏసీ సమావేశంలో పాల్గొననున్నారు.
Recommended Video
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం
ప్రభుత్వ చర్యల వల్ల సమాజంలో తలెత్తుతున్న ఇబ్బందికరమైన పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని సమాచారం. గత మూడు నెలల్లో జనసేన పార్టీకి, ప్రభుత్వ విధానాల పట్ల వ్యతిరేకతతో ప్రజల నుండి అనేక అర్జీలు వచ్చాయి అని వాటన్నిటిని పవన్ కళ్యాణ్ పరిశీలిస్తారని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పై పోరాటం చేస్తామని పార్టీ వెల్లడించింది. మొత్తానికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడానికి జనసేనాని రంగంలోకి దిగనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో జోష్ స్పష్టంగా కనిపిస్తుంది.