నిజమా? పవన్ ట్విట్టర్ 'ట్విస్ట్': అందుకే 'అమిత్ షా'పై స్పందించలేదు!?
అయితే ఆ ఎకౌంట్కు సంబంధించిన పాస్ వర్డ్, మెయిల్, మొబైల్ నంబర్ వంటి కీలక విషయాలన్ని సదరు ఉద్యోగి వద్దే ఉండిపోయాయయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్: ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగినప్పటి నుంచి నోటి మాట కంటే ట్విట్టర్ కూత పైనే పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఆధారపడ్డారు. ఏ సమస్యపై స్పందించాలనుకున్నా.. ఎవరిని నిలదీయాలనుకున్నా.. ట్విట్టర్ నుంచే ఉతికారేస్తున్నారు. ఇటీవలి కాలంలో బీజేపీని టార్గెట్ చేస్తున్నట్లుగా ఆయన వైఖరి వెల్లడవుతున్న తరుణంలో.. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో అమిత్ షా పర్యటనపై జనసేనాని అభిప్రాయమేంటో? తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు.
కానీ ఈ మధ్య ఆయన ట్విట్టర్ మొరాయించడంతో.. పవన్ ట్వీట్స్కు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. పవన్ ట్విట్టర్ హ్యాకింగ్కు గురైనట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ట్విట్టర్లో అప్ డేట్స్ కరువైనట్లుగా చెబుతున్నారు. పవన్ ట్విట్టర్ హ్యాక్ అవడంతో.. ఆ ఎకౌంట్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్న ఉద్యోగిని ఇటీవల తొలగించారట.

అయితే ఆ ఎకౌంట్కు సంబంధించిన పాస్ వర్డ్, మెయిల్, మొబైల్ నంబర్ వంటి కీలక విషయాలన్ని సదరు ఉద్యోగి వద్దే ఉండిపోయాయయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ ఎకౌంట్ లోకి లాగిన్ అవడానికి పవన్ కు అవకాశం లేకుండా పోయిందంటున్నారు. ప్రస్తుతం ఆ మాజీ ఉద్యోగి ఎక్కడున్నాడో వెతకడానికి ప్రయత్నిస్తున్నా.. అతను మాత్రం అందుబాటులోకి రావడం లేదట. దీంతో ఆయన ఖాతా తాత్కాళికంగా నిలిచిపోయింది.
ఇలాంటి తరుణంలో.. ట్విట్టర్ లో కొత్త ఖాతా తెరవడమా? లేక పాత దాన్నే తిరిగి ఎలా కొనసాగించాలి? అన్న అంశాలపై తర్జనభర్జన పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ట్విట్టర్ లో పవన్ ఖాతాకు 18లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. కొత్త ఖాతా క్రియేట్ చేస్తే.. మళ్లీ ఇంత ఫాలోయింగ్ ఏర్పడటానికి సమయం పడుతుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న ట్విట్టర్ ఖాతానే ఎలాగైనా తిరిగి అప్ డేట్ చేయాలనే ప్రయత్నాల్లో జనసేన అధ్యక్షుడు ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications