నేనేం చేయాలి?: జెపితో పవన్ కల్యాణ్ మంతనాలు
హైదరాబాద్: లోకసత్తాను రాజకీయాల నుంచి జయప్రకాష్ నారాయణ ఉపసంహరించడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, తన రాజకీయాలపై కూడా డైలమాలో పడినట్లు తెలుస్తోంది. జెపి రాజకీయాల నుంచి తప్పుకోవడం సరి కాదని పవన్ కల్యాణ్ అన్నట్లు చెబుతున్నారు.
స్వయంగా ఆ విషయాన్ని పవన్ కల్యాణ్ జెపితో చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. "మీ నిర్ణయం నన్ను బాధపెట్టింది" అని పవన్ కల్యాణ్ ఆయనతో అన్నారట. "మీరే అలా చేస్తే నేనేం చేయాలి" అని పపన్ జెపిని ఆరా తీసినట్లు చెబుతున్నారు. తాను రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో రావాలని భావిస్తున్న సమయంలో జెపి నిర్ణయం ఆయనను సందేహంలో పడేసినట్లు చెబుతున్నారు.
పవన్ సినిమాలతో, తాను రాజకీయాలతో విసిగిపోయానని జెపి ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో అన్నారు. లోకసత్తా ద్వారా చాలా మార్పులు తెచ్చామని, వాటిని ప్రజలు గుర్తించే పరిస్థితిలో లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల నుంచి తప్పుకున్నంత మాత్రాన ముందుకు సాగబోమని ఏమీ లేదని, మరో రూపంలో ఉద్యమం చేస్తామని ఆయన అన్నారు.

మరో మూడు నాలుగు సినిమాలు చేసి సినీ రంగం నుంచి తప్పుకుని రాజకీయాలకు పూర్తి సమయం కేటాయించాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. ఈ స్థితిలో జెపి రాజకీయాల నుంచి తప్పుకోవడం ఆయనను ఆలోచనలో పడేసిందని అంటున్నారు. కులమతాలకు అతీతంగా ఆదర్శంగా రాజకీయాలను నడిపే వారు తప్పుకుంటే ఎలా అనేది ఆయన మథనమని అంటున్నారు.
పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి, టిడిపి కూటమికి మద్దతు ఇచ్చారు. పవన్ కల్యాణ్ మద్దతు కారణంగానే ఆ కూటమి గెలిచిందనే బలమైన అభిప్రాయం ఉంది. ఈ స్థితిలో 2019 ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో ఎన్నికల్లోకి దిగడానికి ఆయన జనసేనను సమాయత్తం చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications