Varahi Yatra : పవన్ వారాహి యాత్ర అక్కడి నుంచే ? రఘురామ హింట్ !
ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలుపెట్టేందుకు రంగం సిద్దమవుతోంది. ఇప్పటికే పూజలు పూర్తిచేసుకున్న వారాహి వాహనంతో త్వరలో ఈ యాత్రను ప్రారంభించబోతున్నారు.
ఏపీలో వచ్చే ఎన్నికల ప్రచారం కోసం జనసేన అధినేత ఇష్టపడి తయారు చేయించుకున్న వారాహి వాహనం యాత్ర త్వరలో ప్రారంభం కాబోతోంది. ఇందుకోసం సర్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే తెలంగాణలోని ధర్మపురి, ఏపీలోని విజయవాడ కనకదుర్గమ్మ సహా పలు ఆలయాల్లో వారాహికి పూజలు పూర్తి చేసిన పవన్ కళ్యాణ్.. త్వరలో లాంఛనంగా యాత్రను ఆరంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కీలక అంశాలపై సంకేతాలు అందుతున్నాయి.
పవన్ వారాహి యాత్ర
పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను త్వరలో ప్రారంభించబోతున్నారు. అయితే ఇది ఎక్కడి నుంచి ప్రారంభం కాబోతోంది, ఇందులో ఎవరెవరు పాల్గొంటారు, యాత్ర రూట్ మ్యాప్ ఏంటి, దీనికి ఏపీ ప్రభుత్వం అనుమతిస్తుందా లేక నారా లోకేష్ తరహాలోనే అడ్డంకులు సృష్టిస్తుందా, ప్రభుత్వం కాదంటే పవన్ ఏం చేయబోతున్నారు.. ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరకబోతోంది. ఆలోపే దీనికి సంబంధించి పలు కీలక సంకేతాలు వెలువడుతున్నాయి. పవన్ కు చేరువవుతున్న పలువురు నేతలు ఈ సంకేతాలు ఇచ్చేస్తున్నారు.
ఉత్తరాంధ్ర నుంచి పవన్ వారాహి యాత్ర ?
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జనసేనాని పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రను తనకు ఎంతో అచ్చొచ్చిన ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో పలుదఫాలు పర్యటించిన పవన్, అక్కడ స్ధానికంగా గ్రౌండ్ సిద్ధం చేసేందుకు తన తర్వాత పార్టీలో నంబర్ టూగా కనిపిస్తున్న నాదెండ్ల మనోహర్ ను కూడా పంపారు. ఆయన కూడా సుదీర్ఘంగా ఉత్తరాంధ్రలోని జిల్లాల్లో పర్యటించారు. అక్కడి స్ధానికులతో మమేకం అయ్యారు. అలాగే పవన్ యువశక్తి సభను కూడా శ్రీకాకుళంలోనే తాజాగా నిర్వహించారు. ఇదంతా పవన్ యాత్రకు సన్నాహకంగానే చేస్తున్నట్లు తెలుస్తోంది.
లోకేష్ యాత్రకు ఎదురుగా పవన్ యాత్ర ?
టీడీపీ-జనసేన మధ్య అధికారికంగా పొత్తు కుదరకపోయినా చంద్రబాబు-పవన్ మధ్య భేటీలతో ఇరుపార్టీల క్యాడర్ దగ్గరైంది. అలాగే టీడీపీ యువనేత నారాలోకేష్ యువగళం పేరుతో చిత్తూరు జిల్లా కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఇది శ్రీకాకుళంలోని ఇచ్చాపురంలో పూర్తవుతుంది. దీంతో ఈ యాత్రకు ఎదురుగా వచ్చేలా శ్రీకాకుళం నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తద్వారా రాష్ట్రానికి రెండు మూలల నుంచి ఇరువురు యువనేతల యాత్రలు ప్రారంభించినట్లవుతుంది. అలాగే రాష్ట్రానికి మధ్యలో వీరిద్దరూ కలిసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
రఘురామ హింట్ ?
నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభమైన నేపథ్యంలో నిన్న ఈ యాత్రతో పాటు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రపైనా వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు స్పందించారు. ఈ రెండు యాత్రల ఉద్దేశం ఒకటేనన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు లోకేష్, పవన్ ఈ రెండు యాత్రలు చేపడుతున్నారన్నారు. అలాగే దక్షిణ ఆంధ్ర నుంచి లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం కాగా, పవన్ కళ్యాణ్ వారాహి బస్సు యాత్ర ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభిస్తే బాగుంటుందన్నారు. త్వరలోనే వారాహి బస్సు యాత్ర ప్రారంభ తేదీని, వేదికను పవన్ కళ్యాణ్ ప్రకటిస్తామని చెప్పారన్నారు. తద్వారా ఉత్తరాంధ్ర నుంచి పవన్ యాత్ర ప్రారంభం కావడం ఖాయమన్న సంకేతాన్ని రఘురామ ఇచ్చినట్లయింది.