తల్లికి వందనం డబ్బుల జమకు ముహుర్తం ఫిక్స్..! ఇవన్నీ తప్పనిసరి..!
ఏపీలో పాఠశాలలకు విద్యార్ధులకు పంపే తల్లుల కోసం గత వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనంగా (Talliki Vandanam) మార్చిన తర్వాత కూటమి సర్కార్ తొలి ఏడాది వదిలేసినా రెండో ఏడాది నుంచి డబ్బులు ఖాతాల్లో జమ చేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా తల్లికి వందనం పథకం కింద డబ్బులు జమ చేసేందుకు సిద్దమైంది. ఈ మేరకు ఇప్పటికే వివరాలు సేకరించిన అధికారులు వాటిని క్షేత్రస్దాయిలో తనిఖీ చేయిస్తున్నారు. ఇది పూర్తి కాగానే డబ్బులు జమ చేస్తారు.
రాష్ట్రంలో ఈ ఏడాది 78 లక్షల విద్యార్ధులకు తల్లికి వందనం పథకం అమలుకు వీలుగా ప్రభుత్వం వద్దకు సమాచారం చేరింది. వివిధ స్కూళ్లు, కాలేజీల నుంచి విద్యార్ధుల వివరాలు విద్యాశాఖకు చేరాయి. దీంతో వీటిని సచివాలయాల వద్దకు పంపి క్షేత్రస్ధాయిలో తనిఖీలు చేయిస్తున్నారు. ఈ ప్రక్రియ మరో రెండు, మూడు వారాల పాటు కొనసాగనుంది. ఆ తర్వాత తుది అర్హుల జాబితా ఖరారు చేస్తారు. అనంతరం జూన్ 12న తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం మొత్తాలు జమ అవుతాయి.

అయితే తల్లికి వందనం మొత్తాలు సక్రమంగా ఖాతాల్లో పడాలంటే మాత్రం కొన్ని అంశాలు తప్పనిసరిగా ఉండాలి. వీటిలో తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి. అలాగే కుటుంబానికి భూమి మాగాణి అయితే 3 ఎకరాలకు లోపు, మెట్ట అయితే 10 ఎకరాల లోపు ఉండాలి. కారు ఉండకూడదు. కరెంటు బిల్లు నెలకు 300 యూనిట్లు దాటకూడదు. ఇల్లు వెయ్యి చదరపు అడుగల కంటే తక్కువ విస్తీర్ణంలో ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగి కాకూడదు. ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేసిన వారికీ వర్తించదు. తల్లికి వందనం పథకం కింద ఈ ఏడాది కూడా రూ.13 వేలు మాత్రమే తల్లుల ఖాతాల్లో జమ అవుతాయి.












Click it and Unblock the Notifications