మీరు చెప్తే ఇస్తాం, టిడిపి మిమ్మల్నే ప్రశ్నించింది కానీ: పవన్ కళ్యాణ్తో రైతులు
పెనుమాక: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పెనుమాక గ్రామంలో ఆదివారం రైతులను కలిశారు. రాజధానికి భూమి ఇచ్చేందుకు ఎందుకు విముఖత చూపుతున్నారో రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మీరే ఆదుకోవాలని పవన్ కళ్యాణ్కు విజ్ఞప్తి చేశారు.
ఓ బేతపూడి గ్రామస్థుడు మాట్లాడుతూ...
ల్యాండ్ పూలింగ్ బిల్లులో రైతుకు పనికి వచ్చేది ఒక్కటీ లేదు. కావాలంటే అగ్రిమెంట్ ఫాం చూడవచ్చు. అగ్రిమెంట్ ఫాం మీరు చూసి చెప్పండి.. మేం ఇస్తాం. మిగతా రైతులు భూసేకరణతో భయపడి ఇచ్చారు.
29 గ్రామాల్లో ఇచ్చారని చెబుతున్నారు. అక్కడ ఓపెన్ బ్యాలెట్ పెట్టి స్వచ్చంధంగా ఇచ్చారని ఎవరైనా చెబితే మేం కూడా ఇచ్చేందుకు సిద్ధం.
మరో బేతపూడి వాసి మాట్లాడుతూ... బేతపూడి గ్రామంలో జనసేన జెండా పట్టుకొని తొలుత వచ్చింది నేనే. మా భూమి ల్యాండ్ పూలింగ్కు ఇస్తే.. తర్వాత ఎవర్ని అడగాలన్నారు. మూడేళ్ల తర్వాత ఈ ప్రభుత్వం ఉంటుందా, ఈ కలెక్టర్ ఉంటారా.
ఉండవల్లి వాసి మాట్లాడుతూ..
ఎవరో సింగపూర్ కోసం మా భూములు తీసుకోవడం ఏమిటి. అప్పుడే తనకు నాలుగైదు కోట్ల రూపాయలు ఇస్తామని చెబుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వానికి ఎలా ఇవ్వాలి.
నారాయణ పైన రైతు ఆగ్రహం
ఓ వార్డు మెంబర్గా గెలవలేని నారాయణ అంటూ ఓ రైతు మండిపడ్డారు. ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలన్నా, పచ్చగా ఉండాలన్నా ఇప్పుడు ఏకైక మార్గం మీరేనని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పక్షాన నిలబడింది పవన్ కళ్యాణ్ ఒక్కరే అన్నారు. 29 గ్రామాల రైతులను బెదిరించి భూములు తీసుకున్నారన్నారు.
తుళ్లూరు రైతులు మాత్రం సంతోషంగా ఇచ్చారన్నారు. వారికి ఎన్నో రెట్లు పెరిగింది కాబట్టి ఇచ్చారన్నారు. ఎప్పుడో మా భూములకు ఇంత ధర ఉందని, ఇప్పుడు అదే ధరకు ఎలా ఇస్తామన్నారు. మీ కోసం మేం ప్రాణాలైనా ఇస్తామని పవన్ కళ్యాణ్కు చెప్పారు.
పెనుమాక, ఉండవల్లిలో భూమి ఉన్న ఓ రైతు మాట్లాడుతూ... తమ భూములు చాలా విలువైనవన్నారు. ఎవరో చెబితే తమ భూమిని ల్యాండ్ పూలింగ్ కింద తీసుకుంటున్నారన్నారు. తాము మొదటి నుంచి ఉద్యమం చేస్తున్నామన్నారు.
98 శాతం అయిపోయింది, రెండు శాతం కోసం ఎందుకు రగడ అంటున్నారని, మరి.. వారికి ధరలు పెరిగాయని కాబట్టి వారు ఇచ్చారని, మేం ఎందుకివ్వాలన్నారు. అటు వైపు పొలాలు ఇచ్చిన వారికి పాదాభివనందనం అని, కానీ మేం మాత్రం ఇవ్వమన్నారు.
మేం భూములు ఇవ్వలేమని కోర్టులో దరఖాస్తు చేసుకున్నామని, కోర్టు చెప్పినప్పటికీ ప్రభుత్వం వినడం లేదని, భూసేకరణ చేస్తామంటూ తమను బెదిరిస్తూ నిద్రలేకుండా చేస్తున్నారన్నారు. వేరే భూమి ఉన్నప్పటికీ మా భూమి పైనే ఎందుకు ఇంత రాద్దాంతం అన్నారు. ప్రాణాలు పోయినా తాము భూమిని ఇవ్వమని చెప్పారు. మా తరఫున మీరు పోరాటం చేస్తారని మేం నమ్ముతున్నామని చెప్పారు.
మరో రైతు మాట్లాడుతూ... రాజధానికి 8వేల ఎకరాలు చాలని చెప్పారని, ఇప్పుడు 32వేల ఎకరాలు వచ్చాక ఇంకా ఎందుకు మాకు నిద్రలేకుండా చేస్తున్నారన్నారు. మా భూములు తీసుకోవద్దని కోరారు. రైతు, సీఆర్డీయే మధ్య కుదిరిన అగ్రిమెంటును పవన్ కళ్యాణ్ పరిశీలించాలన్నారు.
ఉండవల్లి రైతు మాట్లాడుతూ... మీరు మాకు మద్దతుగా వస్తానని చెప్పినప్పుడు టిడిపి నేతలు, మంత్రులు అడుగుతూ... చుట్టూ రాజధాని కట్టి, మధ్యలో ఉన్న ఈ గ్రామాలను తీసుకోకుంటే ఎలా అని మిమ్మల్ని వారు ప్రశ్నించారని, కానీ మా చుట్టూ రాజధాని కడితే మేం తప్పకుండా ఇస్తామని, కానీ రాజధాని ఎక్కడో ఉందని, మా చుట్టూ లేదన్నారు.
మరో మహిళా రైతు మాట్లాడుతూ... మాకు రూ.50వేలు ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని, కానీ ఏడాదికి నా పిల్లల ఫీజులే రూ.లక్ష కడుతున్నామన్నారు. మాకు ఇచ్చే ఆ పరిహారం ఎందుకు పనికి వస్తుందన్నారు. మా ఎకరం పొలం అమ్ముకొని మేం ఎలా బతుకుతామన్నారు.
మరో రైతు మాట్లాడుతూ... 29 గ్రామాల్లో 17 గ్రామాల వారు మాత్రమే భూసమీకరణకు సమీకరించాయని, ఆ తర్వాత కొందరు రెచ్చగొట్టి తమ భూమిని తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇదంతా ఖాళీ పొలాలు అని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అమరావతి దాకా ఖాళీ స్థలం ఉందని, దానిని తీసుకోక పచ్చని మా భూములు తీసుకుంటున్నారన్నారు. పవన్ కళ్యాణ్ మాకు అండగా ఉండాలని కోరారు.