అంతా గప్చుప్గా: అభిమానులకు నో చెప్పిన పవన్ కళ్యాణ్, 'ఏమీ అర్థం కావట్లేదు'
తిరుపతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం తొమ్మిది గంటల సమయంలో భక్తులకు ఇబ్బంది కలగకూడదని వీఐపీ దర్శనం కాదని ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లపై క్యూలైనులో శ్రీవారిని దర్శించుకున్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లపై నేతలతో కలిసి దర్శించుకున్నారు.
Recommended Video

జేఈవో శ్రీనివాస రాజు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం హుండీ వద్దకు వెళ్లి కానుకలు సమర్పించారు. రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. జేఈవో తీర్థప్రసాదాలు ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా పవన్ను మీడియా ప్రతినిధులు చుట్టుముట్టగా.. పవిత్ర స్థలంలో రాజకీయాలు వద్దని చెప్పి, అక్కడి నుంచి హంపీ మఠం చేరుకున్నారు.

అధికారికంగా ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు కానీ
కాగా, పవన్ కళ్యాణ్ తిరుమల యాత్రపై వివిద రకాల ప్రచారం జరిగింది. ఆయన మూడు రోజులు అక్కడే ఉంటారని, అనంతరం అక్కడి నుంచి నేరుగా ఇచ్చాపురం వెళ్లి బస్సు యాత్ర ప్రారంభిస్తారని, సోమవారం పరిసర ప్రాంత ప్రజలను పరామర్శిస్తారని.. ఇలా ప్రచారం సాగింది. కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు.

పవన్ కళ్యాణ్ పర్యటన అంతా గప్చుప్గా
పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటన గప్చుప్గా ప్రారంభమైంది. ఏకాంతంగా, ఎవరికీ తెలియకుండా శ్రీవారి సన్నిధిలో గడపాలనుకున్నారని తెలుస్తోంది. కానీ ఆయనకు ఉన్న ఫాలోయింగ్.. కారణంగా అందరికీ తెలిసింది. పార్టీలోని ఒకరిద్దరికి తప్ప ఇతరులెవరికీ తెలియకుండా శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి విమానంలో రేణిగంట చేరుకొని, ఆ తర్వాత అలిపిరి నుంచి కాలి నడకన తిరుమల కొండపైకి చేరుకున్నారు. శనివారం అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో తిరుమల కొండపైకి చేరుకున్నారు. దర్శనం అనంతరం మఠం చేరుకున్నారు.

అభిమానులకు నో చెప్పిన పవన్ కళ్యాణ్
హంపి మఠం వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. వారిని కలిసేందుకు కూడా పవన్ అవకాశం ఇవ్వలేదు. కొందరు ఆందోళనకు దిగినా ససేమీరా అన్నారు. పవన్ దేవుడి సన్నిధిలో హుందాగా వ్యవహరించారని అంటున్నారు. అయితే కొందరు అభిమానులు, భద్రతా సిబ్బంది మాత్రం కొంత హడావుడి చేసిందని చెబుతున్నారు. అందర్నీ అదుపు చేసేందుకు టీటీడీ విజిలెన్స్, పోలీసులు ఇబ్బంది పడ్డారు.

పవన్ నిర్ణయాలు అంతుబట్టడం లేదు
ఇదిలా ఉండగా, జనసేన అధినేతగా పవన్ నిర్ణయాలు, కార్యకలాపాలు అంతుబట్టలేకుండా ఉన్నాయని ఆ పార్టీ నాయకులు, అభిమానులు చెబుతున్నారట. కాగా, పవన్ సోమవారం జాపాలి తీర్థంలోని శ్రీ ఆంజనేయస్వామి, ధర్మగిరి మార్గంలోని శ్రీ అభయాంజనేయస్వామి ఆలయాలను సందర్శించనున్నారని తెలుస్తోంది.

మంగళవారం తిరుగు ప్రయాణం
మంగళవారం తిరుగు ప్రయాణం సందర్భంగా తిరుపతి సమీపంలోని శెట్టిపల్లిలో భూసమస్యలు ఎదుర్కొంటున్న రైతులతో పాటు చిత్తూరులోని హైరోడ్డు నిర్వాసితులను కలవనున్నారని తెలుస్తోంది. అనంతరం తిరుపతిలో బస్సు యాత్రపై ప్రకటన చేసే అవకాశముందని అంటున్నారు. గతంలో హత్యకు గురైన వినోద్ రాయల్ కుటుంబ సభ్యులు తిరుమలలో పవన్ను ఆదివారం కలుసుకున్నారు.












Click it and Unblock the Notifications