మీరు అడగవద్దు, నేను చెప్పవద్దు: పవన్ కళ్యాణ్, 'అది శక్తికిమించిన పని'
తిరుమల: శ్రీవారి దర్శనం కోసం వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం మీడియాకు సరైన సమాధానం చెప్పారు. ఆయన శనివారం రాత్రి అలిపిరి నుంచి కొండమీదకు చేరుకొని, ఆదివారం ఉదయం క్యూలైన్లో కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు.
స్వామివారిని దర్శించుకొని వస్తుండగా మీడియా, అభిమానులు ఆయనను చుట్టుముట్టారు. పెద్ద ఎత్తున వచ్చిన అభిమానులను వారించడం భద్రతా సిబ్బందికి ఇబ్బందికరంగా మారింది. అభిమానుల తోపులాట మధ్య ఆయన కాన్వాయ్ వద్దకు చేరుకొని వెళ్లిపోయారు.
అలిపిరి నుంచి తిరుమల కొండపైకి నడిచిన పవన్, మఠంలో విడిది, అందరి భక్తుల్లా దర్శనం!
మీరు అడగవద్దు, నేను చెప్పవద్దు
కాగా, ఆయన ఆలయం నుంచి వస్తుండగా మీడియా ఆయన వద్దకు వెళ్లింది. దానికి పవన్ స్పందిస్తూ.. ఇక్కడ ఆలయ పవిత్రత కోసం దైవ సంబంధ విషయాలు మాట్లాడాలి తప్ప వేరే మాట్లాడవద్దని చెప్పారు. తాను స్వామి వారి ఆశీస్సుల కోసం వచ్చానని చెప్పారు. ఇలాంటి పవిత్ర స్థలంలో మీరు అడగవద్దు నేను చెప్పవద్దు (రాజకీయాలు) అన్నారు.
Recommended Video
ఇక్కడే నా అన్నప్రాసన, నామకరణం
తనకు నామకరణం జరిగింది, అన్నప్రాసన జరిగింది ఇక్కడేనని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. శ్రీవారి ఆలయంలోని యోగ నర్సింహ స్వామి సన్నిధిలో చేశారన్నారు. కాగా, పవన్ కళ్యాణ్ వెంకన్న దర్శనం అనంతరం హంపి మఠం చేరుకున్నారు.
బస్సు యాత్ర కోసం ఆశీస్సులు
కాగా, పవన్ కళ్యాణ్ త్వరలో ఏపీ వ్యాప్తంగా బస్సు యాత్ర చేయనున్నారు. ఇందుకోసం స్వామి వారీ ఆశీస్సులు తీసుకునేందుకు అలిపిరి నుంచి కాలి నడకన కొండపైకి చేరుకొన్నారు. ఆదివారం ఉదయం పది గంటలకు భక్తులకు ఇబ్బంది కలుగవద్దని వీఐపీ దర్శనం కాకుండా.. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్పై ఆలయంలోకి వెళ్లారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు పవన్ను ఆశీర్వదించారు. అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు.
మదర్స్ డే సందర్భంగా ప్రకటన
మదర్స్ డే అంటే అమ్మను తలచుకోవడం మాత్రమే కాదని, అమ్మ మనకు ప్రసాదించిన జీవితాన్ని తలచుకోవడమని పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన చేశారు. 'మదర్స్ డే అంటే అమ్మను తలచుకోవడం మాత్రమే కాదు. అమ్మ మనకు ప్రసాదించిన జీవితాన్ని తలచుకోవడం. ఈ జీవితాన్ని మనకు ప్రసాదించడంలో అమ్మ చేసిన త్యాగాన్ని తలచుకోవడం. మనకు నడక నేర్పిన, నడత నేర్పిన, భాష నేర్పిన, సంస్కారం నేర్పిన ప్రతి అనుభూతిని నెమరు వేసుకోవడమే మదర్స్ డే.' అన్నారు.
తల్లి రుణం శక్తికి మించిన, సామర్థ్యానికి అందని పని
మదర్స్ డే అంటే ఏదో ఏడాదికి ఒక రోజు తల్లిని తలచుకుని మిగిలిన రోజులు మొత్తం మరచిపోవడం కాదని, అమ్మంటే మనం జీవించి ఉన్న ప్రతిరోజూ కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన ఒక బాధ్యత అని, మనం ఏం చేసినా తీర్చుకోలేని ఒక రుణమని, అమ్మ నుంచి మనం పొందడం మాత్రమే ఉంటుందని, ఇవ్వడం అనేది మన శక్తికి మించిన, సామర్థ్యానికి అందని పని అన్నారు. 'మదర్స్ డే సందర్భంగా మాతృమూర్తులందరికీ శుభాభివందనాలు. ప్రతి వ్యక్తికీ మాతృమూర్తి ఒకరే ఉంటారు. కానీ ప్రపంచంలో ఉండే తల్లులందరిలోనూ ఒకే స్థాయితో కూడిన మాతృ హృదయం ఉంటుంది. అలాంటి ప్రతి తల్లికీ మనం మనసారా జేజేలు పలకాల్సిందే' అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.