భావితరాలకు వినూత్న కానుక.!తెలుగు భాషను వారసత్వ సంపదగా అందించాలన్న పవన్ కళ్యాణ్.!
అమరావతి/హైదరాబాద్: తెలుగు భాషలోని మాధుర్యం పట్ల, తెలుగు భాషలోని గొప్పదనం పట్ల, తెలుగు భాషకు ఉన్న ప్రాచీన ప్రాముఖ్యత పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా - తెలుగు వాళ్ళం అని చెప్పుకోవడంలో భావోద్వేగంతో పాటు సోదర భావం తన్నుకొస్తుందన్నారు పవన్ కళ్యాణ్. ఇందుకు ఆలంబన తెలుగు భాష మాత్రమేన్ననారు.
అటువంటి అమ్మ భాషను అనునిత్యం గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు జనసేనాని. భావి తరాలకు వారసత్వ సంపదగా తెలుగు భాషను అందిస్తామని తెలుగు వారందరూ నిశ్చయించుకున్నప్పుడే, తెలుగు భాషా దినోత్సవానికి సార్థకత చేకూరుతుందన్నారు పవన్ కళ్యాణ్. గ్రాంథికంలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల బాట పట్టించి వ్యావహారిక భాషకు పట్టం కట్టిన మహనీయులు శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారని అభినందించారు.
స్వర్గీయ గిడుగు వెంకట రామమూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించుకొంటున్నామన్నారు జనసేనాని. ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వ్యావహారిక తెలుగు భాష సొబగునీ, విలువనీ గుర్తెరిగి ఆ భాషను రచనల్లోకి తీసుకువచ్చేందుకు శ్రీ గిడుగు వారు ఉద్యమ స్ఫూర్తితో చేసిన కృషి వల్లే మన భాష విరాజిల్లుతోందన్నారు. ఆ స్ఫూర్తితోనే తెలుగు భాష పరిరక్షణకు పూనుకోవాలని, విద్యార్థి దశ నుంచే తెలుగు భాషను బాలలకు నేర్పించాలన్నారు.
ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలో సాగాలనే కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాన్ని విస్మరించకూడదన్నారు పవన్ కళ్యాణ్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాషను దూరం చేసే ప్రణాళికలపై భాషాభిమానులు, విద్యావేత్తలు అప్రమత్తం కావల్సిన అవసరం ఉందని గుర్తు చేసారు. విద్యార్థులకు తెలుగు నేర్పించడమే కాదు పాలనా వ్యవహారాల్లో సైతం తెలుగు వాడుక పెంచాలన్నారు. అన్ని వర్గాల వారూ తెలుగు భాష పరిరక్షణకు సన్నద్ధమైతేనే శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారికి నిజమైన నివాళి అర్పించగలమన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్.